కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గుంటూరులో ఆధునికీకరించిన జన్ సేవా కనెక్ట్ పోస్టాఫీసులను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
రూ. 5,785 కోట్లతో డిజిటల్ మార్పులు, ఏఐ ఆధారిత కార్యకలాపాలు, కార్పొరేట్ సంస్కరణలతో నూతన శకంలోకి ఇండియా పోస్ట్
2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోనే అత్యుత్తమ పనితీరుతో ప్రథమ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్
प्रविष्टि तिथि:
24 JUL 2026 6:24PM by PIB Hyderabad
‘జన్ సేవా కనెక్ట్' కార్యక్రమం కింద గుంటూరులో ఆధునికీకరించిన కొత్తపేట, చంద్రమౌళి నగర్ సబ్ పోస్టాఫీసులను కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ఈ రోజు ప్రారంభించారు. తరువాతి తరం పౌర సేవా కేంద్రాలుగా ఈ పోస్టాఫీసులను ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అభివృద్ధి చేశారు. ఇవి పోస్టల్, బ్యాంకింగ్, డిజిటల్, రవాణా సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతాయి.


ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మాట్లాడుతూ... ఇండియా పోస్ట్ కేవలం ఉత్తరాలు అందించే ఒక శాఖ మాత్రమే కాదని, అది ప్రజల జీవితాలను అనుసంధానిస్తూ, సమాజాన్ని సాధికారత వైపు నడిపిస్తూ, భారత డిజిటల్, ఆర్థిక మార్పునకు ఊతమిచ్చే ఒక జాతీయ సంస్థ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మార్గదర్శకత్వంలో తపాలా శాఖ తన 170 సంవత్సరాల చరిత్రలోనే అత్యంత సమగ్రమైన మార్పును సంతరించుకుంటోందని, ప్రపంచ స్థాయి బట్వాడా, ఈ-కామర్స్, ఆర్థిక సేవల వ్యవస్థగా అవతరిస్తోందని ఆయన వివరించారు.

తపాలా రంగంలో దేశంలోనే అతిపెద్ద సాంకేతిక ఆధునీకరణ కార్యక్రమాల్లో ఒకదాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఐటీ 2.0, అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) 2.0 కింద రూ.5,785 కోట్ల పెట్టుబడితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షలకు పైగా తపాలా కార్యాలయాల నెట్వర్క్లో కృత్రిమ మేధస్సు (ఏఐ), క్లౌడ్ ఆధారిత వేదికలు, రియల్ టైమ్ డేటా వ్యవస్థలను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో దాదాపు 90 శాతం తపాలా కార్యాలయాలు గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సాంకేతిక మార్పులతో సేవలు వేగంగా అందడమే కాకుండా, నిరంతర పర్యవేక్షణ, మెరుగైన నిర్వహణ సామర్థ్యం, వినియోగదారులకు మరింత సులభమైన, సమగ్ర సేవల అనుభవం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
భారత తపాలా శాఖ కూడా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ), చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ), వైస్ సీటీఓ వంటి వ్యూహాత్మక నాయకత్వ హోదాలను ప్రవేశపెట్టి కార్పొరేట్ తరహా పాలనా విధానాన్ని అవలంబించిందని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. స్పష్టమైన వ్యాపార లక్ష్యాలు, నెలవారీ పనితీరు సమీక్షలు, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థలు, వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే విధానంతో తపాలా శాఖ మరింత చురుకైన, పోటీ సామర్థ్యం కలిగిన, ప్రజలు, వ్యాపార సంస్థల మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించే సంస్థగా మారుతోందని పేర్కొన్నారు.

