ఆయుష్
లే లో యోగా వెల్నెస్ ఇన్ స్ట్రక్టర్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన ఎండీఎన్ఐవై, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా
प्रविष्टि तिथि:
27 JUL 2026 3:14PM by PIB Hyderabad
లే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా (ఎన్ఐఎస్ఆర్)లో మూడు నెలల (400 గంటల) యోగా వెల్నెస్ ఇన్ స్ట్రక్టర్ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభమైంది. ఎండీఎన్ఐవై మార్గదర్శకాలకు అనుగుణంగా న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్ఐవై), లే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహిస్తున్నాయి.
ప్రధానమంత్రి యోగా అవార్డు గ్రహీత, మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ (ఎంఐఎంసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ భిక్కు సంఘసేన చేతుల మీదుగా ఈ కోర్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూటీ లద్దాఖ్ ఆయుష్, ఆరోగ్య, వైద్య విద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ తాషి థిన్లాస్ హాజరయ్యారు. ప్రారంభ సదస్సుకు లే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా (ఎన్ఐఎస్ఆర్) డైరెక్టర్ డాక్టర్ పద్మ గుర్మెట్ అధ్యక్షత వహించారు.
లద్దాఖ్ లో మొదటిసారిగా నిర్వహించిన యోగా వెల్నెస్ సర్టిఫికెట్ కోర్సులో చేరిన అభ్యర్థులను డాక్టర్ పద్మ గుర్మెట్ అభినందించారు. ఈ శిక్షణ కార్యక్రమంలోని సిద్ధాంత, ఆచరణాత్మక అంశాల్లో క్రియాశీలకంగా పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లద్దాఖ్ ప్రజల క్షేమం కోసం యోగా, ధ్యానాన్ని ప్రోత్సహించటంలో గౌరవ భిక్కు సంఘసేన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజహితానికి సంప్రదాయ ఆరోగ్య వ్యవస్థలను, విధానాలను ప్రోత్సహించేందుకు ఎన్ఐఎస్ఆర్ నిబద్ధతను తెలియజేశారు.
యోగ విద్య ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణను, సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా చేస్తున్న కృషిని డాక్టర్ తాషి థిన్లాస్ అభినందించారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని సాధించేందుకు ఆధునిక వైద్యం, సంప్రదాయ వైద్యం, యోగా అనుసంధానానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో యోగా నిపుణుల పరిధిని, ఆరోగ్య రంగంలో యోగాను చేర్చే ప్రణాళికను కూడా ఆయన వివరించారు.
గౌరవ భిక్కు సంఘసేన మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక సంక్షేమాన్ని పెంపొందించే జీవన విధానంగా యోగాను అభివర్ణించారు. వ్యక్తిగత వికాసంతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడేలా యోగాను నిబద్ధతతో, అంకితభావంతో స్వీకరించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. యోగా, ధ్యానం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని చెబుతూ.. కోర్సు సమయంలో ధ్యానం కోసం మహాబోధి మెడిటేషన్ సెంటర్ను సందర్శించాల్సిందిగా విద్యార్థులను, అధ్యాపకులను ఆహ్వానించారు.
విద్యార్థులకు ప్రోగ్రాం షెడ్యూల్, కోర్సు మార్గదర్శకాల గురించి కోర్సు కో-ఆర్డినేటర్ శ్రీ గోపాల్ శర్మ విద్యార్థులకు వివరించారు. మూడు నెలల యోగా వెల్నెస్ ఇన్ స్ట్రక్టర్ సర్టిఫికేట్ కోర్సు లాంఛనంగా ప్రారంభమైనట్లు కొత్తగా చేరిన అభ్యర్థులకు చెబుతూ.. కుమారి డోల్మా త్సెరింగ్ ధన్యవాదాలు తెలపటంతో ప్రారంభ కార్యక్రమం ముగిసింది.
***
(रिलीज़ आईडी: 2289992)
आगंतुक पटल : 13