గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నడవడికలో మార్పు, పౌరుల కార్యాచరణ సాయంతో పరిశుద్ధ నగరాల కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్న తెలంగాణ
प्रविष्टि तिथि:
29 JUN 2026 1:46PM by PIB Hyderabad
పౌరులు నిత్యం తమ సహకారాన్ని అందిస్తుండడంతో స్వచ్ఛ్ భారత్ మిషన్ అర్బన్ 2.0 (ఎస్బీఎమ్-యూ 2.0) కింద పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత ను ఆవిష్కరించే విషయంలో తెలంగాణ మును ముందుకు దూసుకుపోతోంది. 100 రోజుల ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) ప్రచార ఉద్యమాన్ని శ్రద్ధగా అమలు చేస్తూ ప్రజలు, పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ) కలిసికట్టుగా స్వచ్ఛత, ప్రజారోగ్యం, దీర్ఘకాల ప్రాతిపదికన ప్రవర్తనలో మార్పు అంశాల్లో చెప్పుకోదగిన మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి.
స్వచ్ఛత విషయంలో స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రవర్తన పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద మార్పునకు మూలకారణంగా నిలిచింది. ఎస్బీఎమ్-యూ 2.0ను ప్రారంభించిన తరువాత, ఈ పరివర్తనాత్మక ప్రయాణం మరింత జోరందుకుంది. వ్యర్థ పదార్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించడంలో పౌరుల వ్యవహార సరళినీ, వారి అలవాట్లనీ ప్రభావవంతంగా మార్చడంపై ఎస్బీఎమ్-యూ 2.0 ప్రధానంగా దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో ఈ మార్పునకు వేగాన్ని జత చేయడంలో ఐఈసీ ఆధ్వర్యంలోని కార్యక్రమాలు కీలక పాత్రను పోషించాయి. ఫలితంగా అర్బన్ కమ్యూనిటీల్లో అవగాహన పెరిగింది. వాటి ఆలోచన ధోరణుల్లో మార్పు చోటుచేసుకుంది. స్వచ్ఛత పరిరక్షణ పట్ల యాజమాన్య భావన, గౌరవంతో కూడిన సిసలైన భావనలు విస్తరించాయి. ఈ సామూహిక పరివర్తన పట్టణాల స్వచ్ఛత స్థితిగతుల్లో స్పష్ట మార్పును చూపుతోంది. ఎక్కడ చూసినా రోడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయి. బహిరంగ ప్రదేశాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఇదివరకు చెత్త వేస్తూ వచ్చిన చోట్ల రూపురేఖలు చాలా వరకూ మారాయి. దేశమంతటా రాష్ట్రాలు, యూఎల్బీలు సవాలును స్వీకరించి, చెప్పుకోదగిన సృజనాత్మకతతో వినూత్న, నిరంతర ప్రచార ఉద్యమాల్ని నడిపాయి. ఈ ఉద్యమాలు పౌరులకు సూచనలు చేయడానికే పరిమితం కాకుండా మన దేశ స్వచ్ఛ నగర ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకొనేటట్లు వారికి స్ఫూర్తిని అందిస్తున్నాయి.
ఎస్బీఎమ్-యూ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ తన పట్టణ స్వచ్ఛత వ్యూహానికి పౌర భాగస్వామ్యం, ప్రవర్తనరీత్యా పరివర్తన.. ఈ రెండు అంశాలను కీలకంగా భావించి, నిరంతర ప్రాధాన్యాన్ని ఇస్తోంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన స్వచ్ఛతా ఫలితాలను సాధించడానికి క్షేత్ర స్థాయిలో చురుకైన ప్రజా భాగస్వామ్యం, దృష్టికోణంలో మార్పు ఎంతైనా అవసరమని తెలంగాణ తలచి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీనిని 2025 జూన్ 2 నుంచి అదే ఏడాది సెప్టెంబరు 10 వరకు అమలుచేసింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో సువ్యవస్థిత, సమయబద్ధ సమాచార, ప్రసార శిక్షణ, అవగాహన ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమన్వయపూర్వక సమీకరణ ప్రయత్నాల ద్వారా స్వచ్ఛత, పర్యావరణం, ప్రజారోగ్య సంబంధిత కీలక ప్రమాణాల పరంగా ప్రగతి సాధించే లక్ష్యంతో ఈ ప్రచార ఉద్యమాన్ని రూపొందించారు.
