ప్రధాన మంత్రి కార్యాలయం
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం
మన కలలు, సంకల్పం, బలంతో ముందుకు సాగాల్సిన రోజు ఇది: పీఎం
దృఢ సంకల్పంతో గొప్ప కలను సాకారం చేసుకునే దిశగా నేడు భారత్ అడుగులు.. 2047 నాటికి, స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి వికసిత్ భారత్ నిర్మించాలన్నదే ఆ కల: పీఎం
మనల్ని మనం విశ్వసించాలి... గౌరవంగా ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించాలి: పీఎం
పలు రంగాల్లో ఒకప్పుడు 'ప్రవేశం లేని ప్రాంతం' స్థాయి నుంచి 'అనుమతి గల ప్రాంతం' స్థితికి మార్పు: పీఎం
మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని అందుకుంటున్న ప్రతి భారతీయుడు: పీఎం
భారత్కు స్థిరమైన రాజకీయ ఆదేశం, స్థిరమైన ప్రభుత్వం, శక్తిమంతమైన ప్రజాస్వామ్యం, బలమైన న్యాయ వ్యవస్థ, మనందరికీ మార్గనిర్దేశం చేసే రాజ్యాంగం: పీఎం
మనం దృష్టి సారించాల్సిన మూడు అంశాలు... ధర, నాణ్యత, విస్తృతి: పీఎం
పోటీతత్వంతో కూడిన పరిశ్రమలు, వినియోగదారులకు అనుకూలమైన ఉత్పత్తులు, అత్యుత్తమ ప్యాకేజింగ్ అవసరం: పీఎం
శాంతి, అభివృద్ధి, నూతన ఆశలతో ఒకప్పటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు: పీఎం
రాబోయే ఏళ్లలో భారత్ను ముందుకు నడిపించి, దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చనున్న సప్తధారలు: పీఎం
प्रविष्टि तिथि:
15 AUG 2026 3:04PM by PIB Hyderabad
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. "మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
భారతదేశంలో ఇటీవల సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రభావితమైన పౌరులకు సంఘీభావం తెలుపుతూ.. ఈ క్లిష్ట సమయంలో దేశం వారి వెంటే ఉంటుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. "దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు మాతో పాటు యావత్ దేశం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
జాతీయ గొప్పతనానికి సంబంధించిన ప్రధాన సూత్రాలను స్పష్టం చేస్తూ.. ఒక దేశం సొంత ఆకాంక్షలపై, బలమైన సామర్థ్యాలపై ఆధారపడినప్పుడే నిజమైన విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. "ఏ దేశమైనా కలలు, ఆశయాల బలంతో ముందుకు సాగినప్పుడే గొప్పదిగా మారుతుంది. లక్ష్యాలను సాధిస్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
జాతీయ పరిధిని విస్తృతం చేసే విశాలమైన దృక్పథాల కోసం చిన్న ఆశలను విస్మరించాలని పౌరులను కోరుతూ, సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ధృడమైన సంకల్పం సహజంగానే బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. "సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు, విపత్తుల నుంచి గట్టెక్కే మార్గాలను కనుగొనే సామర్థ్యం వాటంతట అదే ఉద్భవిస్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఆశయానికి, వాస్తవ రూపం దాల్చిన సామర్థ్యానికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని వివరిస్తూ.. ఉన్నతమైన కలలు జాతీయ ప్రయత్నాల పరిధిని, ఖచ్చితమైన స్థాయిని సహజంగానే పెంచుతాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. "కలలు, సంకల్పాలు ఉన్నతంగా ఉన్నప్పుడు మన సామర్థ్యం కూడా పెరుగుతుంది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
అత్యున్నత జాతీయ దృక్పథాన్ని ప్రకటిస్తూ.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృఢ సంకల్పాన్ని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇది భారతదేశ అపారమైన ధైర్యాన్ని, సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించేలా చేస్తుందన్నారు. "140 కోట్ల మంది దేశ ప్రజల కృషితో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి మనం కచ్చితంగా వికసిత్ భారత్ను సాధిస్తాం" అని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల ప్రజల సమష్టి అంకితభావాన్ని కొనియాడుతూ... గత 12 ఏళ్లలో మానవ సాధికారత, ఆర్థిక పరివర్తనపై ప్రధానమంత్రి సమగ్ర నివేదికను అందజేశారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని, భారతదేశం 'బలహీనమైన ఆర్థిక వ్యవస్థ' నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారిందని స్పష్టం చేశారు. "దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చేందుకు ప్రతీ పౌరుడు పూర్తి అంకితభావంతో సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశారు" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సరైన వేగం లేకపోవటం వల్ల గతంలో జరిగిన నష్టాన్ని గుర్తుచేసుకుంటూ.. ఇటీవల కాలంలో వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రధానమంత్రి కొనియాడారు. ప్రజల ఉమ్మడి సంకల్పం ఇప్పుడు ఆపేందుకు వీలులేనిదని అన్నారు. "భారతదేశం అద్భుతమైన నూతనోత్తేజాన్ని పుంజుకుంది. ఇప్పుడు 140 కోట్ల మంది దేశ ప్రజల సామర్థ్యాన్ని ఆపడం అసాధ్యం" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
