ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
చట్టపరమైన నియంత్రణలు, సామాజిక వేదికల జవాబుదారీతనం, పౌర రక్షణ ద్వారా ఏఐతో
రూపొందించిన డీప్ఫేక్లను ఎదుర్కొనేందుకు నిబంధనలను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం
డీప్ఫేక్లను గుర్తించేందుకు 13 బాధ్యతాయుతమైన ఏఐ ప్రాజెక్టులకు ఆమోదం
6,650 సైబర్ భద్రత అవగాహన వర్కుషాపుల ద్వారా 11.37 లక్షలకు పైగా ప్రజలకు లబ్ధి
ఏఐతో రూపొందించిన చట్టవిరుద్ధమైన కంటెంట్ను వేగంగా తొలగించడం, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారుల భద్రతను విస్తరించిన ప్రభుత్వం
प्रविष्टि तिथि:
30 JUL 2026 3:15PM by PIB Hyderabad
కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందించిన డీప్ ఫేక్ల వల్ల ముఖ్యంగా సాంకేతికత సాయంతో రూపొందించిన ఆడియో, వీడియో, సందేశాల వల్ల ఎదురయ్యే ప్రమాదాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అందరికీ అందుబాటులో ఉండే, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీతనం ఉన్న సైబర్స్పేస్ను వినియోగదారులకు అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం డీప్ఫేక్ విసురుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు దిగువ పేర్కొన్న చట్టాలను, నిబంధనలను రూపొందించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 (ఐటీ చట్టం)
· గుర్తింపును తస్కరించడం (సెక్షన్ 66సీ), మరొకరిగా నటించడం (సెక్షన్ 66డీ), గోప్యతా ఉల్లంఘనలు (సెక్షన్ 66ఈ), అశ్లీల లేదా అసభ్యకరమైన కంటెంట్ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం (సెక్షన్ 67,67ఏ)
· నిర్దిష్ట సమాచారాన్ని/లింకును అడ్డుకొనేందుకు సేవా సంస్థలకు బ్లాకింగ్ ఉత్తర్వులను జారీ చేసే నిబంధన (సెక్షన్ 69ఏ)
· చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడేందుకు ప్రేరేపిస్తున్న సమాచారాన్ని తొలగించడానికి ఇంటర్మీడియరీలకు నోటీసు జారీ చేసే నిబంధన (సెక్షన్ 79)
· అలాగే, నేరాలను దర్యాప్తు చేయడానికి పోలీసులకు అధికారం కల్పించే చట్టం (సెక్షన్ 78,80)
భారతీయ న్యాయ సంహిత-2023 (బీఎన్ఎస్)
· ప్రజల్లో అశాంతిని లేదా భయాన్ని కలింగించే అవకాశం ఉన్న అసత్యపూరితమైన లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలు, వదంతులు లేదా నివేదికలను ప్రచారం చేసే వారికి శిక్ష విధించడం ద్వారా అసత్య సమాచారం, దుష్ప్రచార వ్యాప్తిని అరికట్టడమే సెక్షన్ 353 లక్ష్యం.
· డీప్ఫేక్ కంటెంట్తో కూడిన వ్యవస్థీకృత సైబర్ నేరాలను కూడా సెక్షన్ 111 కింద విచారించవచ్చు.
(సమాచార సాంకేతిక పరిజ్ఞానం) (ఇంటర్మీడియరీలకు మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు-2021 (ఐటీ నియమాలు)
విధులను నిర్వర్తించేటప్పుడు తగిన శ్రద్ధ వహించాలనే నిర్దిష్ట బాధ్యతలను ఇంటర్మీడియరీలకు ఐటీ నియమాలు నిర్దేశిస్తాయి. అలాగే దిగువ పేర్కొన్న వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించడం, ప్రదర్శించడం, అప్లోడ్ చేయడం, సవరించడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్డేట్ చేయడం లేదా పంచుకోవడం చేయరాదని కంప్యూటర్ వనరుల వినియోగదారులకు తెలియజేయాలి.