రవాణా రంగంలో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, భారత తపాలా శాఖ సవరించిన ధరల విధానం, పెద్ద మొత్తంలో పంపే వస్తువులకు చార్జీ రాయితీలు, ‘బై నౌ పే లేటర్’ (బీఎన్పీఎల్) సౌకర్యాలు, ప్రత్యేక ప్యాకేజింగ్ పరిష్కారాలు, జియో ట్యాగ్ చేసిన డెలివరీలు, ఎస్ఎంఎస్ ట్రాకింగ్, ఓటీపీ ఆధారిత డెలివరీ సదుపాయం, 24 నుంచి 48 గంటల లోపు బట్వాడా ప్రమాణాలను ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. ఓఎన్డీసీ, జెమ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పతంజలి వంటి సంస్థలతో పాటు డీహెచ్ఎల్ వంటి అంతర్జాతీయ రవాణా సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు భారత ఈ-కామర్స్ వ్యవస్థ విస్తరణకు గణనీయంగా దోహదపడుతున్నాయని, రవాణా మార్కెట్లో భారత తపాలా శాఖ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.
తపాలా కార్యాలయాలు ఇప్పుడు సమగ్ర పౌర సేవా కేంద్రాలుగా వేగంగా రూపాంతరం చెందుతున్నాయని ఆయన తెలిపారు. యూపీఐ చెల్లింపులు, ఆధార్ నమోదు, ఆధార్ వివరాల నవీకరణ సేవలు, పాస్పోర్ట్ సేవా సౌకర్యాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్స్టెప్ బ్యాంకింగ్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రభుత్వ పొదుపు పథకాలను తపాలా కార్యాలయాల ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత తపాలా శాఖ 3.8 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను నిర్వహిస్తోందని, తపాలా లావాదేవీలలో 60 శాతానికి పైగా ఇప్పుడు డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయని తెలిపారు. నగదు వినియోగం తగ్గిన, సాంకేతికత ఆధారిత వ్యవస్థ వైపు తపాలా శాఖ విజయవంతంగా మారుతోందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ మార్పులో గ్రామీణ డాక్ సేవకులు (జీడీఎస్), పోస్ట్మెన్లు వెన్నెముక వంటి కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. జీడీఎస్ సమ్మేళనాలు, క్రమబద్ధమైన శిక్షణ కార్యక్రమాలు, విక్రయ నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్ సామర్థ్యాల పెంపు, ఫిర్యాదుల పర్యవేక్షణ, ప్రతిభను గుర్తించే విధానాలు, పనితీరు ఆధారిత జవాబుదారీతనం వంటి చర్యల ద్వారా గ్రామీణ భారతదేశంలో ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ పాలనకు విశ్వసనీయ ప్రతినిధులుగా పనిచేసేలా భారత తపాలా శాఖ తన ముందువరుస సిబ్బందిని బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. పొదుపు, బీమా, ఆర్థిక ప్రణాళికపై కుటుంబాలకు అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో జీడీఎస్ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ సంస్కరణలు ఇప్పటికే విశేష ఫలితాలను అందిస్తున్నాయని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటివరకు భారత తపాలా శాఖ అత్యధిక త్రైమాసిక ఆదాయాన్ని సాధించిందని, రూ.4,009 కోట్ల ఆదాయంతో ఏడాది ప్రాతిపదికన 22 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొన్నారు. లావాదేవీలు లేని ఖాతాల సంఖ్య 90 శాతానికి పైగా తగ్గిందని, ఎఫెక్టివ్ కెపబిలిటీ రేషియో (ఈసీఆర్) 41 శాతం నుంచి 47 శాతానికి మెరుగుపడిందని తెలిపారు. ఇది తపాలా శాఖ కార్యకలాపాల సామర్థ్యంలో గణనీయమైన పురోగతిని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ను అభినందిస్తూ, 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోస్టల్ సర్కిల్గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ త్రైమాసిక వ్యాపార లక్ష్యంలో 102 శాతం సాధించి, రూ.233.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని పేర్కొన్నారు. మెయిల్ ఆపరేషన్స్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని సాధించడంతో పాటు, పార్సిల్ వ్యాపారంలో 140 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. ‘జయహో భీమా సంకల్ప్’ బీమా ప్రచారం ద్వారా రూ.50 కోట్లకు పైగా ఆదాయాన్ని సాధించిందని వివరించారు. తల్లికి వందనం, దీపం, ఎన్టీఆర్ రైతు భరోసా, ఎన్టీఆర్ నగర్ వంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు అందించే చెల్లింపుల్లో దాదాపు 33 శాతం తపాలా వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయని, ఇది తపాలా శాఖకు ఉన్న అపూర్వమైన చివరి మైలు సేవల చేరువ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.
గుంటూరు ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించేలా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మార్గదర్శకత్వంలో రెండు తపాలా కార్యాలయాలను కొత్తగా రూపకల్పన చేసినట్లు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రూ.51.81 లక్షల వ్యయంతో ఆధునికీకరించిన కొత్తపేట సబ్ పోస్టాఫీస్లో 1975లో విడుదలైన కూచిపూడి స్మారక తపాలా బిళ్ల స్ఫూర్తితో ప్రత్యేకమైన ఎరుపు రంగు ఫీచర్ వాల్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రూ.64.13 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన చంద్రమౌళి నగర్ సబ్ పోస్టాఫీస్ ను తిరుమలలోని ప్రసిద్ధ ఆనంద నిలయం గోపురం నిర్మాణ శైలిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించినట్లు తెలిపారు.

జన్ సేవా కనెక్ట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్, గుంటూరు డివిజన్ అధికారులు, సిబ్బందిని కేంద్ర మంత్రి అభినందించారు. వాతావరణ పరిస్థితులు, భౌగోళిక అడ్డంకులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికీ అవసరమైన సేవలను అందిస్తూ భారత తపాలా శాఖ విజయానికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్న పోస్ట్మెన్లు, గ్రామీణ డాక్ సేవకులను ప్రత్యేకంగా అభినందించారు. వారే భారత తపాలా శాఖ విజయానికి అసలైన హీరోలని ఆయన పేర్కొన్నారు.
వికసిత భారత్ కేవలం ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదని, ఇది ప్రతి ఒక్కరి ఉమ్మడి జాతీయ బాధ్యత అని ప్రసంగాన్ని ముగిస్తూ డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వేగవంతమైన, సాంకేతికత ఆధారిత, ప్రజా కేంద్రిత పాలనను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నిహిత భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. జన్ సేవా కనెక్ట్ కార్యక్రమం కింద ప్రతి తపాలా కార్యాలయం విశ్వసనీయ ప్రజా సంస్థగా రూపుదిద్దుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తోడ్పాటు అందించడం, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, మహిళలకు సాధికారత కల్పించడం, వృద్ధులకు సహాయం చేయడం, సమాజాలను బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్య సాధన దిశగా తపాలా కార్యాలయాలు దేశాన్ని మరింత దగ్గర చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2289197)
आगंतुक पटल : 9