తయారీ రంగం, డిజిటల్ వృద్ధి, పౌర సేవలందించటంలో గత 12 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రధానమంత్రి తెలియజేశారు. రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగిందని, ఖాదీ, గ్రామ పరిశ్రమలు 5 రెట్లు వృద్ధిని సాధించాయని, ఎలక్ట్రానిక్స్ తయారీ దాదాపు 7 రెట్లు విస్తరించిందని, రైల్వే కోచ్ల ఉత్పత్తి 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. డిజిటల్ ఆవిష్కరణలు, ఇంటర్నెట్ వినియోగదారులు 4 రెట్లు పెరిగారని, మంజూరైన పేటెంట్ల సంఖ్య 4 రెట్లు, డిజిటల్ లావాదేవీలు 100 రెట్లు పెరిగినట్లు తెలిపారు. నల్లా నీటి కనెక్షన్లు 15 రెట్లు వేగంగా, ఎల్పీజీ కనెక్షన్లు 6 రెట్లు వేగంగా, మరుగుదొడ్ల నిర్మాణం 4 రెట్లు, పక్కా ఇళ్ల నిర్మాణం 3 రెట్లు వేగంగా జరగటం ద్వారా ప్రాథమిక వసతుల కల్పన వేగంగా జరిగినట్లు వెల్లడించారు. కాలం చెల్లిన వందలాది చట్టాలు రద్దు చేసినట్లు చెప్పారు. "ఇన్ని భారీ విజయాలు మన ముందున్నప్పుడు, వికసిత్ భారత్ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
విదేశీ చౌక దిగుమతులపై ఆధారపడే ఆలోచనను వ్యతిరేకిస్తూ... స్వావలంబన, దేశ గౌరవ ప్రాధాన్యతను చెప్పారు. శక్తిమంతమైన దేశీయ సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలకు మద్దతిచ్చారు. "మనం సొంత సామర్థ్యాలను క్రమపద్ధతిలో పెంచుకోవాలి. మన ప్రయోజనాలను మనమే సురక్షితంగా కాపాడుకోవాలి" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
వేగవంతమైన సాంకేతిక పురోగతిని, స్వావలంబన కోసం దేశం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ... అత్యంత కీలకమైన సెమీ కండక్టర్ల ప్రపంచ ప్రాముఖ్యతను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రధాన ప్రగతి నివేదికను గర్వంగా ప్రకటిస్తూ... ఇప్పటికే మూడు దేశీయ సెమీ కండక్టర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, ప్రపంచ మార్కెట్లకు చిప్లను ఎగుమతి చేస్తున్నాయని తెలిపారు. రాబోయే ఒకటి, రెండేళ్లలో 7 నుంచి 8 కొత్త ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. "వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగేందుకు ఈ స్వావలంబన ఖచ్చితమైన రాజమార్గాన్ని చూపిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
వనరుల భద్రత వ్యూహాత్మక ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ.. బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్, క్రిటికల్ మినరల్స్ కారిడార్ ప్రారంభం గురించి ప్రధానమంత్రి వివరించారు. విస్తృతమైన అంతర్జాతీయ ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ భాగస్వామిగా భారత్ను నిలబెట్టాయన్నారు. "ఈ కీలక ఖనిజాల వ్యూహాత్మక దిశలో ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు భారత్ను బలంగా విశ్వసిస్తున్నాయి" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్తో సాంకేతిక పురోగతిని అనుసంధానిస్తూ... శాంతి చట్టం ద్వారా జరిగిన కీలక ఇంధన సంస్కరణలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. 2047 నాటికి 100 జీడబ్ల్యూ అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో పాటు ఫాస్ట్ బ్రీడర్ అణు సాంకేతికతలో సాధించిన నైపుణ్యంతో 6 నుంచి 7 ఏళ్లలోగా 5 కొత్త రియాక్టర్లు అందుబాటులోకి వస్తాయని విధానపరమైన ప్రకటన చేశారు. "అత్యంత కీలకమైన అణు ఇంధన విషయంలో పూర్తిగా స్వావలంబన సాధించే దిశగా మేం కీలక ముందడుగును విజయవంతంగా వేశాం" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
గతంలో జాతీయ వనరుల అన్వేషణను అడ్డుకున్న పరిమిత విధానాలను విమర్శిస్తూ... దేశీయ చమురు, సహజ వాయువు అభివృద్ధిలో సాహసోపేతమైన విధాన మార్పును ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశ తీరప్రాంతంలో 99 శాతం భాగాన్ని 'ప్రవేశం లేని ప్రాంతం' నుంచి 'అనుమతి ప్రాంతం'గా మార్చటం ద్వారా కొత్త ఇంధన నిల్వలను వెలికితీసేందుకు రూ. 85,000 కోట్ల వ్యయంతో భారీ సముద్ర గర్భ కార్యచరణలను ప్రారంభించినట్లు తెలిపారు. “పలు ప్రాంతాలకు మేం నిర్ణయాత్మకంగా అనుమతినిచ్చాం. ఇప్పుడు సముద్రంలో భారీగా కొత్త నిల్వలను కనుగొనటంపై దృష్టి సారిస్తున్నాం" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రత్యామ్నాయ ఇంధన మౌలిక సదుపాయాల వేగవంతమైన విస్తరణను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి... గత ప్రభుత్వాల కాలంలో స్తబ్దతకు, గడిచిన 12 ఏళ్లలో సాధించిన భారీ పురోగతికి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. గ్యాస్ పంపిణీ 70 నగరాల నుంచి 700 నగరాలకు విస్తరించిందనీ, పైపుల ద్వారా వంటగ్యాస్ 1.75 కోట్ల గృహాలకు చేరిందనీ తెలిపారు. సౌర విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. "పన్నెండేళ్లలో పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే నెట్వర్క్ను 70 నుంచి 700 నగరాలకు విస్తరించడమే అసలైన వేగం.. సంపూర్ణమైన విస్తరణ" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పునరుత్పాదక ఇంధనం ద్వారా మధ్యతరగతి ప్రజలకు కలిగే ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను వివరిస్తూ... ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వేగవంతమైన విజయాన్ని ప్రశంసించారు. ఈ ఉచిత సౌర విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 80,000 వరకు ఆర్థిక సహాయం అందించి, వారి విద్యుత్ బిల్లులను సున్నాకు తగ్గించామన్నారు. మిగులు విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే కుటుంబాల సంఖ్య 50 లక్షల పైగా ఉందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. "వేలాది కుటుంబాలు ఈ రోజు అదనపు విద్యుత్ను విక్రయించి ఆదాయం పొందుతున్నాయి. మేం ఈ బృహత్తర కార్యాన్ని వేగంగా పూర్తి చేస్తున్నాం" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రైల్వే మౌలిక సదుపాయాల్లో చారిత్రక స్తబ్దతను, ఆధునిక సామర్థ్యంతో పోలుస్తూ... గత ప్రభుత్వాలు 90 ఏళ్లలో కేవలం 30 శాతం విద్యుదీకరణను మాత్రమే సాధించాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఒక దశాబ్దంలోనే నెట్వర్క్ వ్యాప్తంగా సంపూర్ణ కవరేజీని సాధించి, పర్యావరణానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "ఈ ఒక్క దశాబ్దంలోనే మేం భారీ విద్యుదీకరణ పనులను 100 శాతం పూర్తి చేసి, దిగుమతి చేసుకునే డీజిల్ను విజయవంతంగా ఆదా చేశాం" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
భవిష్యత్ ఇంధన రంగంలో ఒక ప్రధాన పురోగతిని ప్రకటిస్తూ... ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తిమంతమైన హైడ్రోజన్ రైలుగా అభివృద్ధి చేస్తున్న భారత తొలి 'మేడ్-ఇన్-ఇండియా' హైడ్రోజన్ రైలు గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "ప్రపంచ హైడ్రోజన్ రైళ్ల రంగంలో భారత్ సగర్వంగా, దృఢంగా తనదైన ముద్ర వేసింది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
2047 అభివృద్ధి లక్ష్యాల దిశగా సాగుతున్న సంక్షోభభరిత ప్రయాణాన్ని... కోవిడ్-19 మహమ్మారి వంటి తీవ్రమైన ప్రపంచ సంక్షోభాలను... ఉక్రెయిన్, పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ ఘర్షణలను భారత్ సమర్థంగా అధిగమించిన తీరును సమీక్షిస్తూ... నిరూపితమైన భారత్ స్థైర్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. దుష్ప్రచారాలు చేసే వారిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ముందుచూపుతో కూడిన ప్రణాళిక, పటిష్ఠమైన సన్నాహాలతో దేశీయంగా సంపూర్ణ స్థిరత్వాన్ని సాధించామని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. "మన సునిశ్చిత ప్రణాళికలు మంచి ఫలితాలనివ్వడం దేశమంతా స్పష్టంగా చూసింది. అందుకే ఈ రోజు మనం మన సొంత శక్తితో పూర్తి బలంగా నిలబడి ఉన్నాం" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సంక్షోభాల నుంచి దేశీయ రైతులను కాపాడటంలో ప్రభుత్వం పోషిస్తున్న అత్యంత చురుకైన పాత్రనూ ప్రధానమంత్రి ప్రస్తావించారు. వ్యవసాయ సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ దృఢమైన నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.3,000 విలువ గల యూరియాను రూ.300 కన్నా తక్కువ ధరకే... రూ.5,000కు పైగా ఖరీదు చేసే డీఏపీని కేవలం రూ.1,350కే మన రైతులకు అందించడానికి ప్రభుత్వం భారీ వ్యయాలను భరించిందని ఆయన పేర్కొన్నారు. "ఈ రోజూ, ఆ భారీ భారాన్ని దేశ రైతులపై మేం మోపడం లేదు, ప్రభుత్వమే దానిని భరిస్తోంది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
స్వయం-సమృద్ధిని గతంలో విమర్శించిన వారి వాదనలను తోసిపుచ్చుతూ... గత దశాబ్ద కాలంలో దేశాలు కీలక వనరులను ఆయుధాలుగా వాడుకుంటున్న తీరు ప్రపంచ నమూనాలో భారీ మార్పును చూపుతోందన్నారు. ఇది దేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతనూ స్పష్టం చేస్తోందని ప్రధానమంత్రి గమనించారు. "స్వయం-సమృద్ధి అనే శక్తిమంతమైన మంత్రాన్ని స్వీకరించి, మనం సరైన దిశలో దృఢంగా ముందుకు సాగకపోయి ఉంటే... ఇంతటి భారీ సవాళ్లను సమర్థంగా ఎలా ఎదుర్కోగలిగేవాళ్లం?" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయంగా దేశానికి పెరుగుతున్న గౌరవానికి సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ, శక్తిమంతమైన ప్రజాస్వామ్యమే కారణమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశీయంగా నెలకొన్న ఈ సుస్థిరత... 2014 తర్వాత సుమారు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను విజయవంతంగా సులభతరం చేసిందన్నారు. తద్వారా వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, వస్త్ర రంగం, ఎంఎస్ఎంఈ రంగాల్లో ఎగుమతులకు భారీగా అవకాశాలను కల్పించిందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "నేడు, యావత్ ప్రపంచం అత్యంత ఆమోదించే, ఎంతో గౌరవించే దేశంగా భారత్ వేగంగా ఎదుగుతోంది" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న భారీ వాణిజ్య అవకాశాలను దూకుడుగా అందిపుచ్చుకోవాలని దేశీయ పరిశ్రమలను కోరారు. లుధియానా, తిరుప్పూర్ నుంచి తీరప్రాంత సముద్ర సంబంధ ఆహార కేంద్రాల వరకు... భారతీయ ఉత్పత్తులు, నాణ్యత, అందుబాటు ధరల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను కచ్చితంగా అధిగమించి ప్రపంచ మార్కెట్లలో ఆధిపత్యం చెలాయించాలని ప్రధానమంత్రి సూచించారు. "ప్రస్తుతం మనం ప్రపంచం నుంచి పొందుతున్న వాటి కంటే మెరుగైన, చవకైన ఉత్పత్తులను మనం కచ్చితంగా ప్రపంచానికి అందించాలి" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఈ తక్షణ ఆర్థిక వ్యూహాలను అంతిమ జాతీయ దార్శనికతతో నేరుగా అనుసంధానిస్తూ... ప్రపంచ ఆధిపత్యం కోసం చేసే దూకుడైన ప్రయత్నమే గొప్ప అభివృద్ధి లక్ష్యాలు దృఢంగా నిలిచేందుకు బలమైన పునాది అవుతుందని ప్రధానమంత్రి వివరించారు. "మన దేశ ప్రజలు సగర్వంగా ప్రదర్శించే అద్భుత సామర్థ్యంతోనే వికసిత్ భారత్ లక్ష్యం ముడిపడి ఉంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
