వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ అధ్యక్షతన జైపూర్లో విజయవంతంగా ముగిసిన 10వ బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశం
ఎంఎస్ఎంఈలు, సౌర విద్యుత్ సాంకేతికత, అంకుర సంస్థలు, లాజిస్టిక్స్ రంగాల్లో మెరుగైన సహకారం ద్వారా పారిశ్రామిక వృద్ధిని మెరుగుపరిచేందుకు సంయుక్త ప్రకటనను ఆమోదించిన బ్రిక్స్ పరిశ్రమల మంత్రులు
ఎంఎస్ఎంఈ వ్యవస్థల బలోపేతానికి ఎస్ఎంఈ వర్కింగ్ గ్రూప్ సహకారంపై ఏర్పాటైన ఫ్రేమ్వర్క్
సౌర విద్యుత్ సాంకేతికత పరిశ్రమకు సంబంధించి బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ కోసం నియమావళి, కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం... ఈ రంగంలో సహకారానికి నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటు
ఆవిష్కరణ ఆధారిత వృద్ధికి మద్దతుగా బ్రిక్స్ ఇంక్యుబేటర్ వ్యవస్థ, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ను ప్రతిపాదించిన భారత్
భారత్ అధ్యక్షతన ఆగస్టు 7న జైపూర్లో 16వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం
प्रविष्टि तिथि:
06 AUG 2026 8:09PM by PIB Hyderabad
బ్రిక్స్-2026 భారత్ అధ్యక్షతన రాజస్థాన్లోని జైపూర్లో పదో బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశం నేడు విజయవంతంగా ముగిసింది. నూతన పారిశ్రామిక విప్లవంపై బ్రిక్స్ భాగస్వామ్యం (పార్ట్ఎన్ఐఆర్) ద్వారా జరిగిన మంత్రివర్గ చర్చల్లో బ్రిక్స్ సభ్య దేశాల పరిశ్రమల మంత్రులు, సీనియర్ ప్రతినిధులు హాజరయ్యారు.
"సమర్థత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమల సామర్థ్యాన్ని బలోపేతం చేయటం, సాంకేతిక పరివర్తనను వినియోగించుకోవటం, ఉమ్మడి కార్యాచరణ కోసం మెరుగైన అవకాశాలను సృష్టించటంపై సభ్య దేశాలు చర్చించేందుకు ఈ సమావేశం వేదికగా నిలిచింది.

సమావేశంలో పాల్గొనేందుకు జైపూర్ కు విచ్చేసిన ప్రతినిధులకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి (సీఐఎం) శ్రీ పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. ఈ నగరం శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యాన్ని ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలతో అద్భుతంగా కలుపుతుందని అభివర్ణించారు.
వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆశయాలను ఆచరణాత్మక ఆవిష్కరణలుగా, సహకారంగా మలచాలని సీఐఎం స్పష్టం చేశారు. బలమైన పరిశ్రమల ఏర్పాటుకు బ్రిక్స్ దేశాలు పరస్పరం సామర్థ్యాలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ సహకారానికి పార్ట్ఎన్ఐఆర్ ప్రధాన వ్యవస్థగా మారిందని కొనియాడారు.
బ్రిక్స్ సభ్య దేశాల మధ్య బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించటానికి భారత్ కట్టుబడి ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద తెలిపారు. స్థిరమైన, సమ్మిళిత పారిశ్రామిక భవిష్యత్తు నిర్మాణంలో సహకారం, ఆవిష్కరణ, పరస్పర విశ్వాసాల ప్రాముఖ్యతను ఆయన స్పష్టం చేశారు.

