వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘ఆంధ్రప్రదేశ్ ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ సీజన్ 2025–26’పై వాణిజ్య శాఖ సమీక్ష
प्रविष्टि तिथि:
10 JUL 2026 4:07PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్సీవీ) పొగాకు మార్కెటింగ్ సీజన్ 2025–26 (పొగాకు కొనుగోళ్ల సమయం) పురోగతిపై కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారుల బృందం హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితిన్ కుమార్ యాదవ్ (ఐఏఎస్) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సమావేశం స్పష్టం చేసింది. పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులను సులభతరం చేయడం, ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా దృష్టి సారించింది.
పొగాకు బోర్డు పనితీరును మరింత మెరుగుపరచడానికి వీలుగా దాన్ని పునర్వ్యవస్థీకరించడం, పొగాకు రైతుల సంక్షేమ నిధి కింద లభించే ప్రయోజనాలను పెంచడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, సరికొత్త డిజిటల్ విధానాలను తీసుకురావడం, నాణ్యత నిర్ధారణ కోసం కృత్రిమ మేధ ఆధారిత గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో సమీక్షించారు.
అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో భారత పొగాకుకు కొత్త ఎగుమతి అవకాశాలను విస్తరించడం, పొగాకు పండించడానికి అనుకూలమైన ప్రాంతాలలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంపై కూడా చర్చించారు.
భాగస్వాములందరి సమన్వయ ప్రయత్నాలు భారతీయ ఎఫ్సీవీ పొగాకు రంగానికి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని చేకూరుస్తాయని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితిన్ కుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు పోటీతత్వాన్ని పెంచడానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2283375)
आगंतुक पटल : 10