జాతీయ పని సంస్కృతి, ఆలోచనా విధానం, అమలు వేగంలో సమూల మార్పును కోరుతూ... గత కొన్ని దశాబ్దాలుగా స్తంభించిపోయిన లక్ష్యాలను, కేవలం ఐదు నుంచి ఏడేళ్లలో సాధించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని కష్టపడి పనిచేసే శ్రామిక శక్తిపై ఆయన అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. "నా దేశ యువశక్తి, తల్లులు, సోదరీమణులు, రైతులు, కార్మికులపై నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. మనమంతా కలిసి ఈ మహత్తర లక్ష్యాన్ని కచ్చితంగా సాకారం చేసుకోగలం" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
నిర్మాణాత్మక మార్పు పట్ల అలుపెరుగని ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... సమగ్ర పాలన, పరిపాలనా సంస్కరణలు బాహ్య ఒత్తిడి వల్ల కాకుండా కేవలం ప్రగాఢమైన అంతర్గత విశ్వాసంతోనే కొనసాగగలవని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తదుపరి స్థాయి సంస్కరణలను ముందుకు నడిపించడం కోసం కేంద్రం, రాష్ట్రాలు, సమాజం ఏకమై పనిచేయాల్సిన సహకార సమాఖ్యవాదానికి ఆయన పిలుపునిచ్చారు. "మా ఈ సంస్కరణ ఒక సంపూర్ణ విశ్వాసం. రాబోయే రోజుల్లో మేం తదుపరి స్థాయి సంస్కరణల దిశగా దూకుడుగా ముందుకు సాగబోతున్నాం" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
సప్త సింధు ప్రాచీన నాగరిక శక్తిని స్మరించుకుంటూ... ఒక శక్తిమంతమైన నూతన వ్యూహాత్మక విధాన ప్రణాళికను ప్రధానమంత్రి ప్రకటించారు. పరివర్తనాత్మక సప్తధార లేదా సప్త శక్తిని ఆవిష్కరించడం ద్వారా దేశం తదుపరి ముందడుగు వేయాలనే భవిష్యత్ దార్శనికతకు శ్రీ మోదీ పిలుపునిచ్చారు. యువత అపారమైన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే ఈ ఏడు గతిశీల శక్తి ప్రవాహాలు, దేశాన్ని అత్యున్నత శిఖరాల దిశగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. "ఈ సప్త శక్తి ప్రవాహాల వ్యూహపు అపారమైన సామర్థ్యం, శక్తితో... మేం దూకుడుగా దేశానికి కొత్త శిఖరాన్నీ, కొత్త వేగాన్నీ అందిస్తాం" అని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.
'తయారీ శక్తి'ని కీలకమైన మొదటి ప్రవాహంగా గుర్తించిన ప్రధానమంత్రి... సంపూర్ణ దేశీయ వాణిజ్య కార్యకలాపాల్లో చిన్న విభాగాలూ, భారీ తుది ఉత్పత్తులూ రెండింటిపైనా పట్టు సాధించడం ద్వారా తయారీ రంగాన్ని దూకుడుగా విస్తరించాలని పిలుపునిచ్చారు. లోపరహితమైన కచ్చితత్వం, వ్యయ సామర్థ్యం, ప్రపంచ స్థాయి నాణ్యత పట్ల రాజీలేని నిబద్ధతపై మరింత దృష్టి సారించాలని ఆయన కోరారు. "రూపకల్పన నుంచి పూర్తిస్థాయి తయారీ దాకా, భారత్ తప్పనిసరిగా ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థలో అత్యంత విశ్వసనీయ కేంద్రంగా మారాలి" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
'వ్యవసాయం, ఆహార శుద్ధి'ని కీలకమైన రెండో రంగంగా పేర్కొంటూ... దేశవ్యాప్తంగా రసాయన రహిత వ్యవసాయానికి మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. సాంప్రదాయిక భారతీయ ఆహారాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ మార్కెట్లలోకి సజావుగా ప్రవేశించేలా చూసేందుకు, వ్యవసాయ క్షేత్రం నుంచి ఎగుమతుల వరకు సమీకృత సరుకు రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా కృషి చేయాలని ఆయన కోరారు. "మనం ప్రపంచాన్ని సులభంగా చేరుకుని, ఆధిపత్యం చెలాయించాలంటే... మన వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచస్థాయి ప్రమాణాలను విజయవంతంగా అందుకోవాలి" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
'సాంకేతికత, ఆవిష్కరణ'లను కీలకమైన మూడో ప్రవాహంగా శ్రీ మోదీ అభివర్ణించారు. భారత్ కేవలం ఒక ప్రపంచ మార్కెట్గా ఉండటానికి మించి... ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్షం, అధునాతన రోబోటిక్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), మేడ్-ఇన్-ఇండియా 6జీ వంటి అత్యాధునిక రంగాల్లో ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. "'మేడ్ ఇన్ ఇండియా' 6జీ ప్రతి మూలకూ చేరాలన్నదే మన లక్ష్యం కావాలి. మనం దీనిని సాధ్యమైనంత దూకుడుగా వేగవంతం చేయాలి" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
గతి శక్తిని కీలకమైన నాలుగో విభాగంగా పేర్కొంటూ, సమర్థవంతమైన బహుళ రవాణా విధానాల అనుసంధానంతో కూడిన మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధికి ప్రధాని పిలుపునిచ్చారు. ఇందులో హైస్పీడ్ రైళ్లు, ఆధునిక రహదారులు, అంతర్గత జలరవాణా మార్గాలు, ఓడరేవులను పోర్ట్ ఆధారిత అభివృద్ధి దిశగా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలు ఉన్నాయి. భారీ స్థాయిలో పోర్ట్ ఆధారిత అభివృద్ధి వృద్ధి దిశగా మన ఓడరేవులను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిందే” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రక్షణ శక్తిని కీలకమైన ఐదో విభాగంగా పేర్కొన్న ప్రధాని, సంపూర్ణ వ్యూహాత్మక స్వావలంబనను జాతీయ ప్రాధాన్యంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడని లక్ష్యంగా ప్రకటించారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్సోనిక్ సాంకేతికత సహా తదుపరి తరం సాంకేతికతలను అభివృద్ధి చేసి, ఎగుమతి చేయడం ద్వారా భారత్ ప్రపంచంలోనే ప్రముఖ రక్షణ సాంకేతికతల సరఫరాదారుగా ఎదగాలని ఆయన స్పష్టం చేశారు. “ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రక్షణ సాంకేతికతను సరఫరా చేసే దేశంగా ఎదగాలనే దృఢమైన లక్ష్యంతో మనం దూకుడుగా ముందుకు సాగాలి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
