వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భూటాన్కు అస్సాం ఐస్ క్రీమ్- పూరబీ
ఎగుమతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ
प्रविष्टि तिथि:
29 JUL 2026 2:01PM by PIB Hyderabad
అస్సాం పాడి రంగంతో పాటు ఈశాన్య ప్రాంతానికి చెందిన శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. 5,267 లీటర్ల పూరబీ ఐస్ క్రీముతో కూడిన ఒకటో అంతర్జాతీయ కన్సైన్మెంటును అస్సామ్ నుంచి భూటానుకు ఎగుమతి చేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విలువను జోడించిన పాడి సంబంధిత ఎగుమతులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్లయింది.
ఎగుమతి సరకు రవాణాను అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ నిన్న, అంటే 2026 జులై 28న ప్రారంభించారు. నార్త్ ఈస్ట్ డెయిరీ, ఫూడ్స్ (ఎన్ఈడీఎఫ్ఎల్) ఎగుమతి చేసిన ఈ సరకును భూటాన్లోని థింపూ, పారో, ఫుయెన్శోలింగ్తో పాటు వాంగ్దూ వంటి కీలక మార్కెట్లకు సరఫరా చేస్తారు. ఫలితంగా అస్సాం, ఈశాన్య ప్రాంత పాడి ఉత్పాదనలకు ఇరుగుపొరుగు అంతర్జాతీయ మార్కెట్లలో ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.
పూరబీ ఐస్ క్రీమును వెస్ట్ అస్సాం మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ యూనియన్ (డబ్ల్యూఏఎమ్యూఎల్) తయారు చేసింది. ఈ ఐస్ క్రీమును నార్త్ ఈస్ట్ డెయిరీ, ఫూడ్స్ (ఎన్ఈడీఎఫ్ఎల్) విక్రయిస్తోంది. అస్సాం అంతటా విస్తరించిన సహకార సంఘాల నెట్వర్క్ అందించే పాలను ఉపయోగించి, పూరబీ ఐస్ క్రీమును తయారు చేస్తున్నారు. తొలి విడత కన్సైన్మెంటులో కప్పులు, కోన్లు, కుటుంబానికి సరిపోయే ప్యాకులు, గ్యాలన్ ప్యాకులు సహా వివిధ ఉత్పాదనలు ఉన్నాయి. వీటిని భూటాన్లో వినియోగదారులతో పాటు సంస్థలను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు.
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ అధీనంలోని అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫూడ్ ప్రాడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ.. ‘అపెడా’) ఈశాన్య ప్రాంతం నుంచి వ్యావసాయిక ఉత్పాదనలతో పాటు శుద్ధి చేసిన ఆహారోత్పాదనలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడంలోనూ, విదేశీ మార్కెట్లకు సులభంగా చేరుకోవడంలోనూ ఎగుమతిదారు సంస్థలకు సహాయపడుతోంది ‘అపెడా’. ఈ ప్రాంతంలో విలువను జోడించిన ఉత్పాదనలను ప్రోత్సహించడమే కాక ఆ ఉత్పాదనలు మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకొనేలా చూడడంలో కూడా అపెడా చేస్తున్న నిరంతర కృషిని తాజా ఎగుమతి చాటిచెబుతోంది.
ఈశాన్య ప్రాంతం నుంచి శుద్ధి చేసిన పాడి ఉత్పాదనల ఎగుమతికి సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థను అపెడా పటిష్ఠపరిచింది. ఎగుమతులతో ముడిపడిన దస్తావేజులకు సంబంధించిన పనులు, నియంత్రణ సంబంధిత నియమాల పాలన, సరకు మార్కెట్లకు చేరుకొనేటట్లుగా చూడటం, ఆసక్తిదారులతో సమన్వయాన్ని ఏర్పరచడం వంటి పనుల్లో అపెడా తోడ్పడి, కన్సైన్మెంటుకు మార్గాన్ని సుగమం చేసింది. దీంతో ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే సరకును భూటాన్ వరకూ చేర్చారు.
భారత్, భూటాన్ భౌగోళికంగా పక్క పక్క దేశాలు అయినందువల్ల అస్సాం నుంచి పాడి ఉత్పాదనల ఎగుమతిని ప్రోత్సహించడానికి నైసర్గిక ప్రయోజనం కూడా లభిస్తోంది. అస్సాంలో తయారు చేసిన పాడి ఉత్పాదనలు పొరుగున గల అంతర్జాతీయ మార్కెట్లలో విరివిగా లభ్యమయ్యేటట్లు చూడటానికి భూటాన్ ఒక ముఖ్య ప్రవేశద్వారంగా ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో, దీర్ఘకాలం మన్నిక కలిగిన అదనపు పూరబీ పాడి ఉత్పాదనలను ప్రవేశపెట్టి మార్కెట్టు గిరాకీకి అనుగుణంగా ఎగుమతిని మెల్లమెల్లగా పెంచుతూ ఎగుమతుల శ్రేణిని విస్తరించేందుకు ఎన్ఈడీఎఫ్ఎల్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ఈ కార్యక్రమంతో ఈశాన్య ప్రాంత పాడి ఉత్పాదనలకు అంతర్జాతీయ ఆదరణ విస్తరించడం, పాడి పరిశ్రమకు దీర్ఘకాలిక ఎగుమతి అవకాశాలు అందడమే కాకుండా అస్సాం సహకార రంగ పాడి నెట్వర్క్తో ముడిపడిన వేలాది పాడి రైతులకు ఆదాయావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
భారత వ్యావసాయిక ఉత్పాదనలు, శుద్ధి చేసిన ఆహారోత్పాదనలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడటాన్ని ప్రోత్సహించడంతో పాటు దేశవ్యాప్తంగా రైతులకూ, వ్యవసాయ ప్రధాన వాణిజ్య సంస్థలకూ మన్నికైన ఎగుమతి ఆధారిత అభివృద్ధి అవకాశాలను అందించడానికీ రాష్ట్రప్రభుత్వాలతో, ఎగుమతి సంస్థలతో, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్పీఓల)తో, సహకార సంఘాలతో, ఇతర ఆసక్తిదారులతో అపెడా కలిసి పనిచేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2291105)
आगंतुक पटल : 12