· అసభ్యకరమైన, అశ్లీలమైన, గోప్యతకు భంగం కలిగించే లేదా ద్వేషాన్ని లేదా హింసను ప్రోత్సహించేవి
· చిన్నారులకు హాని కలిగించేవి
· డీప్ఫేక్లతో సహా తప్పుదోవ పట్టించేవి లేదా మోసం చేసేవి
· ఏఐ ఉపయోగించి, ఇతర మార్గాల ద్వారా ఇతరులను అనుకరించడం
· జాతీయ భద్రతకు లేదా శాంతిభద్రతలకు ముప్పు కలిగించేవి
· వర్తించే ఏ చట్టాన్నైనా ఉల్లంఘించేవి
చట్ట విరుద్దమైన సమాచారాన్ని పంచుకోవడం వల్ల కంటెంట్ తొలగింపు, ఖాతాను సస్పెండ్ చేయడం లేదా తొలగించడంతో సహా ఎదురయ్యే పరిణామాల గురించి సేవా నిబంధనలు, వినియోగదారు ఒప్పందాల ద్వారా వినియోగదారులకు ఇంటర్మీడియరీలు స్పష్టంగా తెలియజేయాలి.
భారత్లో 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నమోదిత వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న సోషల్ మీడియా ఇంటర్మీడియరీలు (ఎస్ఎస్ఎంఐ) దిగువ పేర్కొన్న అదనపు బాధ్యతలను కూడా పాటించాల్సి ఉంటుంది:
· తీవ్రమైన లేదా సున్నితమైన కంటెంట్ మూలాలను గుర్తించడంలో లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలకు మెసేజింగ్ సేవలను అందించే ఎస్ఎస్ఎంఐలు సహకరించాలి.
· చట్ట విదరుద్ధమైన కంటెంట్ను గుర్తించడానికి, వాటి వ్యాప్తిని పరిమితం చేయడానికి ఆటోమేటెడ్ సాధనాలు ఉపయోగించడం.
· నిబంధనల అమలుకు సంబంధించిన నివేదికలను ప్రచురించడం, ప్రాంతీయ స్థాయిలో అధికారులను నియమించడం, నిబంధనల అమలు, లా ఎన్ఫోర్స్మెంట్ సమన్వయం కోసం భారత్లో ఉన్న కార్యాలయ చిరునామాను పంచుకోవడం.
· సుమోటో చర్య తీసుకోవడాని కంటే ముందే స్వచ్ఛందంగా వినియోగదారు ధ్రువీకరణ, అంతర్గత అప్పీళ్లు, న్యాయపరమైన విచారణ చేపట్టడం.
ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ
ఇంటర్మీడియరీలు ఫిర్యాదు పరిష్కార అధికారిని నియమించి నిర్దేశించిన సమయంలోగా ఫిర్యాదులను పరిష్కరించాలి. సంస్థలు నిర్మించిన ఫిర్యాదు పరిష్కార అధికారి తమ ఫిర్యాదును పరిష్కరించకపోతే https://www.gac.gov.in లో ఆన్లైన్ విధానంలో అప్పీలు చేసుకోవచ్చు. కంటెంట్ తొలగింపు నిర్ణయాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉండేలా జీఏసీలు చూస్తాయి.
పోలీసులకు అందిన ఫిర్యాదులను సంబంధిత లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థ (ఎల్ఈఏ)లు సంబంధిత చట్టాల ప్రకారం విచారిస్తాయి. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం పోలీసు, శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలు. కాబట్టి సైబర్ నేరాలతో సహా నేరా నివారణకు, గుర్తింపునకు, దర్యాప్తునకు, విచారణకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థ (ఎల్ఈఏ)లు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి.
తాజా సవరణలు:
డీప్ఫేక్లు, ఏఐతో రూపొందించిన కంటెంట్తో సహా సాంకేతిక సహకారంతో సృష్టించిన సమాచారం (ఎస్జీఐ) వల్ల ఎదురయ్యే ప్రమాదాలను పరిష్కరించడానికి 2026, ఫిబ్రవరి 10న ఐటీ నియమాలు-2021కి సవరణలు చేసి నియంత్రణలను ప్రభుత్వం బలోపేతం చేసింది.
సవరణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి:
· అనుమతించే విధంగా ఉన్న ఏఐతో రూపొందించిన కంటెంట్ కోసం స్పష్టమైన లేబులింగ్, గుర్తించదగిన మెటాడేటాను ఇంటర్మీడియరీలు నిర్ధారించాల్సి ఉంటుంది. తద్వారా సాంకేంతిక సాయంతో రూపొందించిన కంటెంట్ను వినియోగదారులు సులభంగా గుర్తించేలా చేసి మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించాలి.
· ఏఐతో రూపొందించిన చట్టవిరుద్ధమైన కంటెంట్ వల్ల ఎదురయ్యే న్యాయపరమైన పరిణామాలపై వినియోగదారులకు అవగాహన కల్పించడం, సోషల్ మీడియా సంస్థలు పాటించాల్సిన నిబంధనలను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారుల జవాబుదారీతనాన్ని, వేదికల బాధ్యతాయుతమైన నిర్వహణను మరింత పటిష్టం చేస్తుంది.