సైబర్ భద్రతను జాతీయ రక్షణలో అంతర్భాగంగా అభివర్ణిస్తూ, దేశ డిజిటల్ సరిహద్దులతో పాటు ప్రపంచ సైబర్ వ్యవస్థను పటిష్ఠంగా రక్షించేందుకు యువతలోని అపారమైన డిజిటల్ సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. “దేశాన్ని, ప్రపంచాన్ని సంపూర్ణంగా రక్షించేందుకు సైబర్ భద్రత రంగంలో మన యువతకు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని చురుగ్గా వినియోగించుకోవచ్చు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
హరిత, నీలి ఆర్థిక వ్యవస్థను సుస్థిర అభివృద్ధికి సంబంధించిన ఆరో విభాగంగా పేర్కొన్న ప్రధాని, వాతావరణ మార్పుల సమస్యకు ప్రపంచస్థాయిలో క్రియాశీలక పరిష్కారాలను చూపించే దేశంగా భారత్ను తీర్చిదిద్దాలని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఇంధన నిల్వ వ్యవస్థల విస్తరణతో పాటు సముద్ర వనరుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, తీరప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పెద్దఎత్తున హరిత ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. “ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చిస్తూనే ఉంటే, మనం మాత్రం దానికి పరిష్కార మార్గాలను చురుగ్గా అన్వేషిస్తూ, పటిష్టమైన పరిష్కారాలను అందిస్తూనే ఉంటాం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భారత సృజనాత్మక శక్తిని ఆఖరి, ఏడో విభాగంగా గుర్తించిన ప్రధాని, ప్రపంచాన్ని ఏకం చేసే శక్తిగా యోగాను అభివర్ణించారు. భారత సాంస్కృతిక వారసత్వం, ఆయుర్వేదం, పర్యాటక రంగాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, వేవ్స్ సమ్మిట్ వంటి సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ రంగంలో భారత్ చురుగ్గా నాయకత్వం వహించాలని అన్నారు. "సృజనాత్మక రంగంలో భారతదేశం తన అద్భుతమైన ఆధిక్యతను స్పష్టంగా ప్రదర్శించగలదు. దీనిని మనం కచ్చితంగా ఒక ప్రపంచస్థాయి సామర్థ్యంగా తీర్చిదిద్దాలి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
దేశంలోని వన్యప్రాణి సంపద, జాతీయ పార్కుల్లో ఇంకా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాని అపారమైన సామర్ధ్యం ఉందని, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు దీనిని సమర్థంగా వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ క్రీడా పోటీలతో పాటు భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చే సంగీత కచేరీలను నిర్వహించడం ద్వారా ఈ రంగాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. “మన సృజనాత్మక ప్రతిభ ద్వారా ప్రపంచవ్యాప్త పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు మనకు భారీ అవకాశం ఉంది, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి మనం ధైర్యంగా నిరూపించాలి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ ఏడు కీలక విభాగాల వ్యూహాత్మక ఉద్దేశాన్ని వివరిస్తూ, జాతీయ లక్ష్యాలను సాధించడంతో పాటు ప్రపంచ ప్రమాణాలను అధిగమించాలంటే ఒక్కో రంగంలో విడివిడిగా పురోగతి సాధించడం కాకుండా, అన్ని రంగాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే సమగ్ర విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. “సమగ్ర దృక్పథంతో, దేశం కోసం నిర్దేశించుకున్న ప్రతిష్టాత్మక లక్ష్యాల స్థాయిని అధిగమించే దిశగా మనం వేగంగా ముందుకు సాగాల్సిందే” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
కార్పొరేట్రంగం మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత సంస్థలు ఆధిపత్యం చెలాయించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రభుత్వాలు తమ విధానాలను వేగంగా ఆధునీకరించుకోవాలని, ఫార్చ్యూన్ 500 జాబితాలో 50 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకునేలా, ప్రపంచ అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒకటి భారత్కు చెందినదిగా ఎదిగేలా, ప్రపంచంలోని టాప్ 5 ఫార్మా కంపెనీల్లో ఒకటిగా భారత సంస్థ నిలిచేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. అలాగే న్యాయ, రేటింగ్, కన్సల్టింగ్, అకౌంటింగ్, సాంకేతిక రంగాల్లో ప్రపంచస్థాయి నాయకత్వాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. “ఇదే మార్గంలో, మన కృషిలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ముందుకు సాగితే, వికసిత్ భారత్ అనే మహత్తర స్వప్నాన్ని మనం తప్పక సాకారం చేసుకుంటాం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
