ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
చిన్న పిల్లల ఆరోగ్యం, బాల వికాస బలోపేతానికి 16వ సీసీహెచ్ఎఫ్డబ్ల్యూ సమావేశంలో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం (ఎస్ఎస్బీఎస్కే)ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా
పుట్టినప్పటి నుంచి 36 నెలల వయసు వరకు ఇల్లు, పరిసరాల్లో నిరంతర సంరక్షణను అందించే ఏకీకృత జాతీయ కార్యక్రమం
प्रविष्टि तिथि:
29 JUN 2026 6:42PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా నవజాత శిశువులు, బాలల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఇవాళ సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం (ఎస్ఎస్బీఎస్కే)ను ప్రారంభించారు. ఇది సమగ్ర జాతీయ కార్యక్రమం. దీని ద్వారా బిడ్డ పుట్టినప్పటి నుంచి 36 నెలల వయసు వరకు ఇల్లు, పరిసరాల్లో నిరంతరం ఆరోగ్య సంరక్షణ అందుతుంది.
మొదటి మూడేళ్లు సమగ్ర సంరక్షణ లక్ష్యంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న హోమ్-బేస్డ్ న్యూబోర్న్ కేర్ (హెచ్బీఎన్సీ), హోమ్-బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ (హెచ్బీవైసీ) కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. నవజాత శిశువుల మనుగడకు మొదటి 28 రోజులు, మెదడు ఎదుగుదలకు మొదటి మూడు సంవత్సరాలు ఎంత కీలకమో ఈ కార్యక్రమం తెలియజేస్తుంది. ఒక సమగ్ర విధానం ద్వారా పిల్లల మనుగడ, పోషకాహారం, ఆరోగ్యకరమైన పెరుగుదల, బాల్యంలో ఆరంభ వికాసాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.
తక్కువ బరువుతో పుట్టటం, నెలలు నిండక ముందే జన్మించటం, తల్లిపాలు పట్టటంలో ఆలస్యం, నవజాత శిశు సంరక్షణ కేంద్రాల నుంచి డిశ్చార్జ్ కావటం, పోషకాహార లోపం, పదేపదే వచ్చే అనారోగ్యాలు లేదా అభివృద్ధిలో జాప్యం వంటి పరిస్థితుల కారణంగా 'ప్రమాదంలో ఉన్నవారు'గా గుర్తించిన నవజాత శిశువులు, చిన్న పిల్లల కోసం ప్రమాదాన్ని బట్టి వర్గీకరించే విధానాన్ని ప్రవేశపెట్టటం ఎస్ఎస్బీఎస్కే ముఖ్య లక్షణం. ఈ పిల్లలకు ప్రమాద స్థాయికి అనుగుణంగా ఇంటివద్దనే మరింత పటిష్టమైన పర్యవేక్షణ లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా 'ప్రమాదంలో ఉన్న' నవజాత శిశువులకు పుట్టిన మొదటి 42 రోజుల్లో గరిష్ఠంగా తొమ్మిది సార్లు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. 'ప్రమాదంలో ఉన్న' పిల్లలకు 36 నెలలు నిండే వరకు గరిష్ఠంగా ఎనిమిది సార్లు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేస్తారు.
గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశాలు), సహాయక నర్సులు (ఏఎన్ఎంలు), కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓలు), అంగన్వాడీ కార్యకర్తల (ఏడబ్ల్యూడబ్ల్యూలు) సమన్వయంలో ఇంటివద్దే ఆరోగ్య పరీక్షల నిర్వహణ ద్వారా ఈ కార్యక్రమం నిరంతర సంరక్షణను మరింత బలోపేతం చేస్తుంది. 'ప్రమాదంలో ఉన్న' నవజాత శిశువుల కోసం 3వ రోజు, 7వ రోజున... 'ప్రమాదంలో ఉన్న' పిల్లల కోసం 3వ, 6వ నెలల్లో ఏఎన్ఎంలు, సీహెచ్ఓలు సంయుక్తంగా ఇంటివద్ద ఆరోగ్య సేవలు అందించాల్సి ఉంటుంది. సమయానుకూల అంచనా, కౌన్సెలింగ్ ఇవ్వటం, ఉన్నత ఆస్పత్రులకు రిఫర్ చేయటాన్ని సులభతరం చేసేందుకు ఈ సమన్వయ చర్యలను రూపొందించారు.