· ప్రధానంగా ఈ మార్గదర్శకాలు... బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలు, అంగీకారం లేకుండా తీసిన సన్నిహిత చిత్రాలు, మరొకరిగా నటించడం, ఏఐతో రూపొందించిన హానికరమైన కంటెంట్కు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను కలిగి ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ను అడ్డుకోవడం, అలాగే గుర్తించిన వెంటనే వేగంగా చర్యలు తీసుకోవడాన్ని ప్లాట్ఫామ్లకు తప్పనిసరి చేసింది.
· సంబంధిత ప్రభుత్వం లేదా కోర్టు ఉత్తర్వులు (కాలపరిమితిని 36గంటల నుంచి 3 గం.లకు తగ్గించారు) ద్వారా సరైన కారణాలతో కూడిన సమాచారం అందినప్పుడు చట్ట వ్యతిరేకమైన సమాచారాన్ని తొలగించే సమయాన్ని తగ్గించడం, ఫిర్యాదుల పరిష్కారం (న్యూడిటీ/మరొకరిలా నటించడంతో సహా ప్రత్యేక వర్గాలతో సహా) (కాలపరిమితిని 72గం.ల నుంచి 36 గం.లకు, సున్నితమైన విషయాలకు 24 గం.ల నుంచి 2 గం.లకు)తో సహా నిబంధనలను పాటించడం కోసం కాల పరిమితులను బలోపేతం చేయడం
· ప్రస్తుతం అమలులో ఉన్న ఏ చట్టాన్నైనా ఉల్లంఘించేలా కృత్రిమంగా సృష్టించిన ఏ సమాచారాన్నీ ఏ వినియోగదారుడూ తయారుచేయకుండా, ప్రచురించకుండా, ఇతరులకు పంపకుండా లేదా ప్రసారం చేయకుండా చూడటానికి మధ్యవర్తిత్వ సంస్థలు ఆటోమేటెడ్ టూల్స్ లేదా ఇతర సరైన సాంకేతిక చర్యలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
· ఐటీ నియమాల ప్రకారం, ప్రధాన సామాజిక మాధ్యమ ఇంటర్మీడియరీ (ఎస్ఎస్ఎంఐ)లు తగిన సాంకేతిక చర్యలను అమలు చేయడానికి సహేతుకమైన ప్రయత్నాలు చేయాలి. ఇందులో ఆటోమేటెడ్ టూల్స్ లేదా ఇతర అనుకూల యంత్రాంగాలను ఉపయోగించి, అత్యాచారాన్ని ఏ రూపంలోనైనా చూపించే లేదా అనుకరించే కంటెంట్ను, బాలలపై లైంగిక దాడిని లేదా దానికి సంబంధించిన ప్రవర్తనను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిత్రీకరించే సమాచారాన్ని, అలాగే గతంలో తొలగించిన సమాచారంతో పోలి ఉండే వివరాలను ముందుగానే గుర్తించే చర్యలు తీసుకోవాలని ఈ నియమాలు నిర్దేశిస్తున్నాయి.
ఐటీ నియమాల్లో పేర్కొన్న చట్టపరమైన బాధ్యతలను పాటించడంలో ఇంటర్మీడియరీలు విఫలమైతే, ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం మూడో పక్షం అందించిన సమాచారానికి లభించే మినహాయింపు వారికి వర్తించదు. అటువంటి సందర్భాల్లో అమల్లో ఉన్న ఇతర సంబంధిత చట్టాల ప్రకారం వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు లేదా వారిపై విచారణ జరపొచ్చు.
