సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
మూజువాణి ఓటుతో 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నివారణ) సవరణ బిల్లు- 2026'ను ఆమోదించిన రాజ్యసభ
ప్రశ్నాపత్రాల లీకేజీలే కాకుండా
అన్ని రకాల అక్రమాలకూ వర్తించనున్న బిల్లు: డాక్టర్ జితేంద్ర సింగ్
·
ప్రభుత్వ పరీక్షలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు అనుకూలంగా
మార్చేందుకు ఇప్పటికే చేపట్టిన సంస్కరణలను వెల్లడించిన డాక్టర్ జితేంద్ర సింగ్
· బలమైన చట్టపరమైన వ్యవస్థ, సమగ్రమైన పరీక్షల సంస్కరణల ద్వారా
విద్యార్థులు, యువత
ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
प्रविष्टि तिथि:
30 JUL 2026 10:44PM by PIB Hyderabad
లోక్సభ ఇదివరకే ఆమోదించిన 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నివారణ) సవరణ బిల్లు- 2026'ను రాజ్యసభ ఈ రోజు మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ, భూవిజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా).. ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ సవరణలు విద్యార్థులు, యువత ప్రయోజనాలను రక్షిస్తూనే పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికి చట్టపరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
పబ్లిక్ పరీక్షలు పారదర్శకంగా, నమ్మదగినవిగా, ప్రతిభకు పట్టం కట్టేలా నిర్వహించడం ద్వారా విద్యార్థుల నిజాయితీ కష్టానికి తగిన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ చట్టం కేవలం ప్రశ్నపత్రాల లీకేజీలకే పరిమితం కాలేదని స్పష్టం చేసిన ఆయన... పబ్లిక్ పరీక్షల్లో జరిగే అన్ని రకాల అక్రమాలను అరికట్టడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాల లీకేజీలు, జవాబు పత్రాలు లేదా కంప్యూటర్ వ్యవస్థల ట్యాంపరింగ్, పరీక్ష ప్రక్రియలను మార్చడం, నకిలీ వెబ్సైట్లు, హాల్ టిక్కెట్లను సృష్టించడం నుంచి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు చేసే వ్యవస్థీకృత ప్రయత్నాల వరకు ఈ చట్టం అన్ని నేరాలను సమగ్రంగా అరికడుతుందని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల మాల్ ప్రాక్టీసులను అరికట్టడంలో ఈ చట్టానికి ఉన్న సమగ్ర స్వరూపాన్ని ఈ నిబంధనలు తెలియజేస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్యుల నుంచి వచ్చే నిర్మాణాత్మక సూచనలను ఆహ్వానించిన ప్రభుత్వం... ఎంతో వినయం, స్వచ్ఛమైన మనస్సుతో ఈ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు దేశంలోని ప్రతి తల్లిదండ్రులనూ, ప్రతి కుటుంబాన్నీ, ప్రతి పౌరుడినీ తాకే అంశమని... ఇది విద్యార్థుల ఆకాంక్షలతో పాటు దేశ భవిష్యత్తు మానవ వనరులపై కూడా నేరుగా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. జాతీయ విద్యా విధానం-2020 విద్యార్థులకు మరింత అకడమిక్ సౌలభ్యాన్ని, విస్తృత అవకాశాలను కల్పిస్తూ విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చిందని తెలిపారు. దేశంలోని విశ్వవిద్యాలయాల సంఖ్య 760 నుంచి 1,293కి పెరగ్గా, ఉన్నత విద్యా సంస్థలు 51,534 నుంచి 64,896కి పెరిగాయని ఆయన సభకు సమాచారం అందించారు.
వైద్య విద్యలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ... ఎయిమ్స్ సంస్థల సంఖ్య 7 నుంచి 22కి, మెడికల్ కాలేజీలు 387 నుంచి 844కి, అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) మెడికల్ సీట్లు 51,300 నుంచి 1.39 లక్షలకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) మెడికల్ సీట్లు 31,000 నుంచి 86,300కి పెరిగాయని.. దీనివల్ల నాణ్యమైన వైద్య విద్య సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి, తక్కువ ధరలోకి మారిందని మంత్రి పేర్కొన్నారు.
విద్యా అవకాశాలు, ఉపాధి కల్పనను విస్తరించడానికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ఉపాధి కల్పన గురించి మాట్లాడుతూ, ప్రభుత్వ నియమకాలు 2004–2014 మధ్యకాలంలో 7.22 లక్షలుగా ఉంటే, 2014–2024 నాటికి అవి 10.96 లక్షలకు పెరిగాయని చెప్పారు. బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, ప్రభుత్వ సర్వీసుల్లో పదోన్నతుల పురోగతిని మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రమోషన్ డ్రైవ్లను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
యువతలో పారిశ్రామికవేత్తల భావనను పెంపొందించడానికి 'స్టార్టప్ ఇండియా' చొరవ ద్వారా ప్రభుత్వం ఎంతో ప్రోత్సహించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన సమయంలో దాదాపు 350–400గా ఉన్న స్టార్టప్ల సంఖ్య ఈనాడు దాదాపు 2.4 లక్షలకు పెరిగిందని, దీనితో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచిందని ఆయన వెల్లడించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, మేధో సంపత్తి సృష్టిలో గణనీయమైన ప్రగతి నమోదైందని, భారత్ ఇప్పుడు పీహెచ్డీ అవుట్పుట్ పేటెంట్ ఫైలింగ్స్లో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల సరసన నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024 పరిధిలోకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తో సహా ప్రధాన నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలు వస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో ఇప్పటికే ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ, కొన్ని నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు, ఆన్లైన్ దరఖాస్తు విధానాన్నీ, అభ్యర్థులకు సులువైన పరీక్ష ప్రక్రియలనూ అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక జవాబు ‘కీ’లను (ప్రొవిజనల్ ఆన్సర్ కీస్) విడుదల చేయడం ద్వారా పారదర్శకత పెరిగిందని, సైబర్ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసినట్లు ఆయన వెల్లడించారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)లో నియామక ప్రక్రియ సగటు వ్యవధిని గతంలో ఉన్న తొమ్మిది నెలల ఎనిమిది రోజుల నుంచి ఎనిమిది నెలల 24 రోజులకు తగ్గించినట్లు ఆయన తెలిపారు. ‘ప్రతిభా సేతు’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ప్రతిభావంతులైన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులను భావి ఉద్యోగ కల్పన సంస్థలతో అనుసంధానించేందుకు ఈ పోర్టల్ను రూపొందించామని, ఇప్పటికే 335 ప్రైవేట్ కంపెనీలు ఈ వేదికలో నమోదు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ నియామక పరీక్షల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సిఫార్సుల అమలు పురోగతిలో ఉందని మంత్రి తెలిపారు. ఆ కమిటీ చేసిన మొత్తం 46 సిఫార్సుల్లో ఇప్పటికే 35 సిఫార్సులను అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీటిలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపు ధృవీకరణ, బహుళస్థాయి తనిఖీలు, సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పునర్వ్యవస్థీకరణ వంటి కీలక చర్యలు అమలులోకి వచ్చాయని ఆయన వివరించారు.
ప్రభుత్వ నియామక పరీక్షల వ్యవస్థ సమగ్రతను మరింత బలోపేతం చేయాలంటే ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల నుంచి వచ్చే నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వం ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని పునరుద్ఘాటించిన ఆయన, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆశయాలను పరిరక్షిస్తూ ప్రభుత్వ పరీక్షల వ్యవస్థను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా, అక్రమాలకు తావులేకుండా మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తుందని తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2292153)
आगंतुक पटल : 11