జాతీయ స్థాయి మార్పులో యువతను కేంద్రబిందువుగా పేర్కొంటూ, శరవేగంగా జరుగుతున్న అభివృద్ధికి యువ భారతీయులే ప్రధాన రూపకర్తలని, అదే సమయంలో ఈ పురోగతి ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా వారేనని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించే ఈ మొత్తం ప్రయాణం యువత సాధికారతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. “వికసిత్ భారత్’లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అత్యున్నత ప్రాధాన్యంగా యువతను ఈ లక్ష్యంతో చురుగ్గా అనుసంధానించాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
గత దశాబ్ద కాలంలో దేశీయ స్టార్టప్ వ్యవస్థ 2.5 లక్షల నమోదిత సంస్థలకు చేరుకుని శరవేగంగా విస్తరించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. యువత సాధికారతకు అపారమైన వనరులు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల పరిశోధన, ఆవిష్కరణల నిధి, అందుబాటు ధరల్లో డిజిటల్ డేటా విప్లవాత్మక ప్రభావం, స్కిల్ ఇండియా, ఖేలో ఇండియా, జాతీయ డ్రోన్ విధానం, అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశాలు, 35 ఏళ్ల తర్వాత ప్రవేశపెట్టిన చారిత్రాత్మక జాతీయ విద్యా విధానం - 2020 వంటి అనేక కీలక కార్యక్రమాలు యువతకు బలమైన అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు. “మీరు మీ భారీ కలలతో ముందుకు రండి. మేము బలమైన ఆర్థిక సహాయ వ్యవస్థను ఏర్పాటు చేశాం. వనరుల కొరత ఏర్పడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
బలమైన విద్యా మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నామని వివరించిన ప్రధాని, గతంలో నెమ్మదిగా సాగిన విద్యాసంస్థల విస్తరణతో పోలిస్తే ప్రస్తుతం శరవేగంగా కొత్త సంస్థలు ఏర్పడుతున్నాయని తెలిపారు. దేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 350 లోపు నుంచి దాదాపు 1,000కు, వైద్య కళాశాలల సంఖ్య 400 లోపు నుంచి సుమారు 850కి పెరిగిందని పేర్కొన్నారు. 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్ల ద్వారా ఏర్పడిన ఆవిష్కరణల వ్యవస్థను ఆయన ప్రశంసించారు. యువత నేతృత్వంలోని స్టార్టప్లు తొలిప్రయత్నంలోనే ప్రైవేటు ఉపగ్రహాలు, రాకెట్లను ప్రయోగించి సాధిస్తున్న అద్భుత విజయాలను ప్రస్తావించారు. “మన దేశ యువ మేధావులు చిన్నతనం నుంచే సాంకేతికత పట్ల అత్యంత ఆకర్షితులయ్యేలా చేసే దిశగా మనం దూకుడుగా పనిచేస్తున్నాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
కొత్త తరం సాంకేతికతల్లో భారత్ ప్రపంచస్థాయిలో ఆధిపత్యం సాధించేలా వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువతకు కృత్రిమ మేధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రకటించారు. “ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సంపూర్ణ సామర్థ్యం మన యువతకు కల్పించేలా కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తాం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
స్పష్టమైన, దూరదృష్టితో కూడిన విధానాల ఫలితంగా వేగంగా సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందుతున్న రంగాల వివరాలు వెల్లడించారు. 2014లో రూ.60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ నేడు దాదాపు రూ.20 లక్షల కోట్లకు చేరుకుని భారీగా వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. అదే విధంగా, ఏటా కేవలం 1.5 లక్షలుగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ప్రస్తుతం 25 లక్షలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. “విధానాలు సరైనవిగా ఉండి, లక్ష్యం స్పష్టంగా ఉంటే, మన దేశ యువత ఎంత అద్భుతంగా, విజయవంతంగా ఫలితాలు సాధించగలరో చూడండి” అని శ్రీ మోదీ అన్నారు.
విమానయాన, అంతరిక్ష రంగాలతో పాటు గ్రామీణ పాలనలో కూడా చోటుచేసుకున్న వేగవంతమైన విస్తరణను ప్రస్తావిస్తూ, కొత్త విమానాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. భారత్లో తయారైన సీ-295 రక్షణ రవాణా విమానం విజయవంతంగా ప్రయాణించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల మ్యాపింగ్ కోసం డ్రోన్ల ఆధారంగా అమలు చేస్తున్న స్వమిత్వ పథకం సాధిస్తున్న అద్భుత విజయాన్ని ప్రధాని ప్రశంసించారు. ఈ పథకం ద్వారా 3.25 కోట్ల కుటుంబాలకు సంబంధించిన రూ.140 లక్షల కోట్ల గ్రామీణ ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీసే అవకాశం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. “డ్రోన్ల వినియోగంతో గ్రామీణ ఆస్తుల పథకం విజయవంతంగా అమలవుతోంది. ఆస్తుల విలువను వెలికితీసి, అవసరమైన రుణాలు, వ్యాపారాలకు ఆర్థిక సహాయం పొందేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న తీవ్రమైన ఆర్థిక, మానసిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక భారీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను, బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల (డీపీఐ) వ్యవస్థను అనుసంధానిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ సేవలను ప్రారంభించారు.‘‘ఈ భారీ వనరులన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా దేశ యువతకు సంపూర్ణంగా ఉచిత కోచింగ్ అందించే ఒక శక్తిమంతమైన వ్యవస్తను నిర్మించబోతున్నాం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.
