కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
హైదరాబాద్లోని బోష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ను సందర్శించిన బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి శాఖ మంత్రులు
భారత కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే నేతృత్వంలో సాగిన బ్రిక్స్ మంత్రుల పర్యటన
प्रविष्टि तिथि:
16 JUL 2026 4:58PM by PIB Hyderabad
బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి శాఖ మంత్రులు, ప్రతినిధి బృందాల నేతలు ఈ రోజు హైదరాబాద్లోని బోష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ క్యాంపస్ను, సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ (సీఐఐ-జీబీసీ)నూ సందర్శించారు. కేంద్ర ఎంఎస్ఎంఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే నేతృత్వంలో ఈ పర్యటన సాగింది. భారత బ్రిక్స్ అధ్యక్షతన హైదరాబాద్లో నిర్వహిస్తున్న 12వ బ్రిక్స్ కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల సమావేశం (ఎల్ఈఎంఎం)లో భాగంగా ఈ పర్యటన జరిగింది. డిజిటల్ ఆవిష్కరణ, కృత్రిమ మేధ (ఏఐ), గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీ), భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాభివృద్ధి, సుస్థిర పారిశ్రామిక వృద్ధి వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ నాయకత్వాన్ని ఈ సందర్శనలు ప్రముఖంగా స్పష్టం చేశాయి.
బోష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ సందర్శనలో భాగంగా బ్రిక్స్ ప్రతినిధి బృందం బోష్, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), ఆరోగ్య సంరక్షణ, ఆటోమోటివ్, తయారీ వంటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) నుంచి వచ్చిన సీనియర్ పరిశ్రమ నాయకులతో సంభాషించింది. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, ఏఐ-ఆధారిత పరిష్కారాలు, ప్రపంచ వ్యాపార పరివర్తనను జీసీసీలు ముందుకు నడిపిస్తున్న తీరును ఈ చర్చలు ప్రదర్శించాయి. పరిశ్రమ-విద్యాసంస్థల సహకారాన్ని బలోపేతం చేయడం... మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం... కార్యాలయాల పనితీరును మెరుగుపర్చడానికి ఏఐని ఉపయోగించుకోవడం... సమ్మిళిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడంపై చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
2.36 మిలియన్లకు పైగా నిపుణులకు ఉపాధి కల్పిస్తున్న 2,100కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లతో వేగంగా విస్తరిస్తున్న భారత జీసీసీ వ్యవస్థ గురించి పరిశ్రమ ప్రముఖులు బ్రిక్స్ ప్రతినిధి బృందానికి వివరించారు. దాదాపు 400 జీసీసీలకు నిలయమైన హైదరాబాద్, దేశంలోని ప్రముఖ ఆవిష్కరణల కేంద్రాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తనకు ప్రపంచ స్థాయిలో ప్రాధాన్య గమ్యస్థానంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.
సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో... హరిత భవనాలు, వనరుల సామర్థ్యం, పర్యావరణ-సామాజిక-పరిపాలన (ఈఎస్జీ) పద్ధతులు, సుస్థిర పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రులకు వివరించారు. పోటీతత్వం, సామర్థ్యాలు, నాణ్యమైన ఉపాధిని పెంపొందిస్తూనే... పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులను అవలంబించడానికి వీలు కల్పించేలా భారత పరిశ్రమకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మార్గదర్శనం చేస్తోంది.
పర్యావరణ సుస్థిరత, హరిత భవిష్యత్తు పట్ల బ్రిక్స్ దేశాల సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... బ్రిక్స్ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
చైతన్యవంతమైన భారత ఆవిష్కరణల వ్యవస్థను, అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని, సుస్థిర అభివృద్ధి పట్ల బలమైన నిబద్ధతను ప్రత్యక్షంగా చూసేందుకు బ్రిక్స్ ప్రతినిధి బృందాలకు ఈ పర్యటన ఒక చక్కని అవకాశాన్ని కల్పించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో... భవిష్యత్ పనితీరును తీర్చిదిద్దడం, సమ్మిళితమైన, సమర్థమైన, సుస్థిర ఆర్థిక వృద్ధిని పెంపొందించడం కోసం సాంకేతికత, ఆవిష్కరణలు, నైపుణ్యాలు, సుస్థిరతను వినియోగించుకోవాలనే దార్శనికతతో ముందుకు సాగుతున్న భారత పురోగతిని ఇది స్పష్టం చేసింది.
***
(रिलीज़ आईडी: 2285644)
आगंतुक पटल : 9