ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ దేశాల్లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 28 AUG 2026 8:01PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఆగస్టు 29, 30 తేదీల్లో ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్‌కు, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కిర్గిజ్‌ దేశ పర్యటనకు వెళ్లనున్నారు.

 

ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు శ్రీ షవ్కత్‌ మిర్జియోయెవ్‌ ఆహ్వానం మేరకు ప్రధాని శ్రీ మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. ఇది ఉజ్బెకిస్థాన్‌లో ప్రధానికి నాలుగో పర్యటన. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు మిర్జియోయెవ్‌తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్‌ అనుసంధానం, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు తదితర రంగాల్లో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. అలాగే ‘వికసిత్‌ భారత్‌ 2047’, ‘ఉజ్బెకిస్థాన్‌–2030’ అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే అంశాలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు. తాష్కెంట్‌లోని శాస్త్రి స్మారకాన్ని, తాష్కెంట్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఓరియెంటల్‌ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శించే అవకాశం ఉంది.

 

తాష్కెంట్‌ నుంచి ఉజ్బెకిస్థాన్‌ పర్యటన అనంతరం కిర్గిజ్‌ గణతంత్ర దేశ అధ్యక్షుడు శ్రీ సదీర్‌ జపరోవ్‌ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో బిష్కెక్‌లో జరిగే 26వ ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. 2017 నుంచి ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యదేశంగా ఉన్న భారత్‌కు ఈ సదస్సు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. షాంఘై సహకార సంస్థ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ప్రధానమంత్రి భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే అంశాలపై భారత్‌ ప్రాధాన్యతలను వివరించనున్నారు. సదస్సు సందర్భంగా ఎస్‌సీఓ దేశాల నేతలతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. అలాగే మధ్య ఆసియా గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిర్వహించే 6వ వరల్డ్‌ నోమాడ్‌ గేమ్స్‌ ప్రారంభోత్సవంలో కూడా ప్రధాని పాల్గొంటారు.

 

***


(రిలీజ్ ఐడి: 2304459) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Odia , Tamil