మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి, సరఫరా వ్యవస్థలను నిర్మూలించడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఈ రోజు సూరత్లో 2 కేజీల కొకైన్ను స్వాధీనం చేసుకుంది. ఎన్డీపీఎస్ చట్టం-1985 నిబంధనల ప్రకారం... ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.
గత నెల రోజుల్లో ముంబయి, ఢిల్లీ, జైపూర్, పాట్నా, కొచ్చిన్, అహ్మదాబాద్లోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, కొరియర్ టెర్మినళ్లు, రహదారులపై డీఆర్ఐ వరుస ఆపరేషన్లు నిర్వహించింది. ఈ స్వాధీనంతో పాటు, ఈ నెల రోజుల్లో ఇప్పటివరకు మొత్తం సుమారు 26 కిలోల కొకైన్ను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లలో 14 మంది విదేశీయులు సహా మొత్తం 22 మందిని అరెస్టు చేశారు.
మత్తుమందు నింపిన క్యాప్సూల్స్ లేదా గుళికలను శరీరంలో అంతర్గతంగా దాచిపెట్టడానికి వాటిని మింగడం... గృహోపకరణాలు, తినే పదార్థాల్లో దాచడం... బట్టలతో వాటిని నానబెట్టడం, సామానులో దాచడం మొదలైన వివిధ పద్ధతుల ద్వారా ఈ నిషేధిత సరుకును అక్రమంగా రవాణా చేశారు.
సమన్వయంతో కూడిన కార్యకలాపాల ద్వారా... మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాలో నిమగ్నమైన వ్యవస్థీకృత సిండికేట్లను డీఆర్ఐ నిరంతరం లక్ష్యంగా చేసుకుంది. తద్వారా భారత ప్రభుత్వ 'నషా ముక్త్ భారత్' (మాదక ద్రవ్య రహిత భారత్) దార్శనికతకు తోడ్పాటునందిస్తోంది.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ప్రతి యేటా జూన్ 26న అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తారు. 1987లో ఐక్యరాజ్య సమితి ప్రకటన మేరకు... ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణా నిరోధక చర్యల బలోపేతం కోసం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే వినాశకర ప్రభావాల గురించి అవగాహన పెంపొందించడం కోసం, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం ఈ రోజును అంకితం చేశారు.
***