సూచనలు, ప్రామాణిక నిర్వహణా పద్దతులు (ఎస్వోపీ):
ప్రభుత్వం సోషల్ మీడియా ఇంటర్మీడియరీలతో సహా అన్ని ఇంటర్మీడియరీలకు పలు సూచనలు జారీ చేసింది. ఐటీ చట్టం, ఐటీ నియమాల ప్రకారం వారు పాటించాల్సిన తగిన జాగ్రత్తలు, చట్టపరమైన బాధ్యతలను అమలు చేయాలని ఈ సూచనల్లో స్పష్టంగా పేర్కొంది. జారీ చేసిన సూచనలు, రూపొందించిన ప్రామాణిక నిర్వహణ విధానాల వివరాలు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి:
· 29.12.2025 తేదీన జారీ చేసిన సూచన ద్వారా తమ వేదికల్లో అసభ్యకరమైన, అనుచితమైన, అశ్లీలమైన, పోర్నోగ్రాఫిక్, ఇతర చట్టవిరుద్ధమైన కంటెంట్ను హోస్ట్ చేయడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, పంచుకోవడం లేదా అప్లోడ్ చేయడాన్ని నిరోధించేందుకు ఐటీ చట్టం, ఐటీ నియమాల ప్రకారం ఇంటర్మీడియరీలు పాటించాల్సిన చట్టబద్ధమైన బాధ్యతలను ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అలాగే, ఇంటర్మీడియరీలు తమ అంతర్గత నిబంధనల అనుసరణ వ్యవస్థలు, కంటెంట్ నియంత్రణ విధానాలు, వినియోగదారులపై అమలు చేసే చర్యలను తక్షణమే సమీక్షించుకోవాలని సూచించింది. అలాగే ఐటీ చట్టం, ఐటీ నియమాల్లోని నిబంధనలను కఠినంగా, ఎల్లప్పుడూ పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
· మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించడం గురించి 09.02.2026న ఒక సూచన జారీ అయింది. దీనిలో మతపరమైన కంటెంట్ను తగిన జాగరూకతతో, ఖచ్చితత్వంతో, గౌరవంతో నిర్వహించేలా చూడటానికి, వక్రీకరించిన, తప్పుదారి పట్టించే లేదా చట్టవిరుద్ధమైన మతపరమైన సమాచారాన్ని తమ ప్లాట్ఫారమ్లలో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఇంటర్మీడియరీలు తక్షణమే మెరుగైన పర్యవేక్షణ, జవాబుదారీ వ్యవస్థలను అమలు చేయాలని సూచించింది. అలాగే చట్టపరంగా తగిన బాధ్యతలను పాటించడంలో ఇంటర్మీడియరీలు విఫలమైతే ఐటీ చట్టంలోని సెక్షన్ 79 పరిధిలో కల్పించిన మినహాయింపును కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే వర్తించే చట్టాల ప్రకారం తదనంతర న్యాయపరమైన చర్యలకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సూచన తెలియజేస్తుంది.
· హింసాత్మకమైన, పరువు నష్టం కలిగించే, అభ్యంతరకరమైన, అవమానకరమైన, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సృష్టించడం, హోస్ట్ చేయడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, పంచుకోవడం లేదా అప్లోడ్ చేయడానికి సంబంధించి 16.03.2026న ఇంటర్మీడియరీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
· నాన్-కాన్సెన్సువల్ ఇమేజరీ (ఎన్సీఐఐ) ప్రచారాన్ని అరికట్టేందుకు రూపొందించిన ఒక ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్వోపీ) 11.11.2025న విడుదలైంది. బాధితులు, ఇంటర్మీడియరీలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అనుమతి లేకుండా సన్నిహిత లేదా మార్ఫింగ్ చేసిన చిత్రాలతో సహా ఎన్సీఐఐ కంటెంట్ను ఆన్లైన్లో వ్యాప్తి చేయడాన్ని అరికట్టేందుకు త్వరితగతిన, ఏకరీతిలో చర్యలు తీసుకునేలా సమగ్ర మార్గదర్శకాలను ఈ ఎస్వోపీ అందిస్తుంది.
భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే దేశీయ ఏఐ సాధనాలు
భారతదేశంలోని ప్రాచీన రాత ప్రతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి జ్ఞానభారతం వెబ్ పోర్టల్ ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తుంది. వీటిలో లార్జ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ మోడల్స్ (ఎల్ఎల్ఎస్ఎం), ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్), హ్యాండ్ రిటెన్ టెక్ట్స్ రికగ్నిషన్ (హెచ్టీఆర్), స్క్రిప్ట్ రికగ్నిషన్, సెమాంటిక్ సెర్చ్, యంత్ర ఆధారిత అనువాదం తదితర సాంకేతిక పరిజ్ఞానాలున్నాయి.
జ్ఞాన భారతం వెబ్ పోర్టల్లో ఉన్న ఏఐ ఆధారిత నాలెడ్జి ఇంటర్ఫేస్ – జ్ఞాన మిత్రం. ఇది కూడా ఎల్ఎల్ఎస్ఎం, ఓసీఆర్, హెచ్టీఆర్, స్క్రిప్ట్ రికగ్నిషన్, సెమాంటిక్ సెర్చ్, యంత్ర ఆధారిత అనువాదం లాంటి సాంకేతికతలను ఉపయోగిస్తుంది. వీటి ద్వారా రాత ప్రతుల చిత్రాలు, లిప్యంతరీకరణలు, అనువాదాలను ఏకీకృతం చేయడం ద్వారా వాటిని ఆధునిక విధానాల్లో అర్థం చేసుకోవడం, నేపథ్యాన్ని గుర్తించడం, అన్వేషించడం సులభతరమవుతుంది.
