మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ, డిజిటల్ విద్య
प्रविष्टि तिथि:
05 AUG 2026 6:15PM by PIB Hyderabad
విద్యార్థుల్లో కీలక నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠ్యాంశాలు, బోధనా విధానాల్లో సమగ్ర మార్పులు చేపట్టాలని జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) - 2020 నిర్దేశించింది. ఇందులో భాగంగా వివిధ విద్యా దశల్లో కృత్రిమ మేధ, డిజైన్ థింకింగ్, సమగ్ర ఆరోగ్యం, సేంద్రీయ జీవన విధానం, పర్యావరణ విద్య, ప్రపంచ పౌరసత్వ విద్య (జీసీఈడీ) వంటి సమకాలీన అంశాలను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలని ఎన్ఈపీ–2020 స్పష్టం చేసింది.
భవిష్యత్తు లో అభివృద్ధితో పాటు కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్ ప్రపంచ నాయకత్వం సాధించాలంటే గణితం, గణితపరమైన ( కంప్యూటేషనల్) ఆలోచనా విధానం అత్యంత కీలకమని కూడా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) - 2020లోని పేరా 4.25 పేర్కొంది ఆ విధంగా పాఠశాల విద్య పునాది దశ నుంచే గణితం, కంప్యూటేషనల్ ఆలోచనా విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్ఈపీ -2020 సూచించింది. ఇందుకోసం గణిత అభ్యాసాన్ని ఆసక్తికరంగా, ఆనందదాయకంగా మార్చే పజిల్స్, ఆటలు వంటి వినూత్న బోధనా విధానాలను విస్తృతంగా వినియోగించాలని పేర్కొంది. మాధ్యమిక విద్యా దశ నుంచే విద్యార్థులకు కోడింగ్ కార్యకలాపాలను పరిచయం చేయాలని కూడా సిఫార్సు చేసింది.
పాఠశాల విద్యకు సంబంధించిన జాతీయ పాఠ్యప్రణాళిక (ఎన్సీఎఫ్ ఎస్ఈ) 2023 కింద విద్యార్థులకు, సమాజానికి ప్రపంచస్థాయిలో గణిత విద్య ప్రాముఖ్యత గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, వాతావరణ నమూనాల రూపకల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక కీలక రంగాలతో గణితానికి ఉన్న సన్నిహిత సంబంధం దృష్ట్యా, భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో గణిత బోధన పాఠశాల విద్యలో అత్యంత కీలకమైన అంశమని ఎన్సీఎఫ్ - ఎస్ఈ, 2023 పేర్కొంది.
కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్ వంటి సాంకేతికతలు విద్యారంగంలో వినూత్న అనువర్తనాలకు దోహదపడతాయని కూడా ఎన్సీఎఫ్–ఎస్ఈ -2023 పేర్కొంది. బోధన, అభ్యాస, మూల్యాంకన ప్రక్రియలను మెరుగుపరచడానికీ, ఉపాధ్యాయుల సన్నద్ధతను, వృత్తిపరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికీ, విద్యావకాశాల లభ్యతను పెంచడానికీ విద్యా ప్రణాళిక, నిర్వహణ, పరిపాలనను క్రమబద్ధీకరించడానికీ కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో పాటు ఇమ్మర్సివ్ (ఏఆర్/ వీఆర్/వర్చువల్ ల్యాబ్లు), ఇంటరాక్టివ్, గేమిఫైడ్ కంటెంట్ను ఉపయోగించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి.
విద్యారంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తోంది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధన, తెలివైన మూల్యాంకనం, పరిస్థితులకు తగ్గ బోధనా విధానాలు, డేటా ఆధారిత నిర్ణయాలకు ఏఐ దోహదపడుతోంది. 21వ శతాబ్దంలో ఏఐని అత్యంత కీలక సాంకేతికతగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపీ–2020, ఎన్సీఎఫ్ - ఎస్ఈ - 2023 ద్వారా పాఠశాల విద్యలో గణనాత్మక ఆలోచన విధానం, కృత్రిమ మేధను సమగ్రంగా అనుసంధానించేందుకు చర్యలు ప్రారంభించింది.
దీనికి అనుగుణంగా, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)తో కలిసి 2026–27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యేక కంప్యూటేషనల్ థింకింగ్, కృత్రిమ మేధ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కృత్రిమ మేధ, అనుబంధ అంశాలకు సంబంధించిన పాఠ్యప్రణాళికను కూడా ఖరారు చేసింది. ఈ పాఠ్యప్రణాళికలో తార్కిక ఆలోచన, నమూనాలను గుర్తించే సామర్థ్యం, అల్గారిథమ్ రూపకల్పన, డేటా అక్షరాస్యత వంటి నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యం ఇచ్చారు. బాధ్యతాయుతమైన, నైతిక విలువలతో కృత్రిమ మేధ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. సమస్య పరిష్కారం, సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను మిళితం చేయడం ద్వారా, ఈ ప్రణాళిక గణనాత్మక ఆలోచనను, ఏఐ అభ్యాసానికి పునాదిగా ఈ ప్రణాళికను రూపొందించారు. దీంతో విద్యార్థులు ప్రతి తరగతిలో తమ వయస్సుకు అనుగుణంగా దశలవారీగా ఏఐపై అవగాహన, నైపుణ్యాలను పెంపొందించుకునేలా అవకాశం కల్పించింది.
ఏఐ బోధనను సమర్థంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయుల కోసం టీచర్ హ్యాండ్బుక్స్, ఫెసిలిటేటర్ గైడ్లను కూడా రూపొందించారు. వీటిని సీబీఎస్ఈ అకడమిక్ వెబ్సైట్ (https://cbseacademic.nic.in/skilleducation.html). లో అందుబాటులో ఉంచారు. పాఠశాలల్లో ఏఐ బోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో స్పష్టమైన మార్గదర్శకాలను కూడా పొందుపరిచింది. ఏఐను ఒక సబ్జెక్టుగా అభ్యసించే విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత సంబంధిత పాఠశాలలదేనని పేర్కొంది. సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు బోర్డు అనుబంధ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసి నిర్వహించాల్సి ఉంటుంది.
నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కృత్రిమ మేధపై అవగాహన, ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ ( ఎస్ఓఏఆర్) పేరుతో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల కోసం ఒక్కోటి 15 గంటల వ్యవధి గల మూడు దశల శిక్షణ మాడ్యూళ్లను - ఏఐ టు బి అవేర్, ఏఐ టు అక్వైర్, ఏఐ టు ఆస్పైర్ - నూ, ఉపాధ్యాయుల కోసం ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ పేరుతో 45 గంటల ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ నూ రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఏఐ మౌలిక అంశాలు, జనరేటివ్ ఏఐ, రోజువారీ జీవితంలో ఏఐ వినియోగం, ప్రోగ్రామింగ్ ప్రాథమికాలు, నైతిక విలువలు, సైబర్ భద్రత, భవిష్యత్ ఉపాధి అవకాశాలు వంటి అంశాలను బోధిస్తారు.
విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నందున దేశంలోని అత్యధిక పాఠశాలలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోనే ఉన్నాయి. దానికి అనుగుణంగా, తమ అధికార పరిధిలోని పాఠశాలల్లో ఏఐ, రోబోటిక్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేసే బాధ్యత సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలదే.
కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2295189)
आगंतुक पटल : 5