2009లో రష్యాలోని యెకాటెరిన్బర్గ్లో జరిగిన తొలి సమావేశంతో బ్రిక్స్ ప్రస్థానం ప్రారంభమైందని సీఐఎం గుర్తు చేసుకున్నారు. 2025లో అధ్యక్ష హోదాలో బ్రెజిల్ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. క్రమబద్ధమైన, క్రియాశీలక, ఆచరణాత్మక విధానం ద్వారా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భారత్ అధ్యక్షతన… బ్రిక్స్ సభ్యులందరికీ ఆచరణాత్మక ఫలితాలను అందించేలా సహకారాన్ని పెంపొందించటమే కాక, వ్యాపారాలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తల్లో మరింత విశ్వాసాన్ని కలిగిస్తూ, మెరుగైన నాయకత్వాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
పార్ట్ఎన్ఐఆర్ ద్వారా బ్రిక్స్ భారతదేశ అధ్యక్షతన సాధించిన గణనీయమైన పురోగతిని సీఐఎం వివరించారు. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన సలహా మండలి, వర్కింగ్ గ్రూపుల చర్చల ఫలితాలను తెలియజేశారు. భారత్ గుర్తించిన నాలుగు ప్రాధాన్యతా రంగాలపై ఈ చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా ఎస్ఎంఈ వర్కింగ్ గ్రూప్లో సహకార వ్యవస్థ ఖరారవటం, సౌర విద్యుత్ సాంకేతికత పరిశ్రమపై వర్కింగ్ గ్రూప్ విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళిక ఆమోదం పొందటం, అంకుర సంస్థల ద్వారా నూతన ఆవిష్కరణల వృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఖరారయ్యాయి. జీఐఎస్ ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళిక, నగర లాజిస్టిక్స్ ప్రణాళికలతో పాటు పారిశ్రామిక రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థల ప్రాముఖ్యతను కూడా ఈ సమావేశంలో తెలియజేశారు.
పదో బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశ సంయుక్త ప్రకటనను ఆమోదించటం.. ఈ సమావేశ ముఖ్య ఫలితాల్లో ఒకటి. సభ్య దేశాల పరిశ్రమలను బలోపేతం చేయటానికి, ప్రజల జీవితాలను మెరుగుపరచటానికి, చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణాత్మక సహకార మార్గాలను అమలు చేసేందుకు ఉమ్మడి నిబద్ధతను ఈ ప్రకటన తెలియజేస్తుంది.
బ్రిక్స్ సభ్య దేశాల పరిశ్రమల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు జాతీయ దృక్పథాలను ఈ సమావేశంలో పంచుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించటంలో కీలక విధానపరమైన కార్యక్రమాలు, ప్రాధాన్యతలు, సాధించిన విజయాలను స్పష్టం చేశారు. పారిశ్రామిక సామర్థ్యాలను బలోపేతం చేయటం, డిజిటల్, సాంకేతిక పరివర్తనను వేగవంతం చేయటం, స్థిరమైన, సమ్మిళిత పారిశ్రామిక వ్యవస్థలను పెంపొందించటం, అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకారాన్ని మెరుగుపరచుకోవటం పట్ల ఉమ్మడి నిబద్ధతను ఈ ప్రకటనలు స్పష్టం చేశాయి. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఆచరణాత్మక సహకారం, జ్ఞానాన్ని పంచుకోవడం, సామర్థ్య పెంపుదల, పారిశ్రామిక ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు పార్ట్ఎన్ఐఆర్ కీలక వేదికని సభ్య దేశాలు తెలిపాయి. 2026లో భారత్ అధ్యక్షతన సాధించిన పురోగతిని ప్రతినిధి బృందాలు స్వాగతించాయి. సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేసేందుకు, ఆవిష్కరణలు, సామర్థ్య వృద్ధిని పెంపొందించేందుకు, బ్రిక్స్ దేశాల్లో స్థిరమైన, పోటీతత్వంతో కూడిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే పరిశ్రమల అభివృద్ధికి పార్ట్ఎన్ఐఆర్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.

బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఆగస్టు 7, 2026న రాజస్థాన్లోని జైపూర్లో 16వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశానికి (టీఎంఎం) భారత్ ఆతిథ్యం ఇస్తుంది. దీనికన్నా ముందుగానే ఆగస్టు 3, 4, 2026 తేదీల్లో న్యూఢిల్లీలో ఆర్థిక, వాణిజ్య అంశాలపై బ్రిక్స్ కాంటాక్ట్ గ్రూప్ (సీజీఈటీఐ) మూడో సమావేశం జరిగింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ రాష్ట్ర మంత్రి శ్రీ జితిన్ ప్రసాద, వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్ పాల్గొంటారు. అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సహకారానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల వాణిజ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
"సమర్థత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" అనే ఇతివృత్తం ద్వారా బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించటంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. వివిధ వాణిజ్య వ్యవస్థలను బలోపేతం చేయటం, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంపొందించటం, స్థిరమైన, వైవిధ్యభరితమైన ప్రపంచ సరఫరా వ్యవస్థలను పెంపొందించటం, దేశాల మధ్య డిజిటల్ సేవలను సులభతరం చేయటంపై మూడో ఆర్థిక, వాణిజ్య అంశాలపై కాంటాక్ట్ గ్రూప్ (సీజీఈటీఐ) చర్చలు దృష్టి సారించాయి.
వాణిజ్య మంత్రుల చర్చల సమయంలో విదేశాల నుంచి వచ్చిన మంత్రులు, ప్రతినిధి బృందాలు.. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే సిటీ ప్యాలెస్, హవా మహల్ ను సందర్శిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయటంపై మంత్రులు అభిప్రాయాలను పంచుకునేందుకు సాంకేతిక సమావేశాలు అవకాశం కల్పిస్తాయి.
భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం కీలక ఘట్టంగా నిలిచింది. డబ్ల్యూటీఓ కేంద్రంగా… బహిరంగ, సమ్మిళిత, పారదర్శక, సమాన, నియమాలతో కూడిన బహుళ వాణిజ్య వ్యవస్థను ప్రోత్సహించేందుకు భారత్ నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. స్థిరమైన సరఫరా వ్యవస్థలు, ఆవిష్కరల ఆధారిత వృద్ధి, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య బలమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించటం ద్వారా భారతదేశ వికసిత్ భారత్-2047 కలను సాకారం చేసుకునేందుకు ఈ చర్చలు తోడ్పడతాయి.
***
(रिलीज़ आईडी: 2295987)
आगंतुक पटल : 8