టాప్స్ (టీఓపీఎస్) పథకం, ఖేలో ఇండియా వంటి వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోందని ప్రధాని గుర్తుచేశారు. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడంతోపాటు 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ బలమైన పోటీదారుగా ముందంజలో ఉందని ప్రకటించారు. ‘‘క్రీడారంగంలో భారత్ ప్రదర్శన నిరంతరం మెరుగుపడుతోంది. ఒలింపిక్స్ నిర్వహించే దిశగా మనం గర్వంగా, బలంగా అడుగులు వేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
5 నుంచి 15 సంవత్సరాల వయసు గల చిన్నారులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్త క్రీడా ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ప్రతి గ్రామం, పాఠశాల స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్తు ఒలింపిక్ విజేతలను తీర్చిదిద్దడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ‘‘చిన్నారుల్లోని క్రీడా నైపుణ్యాన్ని శోధించి, ప్రత్యేక శిక్షణ ద్వారా దేశం తరఫున ఆడే అద్భుతమైన క్రీడాకారులుగా తయారు చేస్తాం’’ అని శ్రీ మోదీ వెల్లడించారు.
మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యాన్ని సాధించడం ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత అని ప్రధాని పిలుపునిచ్చారు. మత్తుపదార్థాల ముప్పు నుంచి యువతను కాపాడుకోవడానికి కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలన్నీ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. ఇందుకోసం ‘నషా ముక్త్ యువ అభియాన్’ కింద 100 వారాల పాటు దేశవ్యాప్త మాదక ద్రవ్య వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘డ్రగ్స్ రహిత భారత్ కలను నిజం చేసేందుకు ప్రతి కుటుంబం ఈ ప్రచారంలో చురుగ్గా భాగస్వామి కావాలి’’ అని ప్రధాని ఆకాంక్షించారు.
నాలుగు దశాబ్దాల పాటు సాగిన తీవ్రవాదం, హింసాత్మక దోపిడీల వల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు నాశనమైందని ప్రస్తావిస్తూ.. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సగర్వంగా ప్రకటించారు. ఈ పోరాటంలో అమరులైన 3,500 మందికి పైగా భద్రతా దళాల సిబ్బంది త్యాగాలను స్మరించుకున్న ఆయన, ఒకప్పుడు నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో నేడు అభివృద్ధి, నమ్మకం వికసిస్తున్నాయని తెలిపారు. ‘‘ఒకప్పుడు తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో నేడు తీవ్రవాదం పూర్తిగా నశించి, అభివృద్ధి, నమ్మకం, ప్రజల ప్రయత్నాలకు ప్రతీకగా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది’’ అని స్పష్టం చేశారు.
దేశ అంతర్గత భద్రతపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, భావజాల విచ్ఛిన్నకర శక్తుల పట్ల నిరంతరం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశాన్ని హెచ్చరించారు. చారిత్రకంగా కొందరు కుట్రదారులు అధికార వర్గాల కారిడార్లలోకి చొరబడి జాతీయ విధానాలను ప్రతికూలంగా ప్రభావితం చేశారని ఆయన గుర్తుచేశారు. ఈ తరహా కుట్రలు దేశ సార్వభౌమాధికారానికి, వికాసానికి ముప్పని స్పష్టం చేశారు. ‘‘ఈ రకమైన సవాలును మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయకూడదు. దీని పట్ల మనం మరింత జాగ్రత్తగా, అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది’’ అని ప్రధాని చెప్పారు.
హింస, అరాచకాలను వ్యాప్తి చేయడానికి నిరంతరం అవకాశాల కోసం చూసే భావజాల తీవ్రవాదుల ముప్పును ప్రస్తావిస్తూ.. అటువంటి విచ్ఛిన్నకర శక్తులను గుర్తించి, వారిని సమాజం నుంచి వేరుచేయడానికి సమన్వయంతో కూడిన ప్రయత్నాలు జరగాలని కోరారు. ‘‘మనం అటువంటి భావజాల తీవ్రవాదులను ఖచ్చితంగా గుర్తించి, సమాజం నుంచి వేరుచేయాలి. అదే సమయంలో మన నూతన తరం యువతను జాతీయ ప్రధాన స్రవంతి వైపు నడిపించాలి’’ అని అన్నారు.
మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు, ఆధునిక యుద్ధ తంత్రాల దృష్ట్యా దేశ రక్షణపై దృష్టి సారిస్తూ.. ఒక భారీ, ఆధునిక, స్వచ్ఛంద పౌర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి అధికారికంగా ప్రకటించారు. దేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 50 రెట్లకు పైగా పెరిగి సుమారు 100 దేశాలకు చేరుకున్నాయని ప్రధాని వెల్లడించారు. ‘‘వచ్చే రోజుల్లో దేశంలో అత్యంత క్రియాశీలకమైన, ఆధునిక పౌర రక్షణ వ్యవస్థను నిర్మించబోతున్నామని ఈ రోజు ఎర్రకోట నుంచి సగర్వంగా ప్రకటిస్తున్నాను’’ అని ప్రధాని తెలిపారు.
