సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
హైదరాబాద్లో ‘పరిశ్రమ అదాలత్’ కేసుల పరిష్కారం విలువ రూ.8.29 కోట్లు
ఎమ్ఎస్ఈలకు నగదు లభ్యత… సజావుగా వ్యాపారం
సంప్రదింపులు… ఓడీఆర్ వల్ల చెల్లింపులు సుసాధ్యం… లభిస్తున్న భరోసా
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2026 10:31AM by PIB Hyderabad
రూ.8.29 కోట్ల విలువ గల చెల్లింపులు నిలిచిపోయిన 65 కేసులను ‘పరిశ్రమ అదాలత్’ విజయవంతంగా పరిష్కరించింది, సూక్ష్మ, చిన్న పరిశ్రమల (ఎమ్ఎస్ఈ)కు చెల్లింపు వివాదాలను దృష్టిలో పెట్టుకొని ‘పరిశ్రమ అదాలత్’ ను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) మంత్రిత్వశాఖతో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య కమిషనరేట్ సంయుక్తంగా నిర్వహించాయి. హైదరాబాద్లో తెలంగాణ వాణిజ్య, పరిశ్రమ మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) కార్యాలయంలో నిర్వహించిన ఈ అదాలత్ కార్యక్రమంలో ఎమ్ఎస్ఈలు, కొనుగోలుదారు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎమ్ఎస్ఈ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ (ఏడీఆర్) సంస్థలతో పాటు ఎమ్ఎస్ఎమ్ఈ శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికీ చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఏదైనా సూక్ష్మ లేదా చిన్న వాణిజ్య పరిశ్రమకు చెల్లింపులు ఆలస్యమైతే, దాని ప్రభావం బిల్లులకే పరిమితం కాకుండా, వేతనాలు, ముడిసరుకు, రుణాలపైనా ప్రభావం చూపుతుంది. కొత్త వాణిజ్య అవకాశాలపైనా ఉంటుంది. సకాలంలో, సరైన పద్ధతిలో వివాదాన్ని పరిష్కరించుకోవడం వల్ల వాణిజ్యాన్ని సాఫీగా కొనసాగించడానికీ, సడలిన విశ్వాసాన్ని తిరిగి పొందడానికీ, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికీ ఎలా తోడ్పడగలదన్న అంశాన్ని ఈ ‘పరిశ్రమ అదాలత్’లో ప్రస్తావించారు.
చెల్లింపుల్లో జాప్యం వల్ల వాణిజ్య కార్యకలాపాలకు విఘాతం, సమస్యల గురించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వివరించడం ఈ సమావేశంలో చెప్పుకోదగిన అంశం. వివాద పరిష్కారాల ప్రభావం కొలిక్కి తెచ్చిన వ్యవహారాలకే పరిమితం కాకుండా, వాణిజ్య కార్యకలాపాల పురోగతిలో కూడా కనిపించినట్లు వారు వివరించిన అనుభవాలు సూచిస్తున్నాయి.
విజయ గాథలు: నిలిచిపోయిన చెల్లింపుల నుంచి వాణిజ్య కార్యకలాపాలు మళ్లీ జోరందుకోవడం వరకూ.
బకాయిల వసూలుతో తిరిగివచ్చిన విశ్వాసం: దీర్ఘకాలంగా చెల్లింపుల్లో జాప్యం జరిగినా, ఒప్పందానికి సంబంధించిన వివాదాలు తలెత్తినా పరిశ్రమ పొదుపు మొత్తాలకు, భరోసాకు పెద్ద కుదుపు ఎదురవుతుందని నీమస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధి శ్రీమతి శాలిని అన్నారు. నిలిచిపోయిన చెల్లింపు వ్యవస్థ ద్వారా ఈ కంపెనీ పదకొండు కేసులకు గాను తొమ్మిది కేసులను పరిష్కరింకున్నది. బకాయిలు వసూలైతే సంస్థ వాణిజ్య కార్యకలాపాలను తిరిగి కొనసాగించి, ముందుకు సాగవచ్చన్న నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతుందని ఆమె అన్నారు.