స్వచ్ఛతా పరిరక్షణ కోసం ఒక విస్తృత పునాది కలిగిన ఉద్యమాన్ని కొనసాగించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పెద్ద ఎత్తున జనసమీకరణతో లాంఛనంగా ప్రారంభించారు. 250 కిలోమీటర్ల వరకూ విస్తరించిన ర్యాలీల్లో 36,900 పౌరులు పాల్గొన్నారు. ఇది ఈ ఉద్యమ శుభారంభ సన్నివేశం ప్రజలు దీనిలో ఉత్సాహంగా భాగం పంచుకున్నారనడానికి శక్తిమంతమైన నిదర్శనంగా నిలిచింది. ఈ ఘట్టం.. ఉద్యమం కొనసాగినంత కాలమూ ప్రజలే చేపట్టిన కార్యకలాపాలకు కేంద్ర బిందువైంది.
ఈ ప్రచార ఉద్యమంలో ఒక ప్రముఖ అంశంగా ఇంటింటికీ వెళ్లి అవగాహనను కలిగించారు. దీనిలో.. చెత్తను మూలం నుంచి వేరు చేయడంపై, ఇంటి వద్దే ఎరువును తయారు చేసే పద్ధతులను ప్రోత్సహించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 27.09 లక్షల ఇళ్లలోని వారికి స్వచ్ఛతా ప్రయోజనాల్ని వివరించారు. కుటుంబం స్థాయిలో బాధ్యతాయుత నడవడికకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్నదే ఈ కార్యక్రమ ధ్యేయం. ఇది ఎస్బీఎమ్-యూ 2.0 లో భాగంగా లక్షించిన వ్యర్థాల నిర్వహణ ధ్యేయాలను నెరవేర్చే దిశలో వేసిన ఒక ముఖ్య అడుగుగా నిలిచింది.
ఈ ప్రచార ఉద్యమంలో పర్యావరణంతో ముడిపడిన ఉద్దేశాలకు అనుగుణంగా ‘అమృత్ మిత్ర-వృక్షాల కోసం మహిళలు’ కార్యక్రమాన్ని అమలుపరిచారు. దీనిలో స్వయంసహాయ బృందాలకు (ఎస్హెచ్జీ) చెందిన 10,704 మంది మహిళా సభ్యుల క్రియాత్మక భాగస్వామ్యంతో 24,708 మొక్కలు నాటారు. పట్టణ సముదాయాల్లో పర్యావరణ సంరక్షణ విషయంలో మహిళలను చురుకైన భాగస్వాములను చేయాలన్న రాష్ట్ర దృష్టికోణాన్నిఈ కార్యక్రమం చాటింది. ఈ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణలోని యూఎల్బీలలో 113 కి.మీ. మేర నిర్వహించిన ర్యాలీల్లో 13,488 మంది పాల్గొన్నారు. ఇది హరిత, సుస్థిర పట్టణాల భవిత విషయంలో రాష్ట్రం చూపుతున్న శ్రద్ధను పునరుద్ఘాటించింది.
పట్టణ ప్రాంతాల స్వచ్ఛతకు ముందువరుసలోని కార్మికులు అందించే అనివార్య తోడ్పాటును గుర్తిస్తూ ఆ సిబ్బంది స్వస్థతకీ, సంక్షేమానికీ ప్రాధాన్యాన్నిచ్చి ప్రత్యేక కాంపొనెంటును ఉద్యమంలో చేర్చారు. రాష్ట్రమంతటా ఆరోగ్య శిబిరాలను నిర్వహించి 25,386 మంది ఫ్రంట్లైన్ స్వచ్ఛతా కార్మికులకు వైద్య పరీక్షలు, సహాయతా సేవల వంటి స్వాస్థ్య సేవల ప్రయోజనాలను అందించారు. ఈ కార్యక్రమం పట్టణ స్వచ్ఛతా సేవల అందజేతలో అగ్రభాగాన నిలుస్తున్నవారికి ఆత్మగౌరవాన్నీ, ఆరోగ్యాన్నీ, శ్రేయస్సునీ సమకూర్చే విషయంలో రాష్ట్రం ఆసక్తిని స్పష్టం చేసింది.
