గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన వర్గాల తరలింపుపై కేంద్రం స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
30 JUL 2026 1:38PM by PIB Hyderabad
షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ వాసుల (అటవీ హక్కుల గుర్తింపు-ఎఫ్ఆర్ఏ) చట్టం 2006 కింద గిరిజన హక్కులకు సంబంధించిన సమస్యలపై ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వన గుజ్జర్ వర్గాల నుంచి అందిన వినతి పత్రాలను పరిశీలించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే వెల్లడించారు. నేడు లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలను తెలిపారు. అటవీ హక్కుల చట్టం అమలు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోనే ఉంటుందని అందుకే ఆయా వినతిపత్రాలను పరిశీలన నిమిత్తం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా యంత్రాంగాలకు పంపినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఏ చట్ట నిబంధనలు, ఇతర సంబంధిత చట్టాలకు అనుగుణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ) నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతోంది. ఈ చట్టం అమలు పురోగతిని సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. అటవీ హక్కుల చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మంత్రిత్వ శాఖకు వచ్చే ఫిర్యాదులు, విజ్ఞప్తులను సంబంధిత రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెంటనే పంపుతారు. న్యాయంగా దక్కాల్సిన అటవీ హక్కులు అర్హులైన లబ్ధిదారులకు ఖచ్చితంగా అందేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం.
ఎఫ్ఆర్ఏ చట్టం ప్రకారం నిర్ణీత ప్రక్రియను పక్కాగా పాటించేలా చూడటానికి సబ్ డివిజనల్ స్థాయి కమిటీ (ఎస్డీఎల్సీ), జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) సభ్యులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇందుకోసం అవసరమైన శిక్షణ మెటీరియల్ను, సమాచార కరపత్రాలను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలకు క్రమం తప్పకుండా పంపుతోంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అధికారుల సామర్థ్య పెంపు చర్యలను, విస్తృత శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నాయి.
***
(रिलीज़ आईडी: 2291918)
आगंतुक पटल : 4