పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
వారణాసిలో భారతదేశ తొలి ‘ఈజీ కనెక్ట్’ విమాన సర్వీసును ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇతర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల విమానాశ్రయాల నుంచి మరిన్ని 'హబ్-అండ్-స్పోక్' అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించే ప్రణాళికల్లో ఉన్న ప్రభుత్వం
प्रविष्टि तिथि:
26 JUN 2026 4:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా ఒక కీలకమైన ఘట్టం నమోదైంది. 2026 జూన్ 25న వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో 'హబ్-అండ్-స్పోక్' నమూనా కింద దేశంలోనే మొట్టమొదటి ‘ఈజీ కనెక్ట్’ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. భారత్ను ప్రపంచ విమానయాన కేంద్రంగా మార్చడానికి.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేని అంతర్జాతీయ అనుసంధానతను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం.
2030 నాటికి దేశీయ ప్రయాణికులకు, 2047 నాటికి అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రాధాన్యత కలిగిన విమానయాన కేంద్రంగా భారత్ను మార్చటమే లక్ష్యంతో ఈ 'హబ్-అండ్-స్పోక్' నమూనాను తీసుకొచ్చారు. దీని వల్ల చేకూరే ప్రయోజనాలు కేవలం విమానయాన రంగానికే పరిమితం కావు. మెరుగైన అంతర్జాతీయ అనుసంధానత ద్వారా వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడులు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతం కానున్నాయి. మంత్రిత్వ శాఖ చేపట్టిన అధ్యయనాల ప్రకారం విమానయాన అభివృద్ధి ద్వారా 2030 నాటికి సుమారు 0.4 మిలియన్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారత జీడీపీకి అదనంగా 30 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఇక 2047 నాటికి దీని మొత్తం ప్రభావం వల్ల దాదాపు 16 మిలియన్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు మద్దతు లభించటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఊతం లభించనుంది.
ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. "విమాన ప్రయాణాన్ని సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడం.. సమర్థవంతమైన, సమ్మిళిత, ప్రపంచస్థాయి పోటీతత్వం గల భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే స్వయం సమృద్ధ భారతీయ విమానయాన రంగాన్ని తయారుచేయాలనే మా సంకల్పాన్ని సాకారం చేసే దిశగా ఈ రోజు మనం ఒక పెద్ద ముందడుగు వేశాం” అని పేర్కొన్నారు.
“మన నూతన 'హబ్-అండ్-స్పోక్' నమూనా దేశ ప్రజల ప్రయాణ శైలిలో ఒక విప్లవాత్మక మార్పునకు దారితీస్తుంది. భారత్లో ఏ నగరంలో నివసిస్తున్నప్పటికీ ప్రయాణికులు ఇకపై తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించొచ్చు. భారతదేశపు సొంత విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా ఎంతో సులభంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించొచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విమాన సర్వీసుల ప్రారంభం సందర్భంగా 'ఈజీ కనెక్ట్' విమానం కోసం మొదటగా చెక్-ఇన్ చేసిన కొద్దిమంది ప్రయాణికులకు జ్ఞాపికగా బోర్డింగ్ పాస్లను కేంద్ర విమానయాన మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ పునీత్ కన్సల్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్ శ్రీ విపిన్ కుమార్, ఎయిర్ ఇండియా ప్రధాన కార్యనిర్వాహక అధికారి- మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాంప్బెల్ విల్సన్లతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), విమానయాన సంస్థకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
'హబ్-అండ్-స్పోక్' నమూనా కింద అంతర్జాతీయ ప్రయాణికులు తమ చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ లాంఛనాలను 'స్పోక్' (చిన్న లేదా ప్రాంతీయ) విమానాశ్రయంలోనే పూర్తి చేసుకుంటారు. తద్వారా అదే వారి అంతర్జాతీయ ప్రయాణానికి మొదటి నిష్క్రమణ స్థానం అవుతుంది. ఉదాహరణకు వారణాసి నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించే ప్రయాణికులు.. ఢిల్లీ వంటి నిర్ణీత 'హబ్' విమానాశ్రయానికి వెళ్లే విమానం ఎక్కడానికి ముందే వారణాసిలోనే అన్ని నిష్క్రమణ లాంఛనాలను పూర్తి చేసుకుంటారు.
అత్యున్నత స్థాయి భద్రత, కార్యాచరణ సమగ్రతను నిర్ధారించడానికి ఈ నమూనాలో పలు రక్షణ చర్యలు ఉన్నాయి. దేశీయ- అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించిన రెండు దశల ప్రయాణాలను కూడా అంతర్జాతీయ కార్యకలాపాలుగానే పరిగణిస్తారు. దేశీయ (డీ- డొమెస్టిక్), అంతర్జాతీయ (ఐ- ఇంటర్నేషనల్) ప్రయాణికులు ఒకరితో ఒకరు కలవకుండా నిరోధించడానికి తగిన గుర్తింపు చిహ్నాలు కలిగిన ప్రత్యేకమైన బోర్డింగ్ కార్డులను జారీ చేస్తారు. ఈ 'హబ్-అండ్-స్పోక్' విధానం కింద ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులకు హబ్ విమానాశ్రయాల్లో కస్టమ్స్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
వారణాసిలో 'హబ్-అండ్-స్పోక్' అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించటం.. భారత విమానయాన వ్యవస్థలో ఒక ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సమ్మిళిత, సమర్థవంతమైన, ప్రపంచస్థాయి పోటీతత్వం గల వైమానిక అనుసంధానతను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2278326)
आगंतुक पटल : 7