భారత పోటీ ప్రోత్సాహక సంఘం
పోటీని దెబ్బతీసే చర్యలకు పాల్పడినందుకుగాను
ఆగ్రో ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్, ఆగ్రో ఇన్పుట్ వెల్ఫేర్ అసోసియేషన్లపై ఆర్థిక, ఆర్థికేతర ఆంక్షలను విధించిన సీసీఐ
प्रविष्टि तिथि:
21 AUG 2026 6:42PM by PIB Hyderabad
సిండికేట్ గా ఏర్పడి పోటీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆగ్రో ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ (ఏఐడీఏ), ఆగ్రో ఇన్పుట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏఐడబ్ల్యూఏ) పైనా, మన్మోహన్ సి. కలంత్రి, అరవింద్భాయ్ జెరంభాయ్ పటేల్ పైనా పోటీ చట్టం - 2002లోని సెక్షన్ 27 కింద భారత పోటీ (కాంపిటీషన్) కమిషన్ (సీసీఐ) ఆర్థిక, ఆర్ధికేతర ఆంక్షలు విధించింది.
ఈ వ్యవహారంలో ఏఐడీఏ, ఏఐడబ్ల్యూఏ, కలంత్రి, పటేల్లు పోటీ చట్టంలోని సెక్షన్ 3(1)తో కలసి ఉన్న సెక్షన్ 3(3)(బి) నిబంధనలను ఉల్లంఘించినట్లు కమిషన్ నిర్ధారించింది. ఈ మేరకు, చట్టంలోని సెక్షన్ 27(ఏ) ప్రకారం చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలినందున సంస్థలు, వారి ప్రతినిధులు ఏఐడీఏ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రవీణ్ భాయ్ పటేల్, ఏఐడీఏ జాతీయ ప్రతినిధి శ్రీ సంజయ్ కుమార్ రఘువంశీలను భవిష్యత్తులో ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని కమిషన్ ఆదేశించింది. చట్టంలోని సెక్షన్ 48 నిబంధనల కింద వీరిని బాధ్యులుగా నిర్ధారించింది.
ఉల్లంఘన స్వభావం, తీవ్రతను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ ఏఐడీఏపై రూ. 81,889, ఏఐడబ్ల్యూఏపై రూ. 3,92,269, కలాంత్రికి రూ. 4,98,903, అరవింద్ భాయ్ జేరాంభాయ్ పటేల్కి రూ. 74,717, ప్రవీణ్ భాయ్ పటేల్కి రూ. 9,177, రఘువంశీకి రూ. 8,622 చొప్పున జరిమానాలు విధించింది.
చట్టంలోని సెక్షన్ 27(జీ) ప్రకారం, పోటీ చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు తమ సంఘాల్లో పోటీ చట్టాల నిబంధనలను పాటించే సంస్కృతిని ప్రోత్సహించేందుకు సంబంధిత సంస్థలు పోటీ చట్టాల అనుసరణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిషన్ ఆదేశించింది.
కేసు నంబర్ 06/2023 లో జారీ చేసిన ఉత్తర్వు పబ్లిక్ వెర్షన్ ప్రతిని సీసీఐ వెబ్సైట్ www.cci.gov.in లో అందుబాటులో ఉంచారు.
***
(रिलीज़ आईडी: 2302234)
आगंतुक पटल : 9