జల శక్తి మంత్రిత్వ శాఖ
‘జల్ సంచయ్ జన భాగీదారి: క్యాచ్ ది రైన్’ కార్యక్రమం కింద ప్రజల భాగస్వామ్యంతో విజయనగరంలో పెద్ద ఎత్తున భూగర్భ జలాల పునరుజ్జీవం
प्रविष्टि तिथि:
31 JUL 2026 5:57PM by PIB Hyderabad
వర్షపు నీటిని సంరక్షించడానికి ఉద్దేశించిన ‘క్యాచ్ ది రెయిన్’ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ 135వ సంచికలో ఇచ్చిన పిలుపు స్ఫూర్తితో, దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కార్యక్రమంలో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ప్రజల భాగస్వామ్యం శాస్త్రీయ జల నిర్వహణ, వివిధ ప్రభుత్వ పథకాల సమన్వయంతో భూగర్భ జలాల పునరుద్ధరణను గణనీయంగా పెంచి, దీర్ఘకాలిక జల భద్రతను బలోపేతం చేయడంలో ఆదర్శంగా నిలిచింది.
జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో సాంప్రదాయ చిన్న నీటిపారుదల చెరువులను, వాటి మాతృ కాలువలను పునరుద్ధరించింది. ఇది కేవలం ఉపరితల నీటి నిల్వను పెంచడానికే కాకుండా, భూగర్భ జలచరాలను పునరుద్ధరించే సహజ పునరుజ్జీవన వ్యవస్థలకు తిరిగి జీవం పోయడానికి కూడా దోహదపడింది.
జిల్లాలో 6,424 చిన్న నీటిపారుదల చెరువులు, 2,549 ఫీడర్ కాలువల పునరుద్ధరణతో సహా మొత్తం 8,973 నీటి సంరక్షణ పనులను పూర్తి చేశారు. దీని ద్వారా శాశ్వత భూగర్భ జలాల పునరుద్ధరణ ఆస్తులను సృష్టించడమే కాకుండా, 1.28 కోట్ల పనిదినాల ఉపాధిని కూడా కల్పించారు.
భారీ ఎత్తున చేపట్టిన పూడికతీత, పునరుద్ధరణ పనుల ద్వారా దాదాపు 109.9 లక్షల ఘనపు మీటర్ల పూడికను తొలగించి, 82.48 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో గుర్రపుడెక్క, ఇతర వ్యర్థాలను తొలగించారు. 2,090 కిలోమీటర్లకు పైగా ఫీడర్ కాలువలను పునరుద్ధరించారు. దీనివల్ల వర్షపు నీరు వృథాగా పోకుండా నేరుగా చెరువులు, భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే ప్రాంతాల్లోకి ఉచితంగా ప్రవహించడానికి మార్గం సుగమమైంది.
ఈ చర్యల వల్ల జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యత గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. పునరుద్ధరించిన చెరువుల వ్యవస్థ ద్వారా అదనంగా 0.70 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడనుండగా, పునరుద్ధరించిన ఫీడర్ కాలువలు, చెరువుల ద్వారా కలిపి దాదాపు 0.60 టీఎంసీ మేర భూగర్భ జలాల రీఛార్జ్ జరిగే అవకాశం ఉంది. దీంతో నీటి నిల్వలు పెరగడంతో పాటు, తరచూ ఏర్పడే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే స్థానిక జల వనరుల సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.
భూగర్భ జల నిర్వహణ ప్రాముఖ్యతను గుర్తించిన జిల్లా యంత్రాంగం భూగర్భ జలాలు తక్కువగా ఉన్న 193 గ్రామాలకు ప్రాధాన్యతనిచ్చింది. వీటిలో 596 ఫీడర్ కాలువలు, 1,767 చిన్న నీటిపారుదల చెరువులలో పునరుద్ధరణ పనులను చేపట్టింది. జలాశయాల మధ్య సహజమైన నీటి అనుసంధానతను పునరుద్ధరించడానికి, మొత్తం క్యాచ్మెంట్ ప్రాంతాల వ్యాప్తంగా నీటి ఇంకుడును, భూగర్భ జలాల రీఛార్జ్ను మెరుగుపరచడానికి 94 క్యాస్కేడ్ చెరువుల వ్యవస్థలను కూడా పునరుద్ధరించారు.
విజయనగరం జిల్లా సాధించిన ఈ విజయం సుస్థిర భూగర్భ జలాల నిర్వహణ కేవలం ఇంజినీరింగ్ పనులతోనే సాధ్యమయ్యేది కాదని, ప్రజల చురుకైన భాగస్వామ్యమే దానికి కీలకమని నిరూపించింది. రైతులు, గ్రామ పంచాయతీలు, స్థానిక ప్రజలు, క్షేత్రస్థాయి సిబ్బంది, జిల్లా యంత్రాంగం సమష్టిగా కృషి చేసి, కాలక్రమేణా రీఛార్జ్ సామర్థ్యాన్ని కోల్పోయిన సంప్రదాయ జలవనరులను పునరుజ్జీవింపజేశారు. వారి భాగస్వామ్యం ‘జన్ భాగీదారి’ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచి జల సంరక్షణను ప్రజలే ముందుండి నడిపించే ఉద్యమంగా మార్చింది.
దేశవ్యాప్తంగా జల్ సంచయ్ జన భాగీదారి - క్యాచ్ ది రైన్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, సంప్రదాయ జలవనరుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పునరుద్ధరించడం, వాతావరణ మార్పుల ప్రభావాలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం, భావి తరాలకు జల వనరులను భద్రపరచడం ఎలా సాధ్యమవుతుందో విజయనగరం జిల్లా స్ఫూర్తిదాయక నమూనాగా నిలుస్తోంది.
“వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు" అని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు కట్టుబడి పునరుద్ధరించిన ప్రతి చెరువు, బాగు చేసిన ప్రతి ఫీడర్ కాలువ, భాగస్వామ్యమైన ప్రతి పౌరుడు నీటి భద్రత కలిగిన భారత్ నిర్మాణానికి తోడ్పడతారని ఈ జిల్లా నిరూపించింది.
***
(रिलीज़ आईडी: 2292879)
आगंतुक पटल : 15