పట్టణ మౌలిక సదుపాయాల నిర్వహణపై శ్రద్ధ తీసుకోవాలనే దృష్టితో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా తెలంగాణ అంతటా 18,351 కి.మీ. పొడవైన వరదనీటి కాలవలనూ, నాలాలనూ శుద్ధిపరిచారు. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ప్రయత్నం పట్టణ ప్రాంతాల్లో వరదను తగ్గించే, మురుగు పారుదల సామర్థ్యాన్ని మెరుగుపరిచే, నీటి నుంచి పుట్టే వ్యాధులతో పాటు ఇతర రోగవాహకాల ముప్పును తగ్గించే దిశగా తీసుకున్న ముఖ్య నిర్ణయం. ఇవన్నీ ఎస్బీఎమ్-యూ 2.0కు నిర్దేశించుకున్న ప్రజారోగ్య, స్వచ్ఛతా లక్ష్యాలకు తగినట్లు ఉన్నాయి. ఈ ప్రచార ఉద్యమంలో ప్రజల ఆరోగ్యం పట్ల క్రియాత్మక దృష్టికోణాన్ని కూడా జోడించారు. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 15,02,819 ఇళ్ల నివాసులకు అవగాహన కల్పించారు. దీంతో పాటే, రాష్ట్రవ్యాప్తంగా 621 తాగునీటి ట్యాంకులను శుభ్రం చేశారు. ఫలితంగా పట్టణ ప్రాంత నివాసులకు సురక్షిత తాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయత్నం ఎస్బీఎమ్-యూ 2.0కు చెందిన విస్తృత ప్రాథమిక ప్రణాళికలో స్వచ్ఛత, ప్రజారోగ్య అంశాల పట్ల రాష్ట్ర ఏకీకృత దృష్టికోణానికి అద్దం పట్టింది.
వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ఎస్హెచ్జీ చురుకైన భాగస్వామ్యంతో జీవనోపాధి, మహిళా సాధికారత కల్పన లక్ష్యాల్ని మరింత ప్రభావవంతంగా మార్చింది. 8,546 ఎస్హెచ్జీలకు రూ.1,045.04 కోట్ల రుణాలను పంపిణీ చేయడంతో మహిళల నాయకత్వంలోని బృందాల ఆర్థిక సామర్థ్యం బలపడింది. ప్రచార ఉద్యమంలో భాగంగా నిర్వహించిన స్ట్రీట్ ఫూడ్ ఫెస్టివల్స్, మేళాలలో ఎస్హెచ్జీ ఉత్పాదనలను కూడా ప్రదర్శించారు. వీటిలో రూ.177.12 లక్షల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. ఇది స్వచ్ఛతా కార్యక్రమాల్ని స్థానిక ఆర్థిక సాధికారిత కల్పనతో జోడించే సామర్థ్యాన్ని కూడా చాటిచెబుతోంది.
ఎస్బీఎమ్-యూ 2.0లో భాగంగా సువ్యవస్థితమూ, ఫలితాలు రాబట్టడమే ప్రధానంగా సాగిన ఐఈసీ సాముదాయిక భాగస్వామ్యాలకు తెలంగాణలో చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఒక పటిష్ఠ ఉదాహరణగా నిలిచింది. ఈ వేగాన్ని రాష్ట్రం కొనసాగిస్తూ స్వచ్ఛత, నీటి సరఫరా, వేడిమి నుంచి ఊరట, పౌరుల భాగస్వామ్యం, పాలనలో సంస్కరణలు సహా పట్టణ సేవల అందజేతను దృఢతరం చేయడం, ప్రవర్తనలో మార్పును ప్రోత్సహించడం కోసం కేంద్రీకృత 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను కూడా.. 2026 మార్చి నెల మొదలు జూన్ మధ్య.. మొదలుపెట్టింది. స్పష్ట లక్ష్యాలతో.. చెత్తకు చోటివ్వని రోడ్లు, సురక్షిత తాగునీరు మొదలు ఫిర్యాదుల పరిష్కారానికో పటిష్ఠ వ్యవస్థ, పెరిగిన పౌర ప్రాతినిధ్యం వరకూ.. దీర్ఘకాలిక ప్రవర్తనాత్మక పరివర్తన దిశగా ఒక మలుపును ఈ కార్యక్రమం సూచిస్తోంది. మూలం వద్దే వేరు చేయడం, ఇళ్ల వద్ద కంపోస్టు అంశాలపై 65 లక్షల కన్నా ఎక్కువ కుటుంబాలకు అవగాహనను పెంచడానికి ఇంటింటికీ వెళ్లడం సహా అవుట్ రీచ్ ప్రయత్నాలను పెద్ద ఎత్తున చేపట్టారు. స్వచ్ఛతా ర్యాలీలు, 194 స్వచ్ఛతా ఉద్యమాలు, స్వచ్ఛతా కార్మికులకు ఆరోగ్య శిబిరాల నిర్వహణతో పాటు ‘సండే ఫన్డే’ కార్యకలాపాలు, 22,482 మందికి పైగా పౌరులు పాల్గొన్న ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాలు, స్వచ్ఛమైన, ఆరోగ్యదాయకమైన, మరింత ఎక్కువ జవాబుదారుతనాన్ని కలిగి ఉండే నగరాలను నిర్మించడానికి తెలంగాణ అనుసరిస్తున్న ‘పౌరులే నాయకత్వం వహించే విధానాన్ని’ మరింత బలోపేతం చేస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 2279060)
आगंतुक पटल : 6