విమానయానం, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్), జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీఏ) ద్వారా సాయుధ బలగాల్లో మహిళల విశేష రంగాలు, ఆధునిక దేశ నిర్మాణంలో వారి అపారమైన భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. సాంకేతిక శిక్షణ పొందిన గిరిజన యువతులు గుజరాత్లోని సనంద్ వద్ద ఉన్న సెమీకండక్టర్ ప్లాంటులో అధునాతన మైక్రోచిప్లను తయారుచేసే స్థాయికి ఎదగడం పట్ల ఆయన తీవ్ర గర్వాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు నిర్ణయించుకున్న 3 కోట్ల లఖ్పతి దీదీల లక్ష్యాన్ని సాధించడమే కాకుండా అధిగమించామని చెబుతూ, గ్రామీణ ప్రాంతాలలో అపూర్వమైన మార్పును తీసుకురావడానికి 6 కోట్ల మంది లఖ్పతి దీదీలను రూపొందించడమే తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ‘‘నేడు చిప్ తయారీ వంటి క్లిష్టమైన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆ యువతుల్లో నేను చూసిన అద్భుతమైన ఆత్మవిశ్వాసం నన్ను తీవ్రంగా ఆకట్టుకుంది’’ అని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్న మహిళల నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ, నారీ శక్తికి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు ఒకటో వంతు చట్టసభల రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను దశాబ్దాలుగా ఆలస్యం చేయకుండా, త్వరితగతిన అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ మహిళల గౌరవార్థం మీరు ముందుకు రండి, దీనికి సంబంధించిన ఘనతను మీరే తీసుకోండి... కానీ నా తల్లులు, సోదరీలకు దక్కాల్సిన హక్కును వారికి ఖచ్చితంగా అందించండి’’ అని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
గతంలో అరకొరగా ఉన్న సామాజిక భద్రతా పరిధిని, గడిచిన పదేళ్ల కాలంలో గణనీయంగా విస్తరించిన తీరును ప్రధానమంత్రి ప్రస్తావించారు. 2014 కంటే ముందు కేవలం 25 కోట్ల మందికే పరిమితమైన సంక్షేమ పథకాలు, నేడు సుమారు 100 కోట్ల మంది పౌరులకు సామాజిక భద్రతను అందిస్తున్నాయని తెలిపారు. ‘‘అభివృద్ధి ఫలాలు సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా అందినప్పుడే ‘వికసిత్ భారత్’ సంకల్పం సంపూర్ణంగా నెరవేరుతుంది’’ అని చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల పౌరుల జీవితాల్లో వచ్చిన మార్పులను వివరిస్తూ ఆయుష్మాన్ భారత్ యోజన ప్రాధాన్యతను ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రస్తావించారు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం అందించడంతో పాటు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పటివరకు దాదాపు రూ. 2 లక్షల కోట్ల వరకు ఆసుపత్రి వైద్య ఖర్చులను పొదుపు చేయగలిగామని వెల్లడించారు. ‘‘ఈ ఆరోగ్య కార్డు అందుబాటులోకి రావడం వల్ల, మందులు, ఆపరేషన్ల కోసం అయ్యే భారీ ఖర్చులు ఆదా అయి, నా పేద. మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచాయి’’ అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
దేశపు తొలి డిజిటల్ జనాభా లెక్కల ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న వేళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను, ముఖ్యంగా యువతను ఉద్దేశించి కీలక పిలుపునిచ్చారు. మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ స్వయం నమోదు సదుపాయాన్ని ప్రతి కుటుంబం విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. పౌరులందరూ సక్రియంగా పాల్గొని అందించే దోష రహిత, అత్యంత ఖచ్చితమైన జనాభా సమాచారమే భవిష్యత్తులో దేశ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ఖచ్చితమైన ప్రమాణాలను, సమర్థవంతమైన జాతీయ విధానాలను రూపొందించడానికి బలమైన పునాదిగా నిలుస్తుందని తెలిపారు. ‘‘మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని డిజిటల్గా నమోదు చేస్తే, దేశం అంత వేగంగా ముందుకు సాగడానికి అంతటి భారీ సహాయం లభిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ డిజిటల్ జనాభా లెక్కల ఉద్యమానికి దేశ యువత నాయకత్వం వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. యువతీయువకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని, మానవ తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా వివరాలను నిశితంగా పరిశీలించి పూరించాలని, ఆ దోషరహిత సమాచారాన్ని డిజిటల్ వేదికపై అతుకులు లేకుండా అప్లోడ్ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ‘‘నా దేశ యువత ఈ అత్యంత వినూత్నమైన, కీలకమైన డిజిటల్ జనాభా లెక్కల కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములై విజయవంతం చేయాలని నేను గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘పంచ ప్రాణ్’ (అయిదు సంకల్పాలు) ప్రాధాన్యతను వివరిస్తూ... ప్రతి పౌరుడు స్వప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలనే ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంచాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వలసవాద మనస్తత్వాన్ని పూర్తిగా నిర్మూలించి, దేశ గొప్ప కలలను వికసిత భారత్ తిరుగులేని విజయంగా వేగంగా మార్చడానికి అందరూ కలసికట్టుగా శ్రమించాలని కోరారు. ‘మన ప్రతి అడుగును అభివృద్ధి అడుగుగా మారుద్దాం. అడుగులో అడుగు కలిపి నడుద్దాం. తద్వారా మనమందరం కలిసి దృఢసంకల్పంతో ‘వికసిత భారత్’ను సాధిద్దాం’’ అని శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
***
MJPS/SS/PRK
(रिलीज़ आईडी: 2300313)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Tamil