పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎస్ఏఎఫ్, కోర్సియా అమలుకు భారత్ సంసిద్ధతను సమీక్షించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఎస్ఏఎఫ్ ఉత్పత్తి, మిశ్రమ ప్రణాళిక, కర్బన గణన విధానంపై భాగస్వామ్య పక్షాల ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత
प्रविष्टि तिथि:
29 JUL 2026 9:55PM by PIB Hyderabad
సుస్థిర విమాన ఇంధనం (ఎస్ఏఎఫ్), అంతర్జాతీయ విమానాయానంలో కర్బనోద్గార పరిహార నిబంధనల అమలు - ఉద్గారాల తగ్గింపు పథకం (కోర్సియా), అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో)కు చెందిన అంతర్జాతీయ కర్బనోద్గారాల తగ్గింపు విధానం అమలు దిశగా భారత్ సన్నద్ధతను సమీక్షించేందుకు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఈ రోజు ఉన్నతస్థాయి భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని నిర్వహించింది.
పౌర విమానయాన కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వశాఖ, పెట్రోలియం - సహజవాయు మంత్రిత్వశాఖ, పర్యావరణ- అటవీ- వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, పౌర విమానయాన డైరెక్టొరేట్ జనరల్ (డీజీసీఏ), భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్), ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో (బీఈఈ), చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహక సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఎస్ఏఎఫ్ ఉత్పత్తి, ధ్రువీకరణ, సరఫరా వ్యవస్థ అభివృద్ధిలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు అమలు చేస్తున్న వివిధ ఎస్ఏఎఫ్ ఉత్పత్తి ప్రాజెక్టుల స్థితిగతులు, ఈ కేంద్రాలను ప్రారంభించడానికి నిర్దేశించిన కాలపరిమితులను కూడా సమీక్షించారు. 2027 నుంచి ఎదురయ్యే డిమాండును అందిపుచ్చుకునేలా.. సుస్థిర విమానయాన ఇంధనాన్ని సకాలంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు అవసరమైన చర్యలపై సంబంధిత వర్గాలు చర్చించాయి.
ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘మన విమానయాన రంగ అభివృద్ధికి తోడ్పడుతూ, అంతర్జాతీయ అకర్బనీకరణ ప్రయత్నాలకు అర్థవంతంగా దోహదపడే ఒక పటిష్టమైన, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల సుస్థిర విమానయాన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉంది. ‘ఒకే భూమి- ఒకే కుటుంబం- ఒకే భవిత’ అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక మార్గనిర్దేశంలో.. ఎస్ఏఎఫ్ను కేవలం నిబంధనల అమలుగా మాత్రమే కాకుండా, ఒక వ్యూహాత్మక జాతీయ అవకాశంగా మేం భావిస్తున్నాం. ఎస్ఏఎఫ్కు సంబంధించి ప్రతీ దశలో రైతులతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాలన్నీ ప్రయోజనాన్ని పొందుతాయి’’ అన్నారు.
‘‘ఉద్గారాలను తగ్గించడానికి ఒక పరిశ్రమగా మేమిప్పటికే అనేక కోణాల్లో కృషి చేస్తున్నాం. దేశంలో పూర్తిగా హరిత ఇంధనాన్ని వినియోగించే విమానాశ్రయాల సంఖ్య 2014లో ‘సున్నా’గా ఉండగా.. నేడు వాటి సంఖ్య 104కు చేరింది. వాటిలో పూర్తిగా 100 శాతం హరిత ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. లీజింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా.. ఆధునిక, ఇంధన సామర్థ్యం కలిగిన విమానాలను సమకూర్చుకునేలా విమానయాన సంస్థలకు సహకారాన్ని అందిస్తున్నాం. మన సమష్టి ప్రయత్నాలకు ఎస్ఏఎఫ్ కూడా ఒక కీలకమైన అంశం. సాధ్యాసాధ్యాల అధ్యయనాల నుంచి నిర్దిష్ట కాలవ్యవధులతో కూడిన ఉత్పత్తి కాలక్రమాల దిశగా, ఆశయాల నుంచి ఆచరణ దిశగా మనమిప్పుడు అడుగులు వేయాలి. తగినంత ఉత్పత్తి, లెక్కల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అత్యంత తక్కువ వ్యయంతో కూడిన పద్ధతిలో 1 శాతం కోర్సియా మిశ్రమ ఆవశ్యకతను సాధించడమే మన తక్షణ ప్రాధాన్యం. మన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా.. ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం ద్వారా కార్బన్ క్రెడిట్ పరిహార యంత్రాంగాన్ని తప్పక అభివృద్ధి చేయాలి’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఎస్ఏఎఫ్ తప్పనిసరి మిశ్రణ ప్రతిపాదనతోపాటు అందులో చమురు మార్కెటింగ్ కంపెనీలు, విమానయాన సంస్థలు, విమానాశ్రయ ఆపరేటర్ల పాత్రపై శ్రీ రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. ఐసీఏవో/ కోర్సియా అవసరాలకు అనుగుణంగా పటిష్టమైన గణన, పర్యవేక్షణ, నివేదన యంత్రాంగం ఏర్పాటుపైనా, సంపూర్ణ అనుసంధానం కలిగిన జాతీయ ఎస్ఏఎఫ్ రిజిస్ట్రీ అభివృద్ధి, ధ్రువీకరణ - మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేసే చర్యలపైనా చర్చించారు.