వాణిజ్య సంబంధాలను పరిరక్షించే రాజీ: ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు జవాబు ఇవ్వని ఓ కొనుగోలుదారు వద్ద నుంచి బకాయి సొమ్ము వసూలు అవడంతో పాటు కౌన్సిల్ కలగజేసుకోవడం వల్ల వాణిజ్య సంబంధాలు కూడా తిరిగి ఏర్పడ్డాయని నాగార్జునా అగ్రో కెమికల్స్కు చెందిన శ్రీ ముకుంద్ మహేశ్వరి అన్నారు. ‘‘నగదు అందడం పరిశ్రమకు ప్రాణవాయువుతో సమానం’’ అని ఆయన వర్ణించారు.
రెండేళ్ల నిరీక్షణకు నెలల వ్యవధిలో పరిష్కారం: బకాయిల వసూలుకు రెండు సంవత్సరాలుగా ఎదురు చూసినట్లు శ్రీ సొల్యూషన్స్కు చెందిన శ్రీ ఆత్మకూరి నమ్మాళ్వార్ అన్నారు. వివాద పరిష్కార వ్యవస్థ సాయంతో, తమ కంపెనీ నాలుగు కేసులను రెండు నెలల నుంచి నాలుగు నెలల లోపు పరిష్కరించుకొని, సుమారు రూ.30 లక్షలను వసూలు చేసుకొందని ఆయన వెల్లడించారు.
ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు అండగా సమ్మిళిత వివాద పరిష్కార వ్యవస్థ:
ఆలస్యం అయిన చెల్లింపుల విషయంలో…
వాణిజ్య కార్యకలాపాల దిశగా కదలికకు బాటను వేసిన ఓడీఆర్: తొమ్మిది కొనుగోలుదారు సంస్థలతో హైదరాబాద్ అమోనియా అండ్ కెమికల్స్ సంస్థ దాదాపు రూ.79 లక్షలు మేరకు జాప్యం జరిగింది. దీంతో సంస్థ నగదు పరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. ఓడీఆర్ వేదిక ద్వారా సంబంధిత పక్షాలతో మూడు రాజీ సమావేశాలు జరిగాయి. ఒక ప్రధాన కొనుగోలుదారు సంస్థ రూ.20 లక్షలు ఇవ్వగా, ఇతర కొనుగోలుదారు సంస్థలు కూడా వాటి బకాయిలను చెల్లించింది. మొత్తం రూ.54 లక్షలు రాబట్టుకొన్నట్లు ఈ కంపెనీ తెలిపింది.

ప్రతి కేసు వెనుకా ఓ వ్యక్తి: చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా తమ కంపెనీ రుణ ప్రొఫైల్పై ఎలాంటి ప్రభావం పడిందీ శబరి ఇండస్ట్రీస్ కు చెందిన శ్రీ గోపీ కృష్ణ వివరించారు. ఈ వ్యవస్థ సహాయంతో, తమ కంపెనీకి రెండు వాయిదాల్లో సుమారు రూ.40 లక్షలు అందాయని ఆయన తెలిపారు. ఓడీఆర్తో మూడు కేసులు పరిష్కారమయ్యాయని ఎ.పి. ఇంజినీరింగుకు చెందిన శ్రీ రంజిత్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.16 లక్షల కేసులో... చెల్లింపు చాలా కాలంగా ఆలస్యమై, చివరకు ఒప్పందం దిశగా అడుగులు పడ్డాయని పాండురంగ ఎంటర్ప్రైజెస్కు చెందిన శ్రీ శ్రీనివాసులు వెల్లడించారు.
ఓడీఆర్.. సాంకేతికతనీ, సంస్థల్నీ, మానవ ప్రమేయాన్నీ ఒక చోటుకు తీసుకురావడం
ఆన్లైన్ డిస్ప్యూట్ రిడ్రెసల్ (ఓడీఆర్) వేదికను 2025లో ప్రారంభించారు. ఇది వివాదాల పరిష్కార ప్రక్రియలోకి సాంకేతికతను ప్రవేశపెట్టి, డిజిటల్ మాధ్యమంలో బాటను వేసింది. చెల్లింపుల్లో జాప్యం జరిగిన వ్యవహారాల్ని ముందుకు తీసుకుపోవడం దీని ద్వారా సాధ్యపడుతుంది. ఇక ఎమ్ఎస్ఈ ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల విషయానికి వస్తే, అవి పోషించే సంస్థాగత భూమిక.. పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఉంటోంది.
ఆలస్యమైన చెల్లింపులకు సంబంధించి ఓ ప్రాథమిక ప్రణాళికను ‘సమాధాన్’ వెబ్సైట్ మొదలు ఓడీఆర్ వేదిక వరకూ ఎలా అభివృద్ధిపరిచిందీ ఎమ్ఎస్ఎమ్ఈ శాఖలో ఆర్ఏఎమ్పీ డైరెక్టరు అంకిత పాండే వివరించారు. తెలంగాణాలో ఓడీఆర్ విస్తారిత అనుబంధ వ్యవస్థ ద్వారా 800 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయనీ, వాటిలో దాదాపు 85 కేసులను పరిష్కరించారనీ కార్యక్రమంలో ప్రస్తావించిన గణాంకాలు సూచిస్తున్నాయి.

ఈ కార్యక్రమం తెలంగాణ అనుసరిస్తున్న విస్తృత ఎమ్ఎస్ఎమ్ఈ అజెండా లో ఓ భాగమని ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల కమిషనరు శ్రీ జె. నిఖిల్ చక్రవర్తి తెలిపారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా సాంకేతికత, సంస్థాగత పరిష్కారాలు దోహదపడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

వివాద పరిష్కార వ్యవస్థ ఎన్ని కేసుల్ని కొలిక్కితీసుకొచ్చిందని కాక, ఎన్ని వాణిజ్య సంస్థలు ముందుకు పోవడానికి సాయపడిందనేదే ఆ వ్యవస్థ విజయానికి కొలబద్ద అవుతుందని ‘పరిశ్రమ అదాలత్’ స్పష్టం చేసింది. రాజీ, సంస్థాగత యంత్రాంగాలు, డిజిటల్ సాధనాలు.. వీటిని ఒక చోటుకు చేర్చి, ఈ ‘పరిశ్రమ అదాలత్’ కార్యక్రమం ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు, చట్టబద్ధ క్లెయిముకు, సంభావిత పరిష్కారానికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2303079)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9