జ్ఞాన భారతం వెబ్ పోర్టల్లోని భారతీయజీపీటీలో ‘మాన్యుస్క్రిప్ట్-టు-కన్వర్సేషనల్ ఏఐ’ అనే ఫీచర్ ఉంది. ఇది మన ప్రాచీన రాతప్రతులను ఏఐకు అనుకూలమైన, యంత్రాలు చదవగలిగే విజ్ఞానంగా మారుస్తుంది. అలాగే ‘టాక్ టు మాన్యుస్క్రిప్ట్’ ఫీచర్ ద్వారా బహుళ భాషల్లో టెక్స్ట్, ఆడియో, వాయిస్ రూపాల్లో సమాచారాన్ని అందిస్తుంది. తద్వారా భారతీయ సంప్రదాయ విజ్ఞానం పండితులకు, విద్యార్థులకు, పరిశోధకులకు, సాధారణ ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తుంది.
డీప్ఫేక్ కంటెంట్ గుర్తింపు
దేశీయ పాలనా విధానాలు, ప్రమాణాలు, సాధనాలు, మూల్యాంకన వ్యవస్థల ద్వారా బాధ్యతాయుతమైన రీతిలో అభివృద్ధి చేయడాన్ని, విస్తరణను, స్వీకరణను ప్రోత్సహించడమే ఇండియాఏఐ మిషన్లోని సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐ విభాగ లక్ష్యం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో డీప్ఫేక్ గుర్తింపుతో సహా 13 బాధ్యతాయుతమైన ఏఐ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
డీప్ఫేక్ గుర్తింపునకు సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులు:
· డీప్ఫేక్ గుర్తింపు కోసం ఐఐటీ జోధ్పూర్, ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన మల్టీ ఏజెంట్ ఫ్రేమ్ వర్క్ సాక్ష్య
· ఆడియో-విజువల్ నకిలీ గుర్తింపు వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏఐ విశ్లేషక్
· రియల్ టైమ్ వాయిస్ డిటెక్షన్ సిస్టమ్పై ఐఐటీ ఖరగ్పూర్ ప్రాజెక్టు
అవగాహన కార్యక్రమాలు:
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (ఐఎస్ఈఏ): సమాచార భద్రతలో మానవ వనరులను సిద్ధం చేయడానికి, ప్రజల్లో సైబర్ హైజీన్, సైబర్ భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (ఐఎస్ఈఏ)ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,650 అవగాహన వర్కుషాపులను నిర్వహించారు. పాఠశాల/కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, లాఎన్ఫోర్స్మెంట్, ప్రభుత్వ సిబ్బంది, సాధారణ ప్రజానీకంతో సహా 11.37 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే ముద్రణ, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, www.isea.gov.in, https://staysafeonline.in/ ద్వారా హ్యాండ్బుక్లు, లఘుచిత్రాలు, పోస్టర్లు, బ్రోచర్లు, చిన్నారుల కోసం కార్టూన్ కథలు తదితర రూపాల్లో బహుళ భాషల్లో అవగాహన సామగ్రిని ప్రచురించి, సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారు.
సీఈఆర్టీ-ఇన్: ఏఐ సంబంధిత ముప్పులు, నివారణ చర్యలపై క్రమం తప్పకుండా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం మార్గదర్శకాలను జారీ చేస్తుంది. తన అధికార వెబ్సైట్లు, సామాజిక మాధ్యమ ఖాతాల్లో భద్రత, రక్షణ చిట్కాలు, అవగాహన పోస్టర్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలను పంచుకుంటుంది. బాలల విషయంలో ఆన్లైన్ భద్రతాచర్యలతో సహా సైబర్ భద్రతా దాడులు, మోసాలపై ఇంటర్నెట్ వినియోగదారుల్లో చైతన్యం కలిగించడమే వీటి లక్ష్యం. ఇది డీప్ఫేక్ ముప్పులు, డీప్ఫేక్ల నుంచి రక్షణ పొందడానికి అనుసరించాల్సిన చర్యలపై 2024 నవంబర్లో ఒక సూచనా పత్రాన్ని ప్రచురించింది.
29.07.2026న లోక్సభలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ఈ సమాచారాన్ని సమర్పించారు.
***
(रिलीज़ आईडी: 2292154)
आगंतुक पटल : 7