సమన్వయంతో కూడిన అమలు ప్రాధాన్యాన్ని వివరిస్తూ మంత్రి ఇలా అన్నారు: ‘‘సమష్టి నిర్ణయాలు, సంబంధిత భాగస్వామ్య పక్షాల నడుమ సమన్వయంతో ఈ పరివర్తన ప్రక్రియ ముందుకు సాగాలి. ఎస్ఏఎఫ్ సరఫరా వ్యవస్థల అభివృద్ధి, జాతీయ ఎస్ఏఎఫ్ రిజిస్ట్రీ, అకౌంటింగ్ - నివేదన వ్యవస్థలు, కోర్సియాను సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యల్లో పురోగతిపై మేం సమీక్షించాం. ఇప్పటికే సాధించిన గణనీయమైన పురోగతి, సంబంధిత మంత్రిత్వ శాఖలు, పరిశ్రమ వర్గాల నిబద్ధత ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. 2027 జనవరి 1న కోర్సియా తప్పనిసరి దశ ప్రారంభం కావడానికి ముందే భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా.. ఇందులో గుర్తించిన కార్యాచరణ అంశాలను వేగవంతం చేయాలని సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటినీ స్పష్టంగా నిర్దేశించాం.
ఎస్ఏఎఫ్ విధానం, దాని ఆర్థిక ప్రభావంపై మాట్లాడుతూ... ‘‘ఎస్ఏఎఫ్ విధాన ముసాయిదా ఇప్పుడు తుది దశలో ఉంది. వివిధ స్థాయుల్లో ఇలాంటి వివిధ అంతరమంత్రిత్వ శాఖల సంప్రదింపులు, భాగస్వామ్య పక్షాలతో సమావేశాలను నిర్వహిస్తున్నాం. నా వరకూ.. ప్రయాణికుడి అభిప్రాయమే అత్యంత కీలకం. ప్రయాణికుడే మన పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన భాగస్వామి. ఈ ప్రక్రియతో ప్రయాణికులు, విమానయాన సంస్థలపై సాధ్యమైనంత తక్కువ భారమే ఉండేలా మనం చూడాలి. అందుకోసం సాధ్యమయ్యే అన్ని ఎస్ఏఎఫ్ మార్గాలనూ మనం అధ్యయనం చేయాలి. ఉత్పత్తి దశ నుంచి విమానాశ్రయంలో చేరవేసే వరకు అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని ఆ మార్గాల్లో గుర్తించాలి’’ అని శ్రీ రామ్మోహన్ నాయుడు వివరించారు.
అధికార పత్రాల జారీ, భారత్లో కోర్సియా-అనుకూల కర్బన మార్కెట్ విధాన రూపకల్పన సహా.. కోర్సియా అమలు దిశగా భారత్ సన్నద్ధతపైనా సమావేశంలో చర్చించారు.
దేశీయంగా సుస్థిర విమాన ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, భారత విమానయాన వ్యవస్థను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ విమానయానంలో కర్బనోద్గారాలను తగ్గించడానికి, సుస్థిర విమానయాన రంగంలో భారత్ను అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలపడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2291627)
आगंतुक पटल : 8