బలహీనంగా ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించి, సంరక్షించే ప్రక్రియను మరింత బలోపేతం చేయటానికి ప్రతి గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య, పోషకాహార దినోత్సవం (వీహెచ్ఎస్ఎన్డీ) సందర్భంగా వెల్-బేబీ సెషన్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ప్రతి నెలా శిశు శిబిరాన్ని ఎస్ఎస్బీఎస్కే ప్రవేశపెడుతోంది. ఈ వేదికలు కమ్యూనిటీ పరిధిలోనే నవజాత శిశువులు, చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదలకు సంబంధించి పర్యవేక్షణ, సమగ్ర సంరక్షణ అందించేందుకు దోహదపడతాయి.
మాతృమూర్తి, శిశువుల ఆరోగ్యం పరస్పరం ముడిపడి ఉన్నాయనే విషయాన్ని గుర్తిస్తూ ప్రసవానంతర మాతృ మానసిక ఆరోగ్య పరీక్షలను కమ్యూనిటీ ఆధారిత సంరక్షణలో ముఖ్యమైన భాగంగా ఎస్ఎస్బీఎస్కే చేర్చింది. ఆశా కార్యకర్తలు ఈ పరీక్షలను ముందుగానే చేపట్టి, అవసరమైనప్పుడల్లా తదుపరి పరీక్షలు, అవసరమైన మద్దతు కోసం సకాలంలో నిపుణుల వద్దకు పంపుతారు. ప్రతి ఇంటి సందర్శనలో, సామాజిక చర్యల సమయంలో.. బాధ్యతాయుతమైన సంరక్షణ, బాల్యంలో నేర్చుకునే అవకాశాలు, వయసుకి తగిన ఆటలు, పిల్లల భద్రత, కుటుంబ సభ్యుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం ద్వారా ఈ కార్యక్రమం బాల్యంలో ఎదుగుదలకు (ఈసీడీ) అవసరమైన సంరక్షణను ముఖ్య భాగంగా మారుస్తుంది.
సేవలు అందించటం, పర్యవేక్షణ, నిరంతర సంరక్షణను మెరుగుపరిచేందుకు డిజిటల్ సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్ణయ-మద్దతు వ్యవస్థలు (డీఎస్ఎస్), ప్రతి బిడ్డకు డిజిటల్ ట్రాకింగ్, రెఫరల్ వ్యవస్థలు, అప్రమత్తం చేసే వ్యవస్థలు... 'ప్రమాదంలో ఉన్న' నవజాత శిశువులు, పిల్లల తదుపరి సంరక్షణ, కేసు నిర్వహణను మరింత బలోపేతం చేస్తాయి. ఈ డిజిటల్ వ్యవస్థలు.. జనని పోర్టల్, యు-విన్ పోర్టల్, ఎంపీసీడీఎస్ఆర్ పోర్టల్, ఆర్బీఎస్కే 2.0 పోర్టల్, పోషణ్ ట్రాకర్తో సహా జాతీయ డిజిటల్ ఆరోగ్య వేదికలతో అనుసంధానం అవుతాయి. ఇది ఆభా, బాల్-ఆభా ఐడీల ద్వారా సజావుగా డేటా మార్పిడికి వీలు కల్పిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మురికివాడలు, వలసదారుల నివాసాలు, ఇతర వెనుకబడిన వర్గాల్లో నివసించే పిల్లల కోసం ఇంటి వద్దే అందించే సంరక్షణను బలోపేతం చేయటానికి ఈ కార్యక్రమంలో ప్రత్యేక వ్యూహాలుంటాయి.
డిజిటల్ యుగంతో ముడిపడున్న సరికొత్త సవాళ్లను కూడా ఈ మార్గదర్శకాలు ఎత్తిచూపాయి. బాల్యంలో స్క్రీన్లను ఎక్కువగా వినియోగించటం, సమాజంతో తక్కువగా కలవటం వంటివి మెదడు ఎదుగుదలపై, మానసిక ఆరోగ్యంపై, సామాజిక నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదాలుగా ఇవి గుర్తించాయి. దీనికి అనుగుణంగా పిల్లల మొదటి మూడేళ్ల జీవితంలో వారి సంజ్ఞానాత్మక, శారీరక, మానసిక, సామాజిక వికాసానికి తోడ్పడేలా... వయసుకు తగిన ఆటలను, శారీరక శ్రమను, మేధస్సును ఎస్ఎస్బీఎస్కే ప్రోత్సహిస్తుంది.
సంరక్షణ, సమ్మిళిత, డిజిటల్ సాంకేతికతతో కూడిన విధానం ద్వారా తల్లీ, నవజాత శిశువు, పిల్లల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమ ప్రారంభం కీలక ఘట్టంగా నిలుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2279201)
आगंतुक पटल : 8