సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ పరిపాలన, పాలనా సంస్కరణల రంగంలో సహకారంపై భారత్ - మలేషియా రెండో సంయుక్త కార్యబృంద సమావేశం
ప్రభుత్వ పరిపాలన, పాలనా సంస్కరణలు, సామర్థ్యాభివృద్ధి, అత్యుత్తమ విధానాల పరస్పర వినిమయంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసిన భారత్ - మలేసియా
భారత జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్సీజీజీ), మలేషియా ప్రభుత్వ సేవల విభాగం మధ్య కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే చర్యలపై ఇరుపక్షాల మధ్య చర్చ
प्रविष्टि तिथि:
19 AUG 2026 4:03PM by PIB Hyderabad
‘ప్రభుత్వ పరిపాలన, పాలనా సంస్కరణల రంగంలో సహకారం’పై రెండో భారత్ - మలేషియా సంయుక్త కార్యబృంద (జేడబ్ల్యూజీ) సమావేశాన్ని 2026 ఆగస్టు 18న నిర్వహించారు. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ (డీఏఆర్పీజీ) అదనపు కార్యదర్శి శ్రీ పునీత్ యాదవ్, మలేషియా ప్రభుత్వ సేవల (అభివృద్ధి) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దాతుక్ డాక్టర్ మహమ్మద్ బఖారీ బిన్ ఇస్మాయిల్ ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. భారత్ తరఫున డీఏఆర్పీజీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ (కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ సహా), జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్సీజీజీ) ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మలేషియా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ శ్రీ పునీత్ యాదవ్ ప్రసంగించారు. భారత్ - మలేషియా మధ్య దీర్ఘకాలిక, బహుముఖ సంబంధాలకు.. బలమైన ప్రజా సంబంధాలు, ఉమ్మడి విలువలు, పరస్పర ప్రయోజనాలు ప్రాతిపదికగా నిలిచాయని ఆయన వ్యాఖ్యానించారు. 2024 ఆగస్టులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు.. ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెరిగాయనీ, అలాగే 2026 ఫిబ్రవరిలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మలేషియా పర్యటన ద్వారా ద్వైపాక్షిక సహకారానికి మరింత బలం చేకూరిందని ఆయన పేర్కొన్నారు.
2024 నవంబరు 13న నిర్వహించిన మొదటి సమావేశం నాటి నుంచి సాధించిన పురోగతిని సంయుక్త కార్యబృందం సమీక్షించింది. ప్రారంభ సమావేశ చర్చాంశాలను ధ్రువీకరించి ఆమోదించడంతోపాటు.. పరస్పరం అంగీకరించిన కార్యక్రమాల్లో సమన్వయాన్నీ, వాటి అమలునూ వేగవంతం చేయడం కోసం ఇరువైపులా ప్రతినిధులను నియమించారు.
భారత సాంకేతిక, ఆర్థిక సహకార (ఐటీఈసీ) కార్యక్రమం కింద సామర్థ్యాభివృద్ధిలో ప్రస్తుత సహకారంపై సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించి బోధన విభాగాలు, సంస్థాగత, క్షేత్రస్థాయి పర్యటనలు, కార్యక్రమ సమన్వయం, ప్రతినిధులకు అందించిన ఆతిథ్యంపై మలేషియా బృందం సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2026, 2027 బృందాలకు సంబంధించి ప్రతిపాదిత సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చించారు. మలేషియా ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలన్న ప్రతిపాదనను మలేషియా పక్షం స్వాగతించింది.
ప్రభుత్వ రంగ ఆధునికీకరణ, పరిపాలన సంస్కరణలపై అనుభవాలను పంచుకునేందుకూ ఈ సమావేశం వేదికైంది. ప్రజలు, ప్రక్రియలు, సాంకేతికత ప్రాతిపదికగా.. ఆవిష్కరణలే ప్రధాన చోదక శక్తిగా ప్రభుత్వ రంగాన్ని తీర్చిదిద్దాలన్న తమ విధానాన్ని మలేషియా వివరించింది. ప్రజలే కేంద్రంగా సులభతరమైన, వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా.. డిజిటల్ పాలన, కృత్రిమ మేధ, క్లౌడ్ సేవలు, ఉమ్మడి డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత, బ్లాక్చైన్, డేటా ఆధారిత నిర్ణయాలు, సమగ్ర అనుసంధాన ప్రభుత్వం వంటి అంశాలపైనా ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయి.
ఫిర్యాదుల పరిష్కారానికి ఉద్దేశించిన ప్రపంచంలోని అతిపెద్ద 24x7 డిజిటల్ ప్రజా అనుసంధాన వేదిక అయిన.. ‘కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార, పర్యవేక్షణ వ్యవస్థ (సీపీజీఆర్ఏఎంఎస్)’ పరిధిలో ప్రజా ఫిర్యాదుల కేంద్రీకృత పరిష్కార వ్యవస్థను భారత్ పక్షం వివరించింది. మరింత వేగవంతమైన, పారదర్శకమైన, ప్రజా కేంద్రీకృత పాలన కోసం ఏఐతోపాటు అధునాతన సాంకేతికతలను ఉపయోగించడంలో డీఏఆర్పీజీ కృషికి ‘సమాధాన్ దీదీ’ నిదర్శనం. 2026 మే 30న ప్రారంభించిన ఏఐ ఆధారిత వాయిస్ చాట్బాట్ సమాధాన్ దీదీ.. బహుభాషా సౌకర్యంతో సీపీజీఆర్ఏఎంఎస్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చి, సానుకూలంగా మార్చింది. ఈ చాట్బాట్ సంభాషణాత్మక ఏఐ సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు వేగవంతమైన, సరళతరమైన, యూజర్ ఫ్రెండ్లీ సమాధానాలను అందిస్తుంది.
మలేషియా-ఇండియా పరిపాలన భాగస్వామ్యం: 2027-2029 వ్యూహాత్మక ప్రణాళిక కోసం కార్యాచరణ ప్రణాళికను మలేషియా పక్షం సమర్పించింది. ఒప్పందం పరిధిలోని వివిధ అంశాల అమలు కోసం మూడేళ్ల నివేదికను అందిస్తూ... పరిపాలన, అమలు వ్యవస్థ కోసం రూపొందించిన ఈ ప్రణాళికపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
డీఏఆర్పీజీ, ఎన్సీజీజీ, భారత హైకమిషన్ అందించిన సహకారాన్ని మలేషియా బృందం అభినందించింది. అనుభవాలూ, అత్యుత్తమ పద్ధతులపై పరస్పర చర్చలను ఇరుపక్షాలూ స్వాగతించాయి. సహకారం ఆవశ్యకమైన నిర్దిష్టమైన, ఆచరణాత్మకమైన, స్పష్టమైన ఫలితాలు ప్రాతిపదికగా ఉండే అంశాలను గుర్తించాలని నిర్ణయించారు. ప్రభుత్వ సంస్థల బలోపేతం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, ప్రజల సౌలభ్యాన్ని పెంచడం లక్ష్యంగా.. సంస్థాగత భాగస్వామ్యం, వైజ్ఞానిక వినిమయం, సామర్థ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు.. సమావేశం ముగింపు సందర్భంగా ఇరుపక్షాలూ పునరుద్ఘాటించాయి.
***
(रिलीज़ आईडी: 2301351)
आगंतुक पटल : 15