ఛైర్మన్: గౌరవ సభ్యులారా… దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమానికి ఆగస్టు 9, 2026నాటికి 84 ఏళ్లు పూర్తవుతాయి. మహాత్మాగాంధీ నాయకత్వంలో ఆగస్టు 9, 1942న ప్రారంభమైన ఈ ఉద్యమం, దేశ స్వాతంత్ర్య కాంక్షకు ఊతమిచ్చింది. "డు ఆర్ డై" పిలుపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తిని రగిలించింది. ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొని, స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో ప్రజలంతా ఐక్యంగా నిలబడేలా చేసింది.
భారత స్వాతంత్ర్య ఉద్యమం పట్ల మన స్వాతంత్ర్య సమరయోధులు అసాధారణమైన ధైర్యాన్ని, పట్టుదలను, అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించారు. అణచివేతను, కారాగార శిక్షలను, లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పట్టువిడవలేదు. వారి నిస్వార్థ త్యాగాలు, దృఢమైన సంకల్పం జాతీయ ఉద్యమాన్ని మరింత బలపరిచాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేందుకు మార్గాన్ని సుగమం చేశాయి.
ఈ చరిత్రాత్మక సందర్భాన్ని స్మరించుకుంటూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. వారి దేశభక్తి, ఐక్యత, త్యాగం, అంకితభావం వంటి ఆదర్శాలు… బలమైన, అభివృద్ధి చెందిన, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించాలన్న ఉమ్మడి ప్రయత్నాలకు నిరంతరం స్ఫూర్తిని కలిగిస్తాయి.
ఈ సభలోని సభ్యులంతా నాతో కలిసి మన స్వాతంత్ర్య పోరాట వీరులకు నివాళులు అర్పిస్తారని నేను ఆశిస్తున్నాను.
గౌరవ సభ్యులారా… ఆ సాహస వీరుల జ్ఞాపకార్థం, దయచేసి అందరూ లేచి నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరుతున్నాను.
***