వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-ఒమన్ సీఈపీఏ ఒప్పందం నేపథ్యంలో వారణాసి నుంచి ఒమన్కు బిస్కెట్ల ఎగుమతి
40 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా.. ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంతం నుంచి
ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతులకు ఇది ఒక కొత్త అవకాశం
प्रविष्टि तिथि:
25 JUN 2026 4:49PM by PIB Hyderabad
ఓడ ద్వారా ఎగుమతికి ఉద్దేశించిన 40 మెట్రిక్ టన్నుల బిస్కెట్లను ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ఒమన్కు పంపించడంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫూడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ.. ‘అపెడా’) తోడ్పడింది. భారత్-ఒమన్ విస్తృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కుదిరిన తరువాత, వారణాసి నుంచి ఒమన్కు బిస్కెట్లను సముద్ర మార్గంలో ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి. ఇది ఈ ప్రాంతం నుంచి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పాదనలకు ఎగుమతి అవకాశాలు పెరగనున్నాయని సూచిస్తోంది.
ఓడ రవాణాకు ఉద్దేశించిన సరుకును వారణాసి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న తయారీ, ఎగుమతి సంస్థ శ్రీ తిరుపతి బాలాజీ ఇండస్ట్రీస్ ద్వారా పంపారు. ఈ కార్యక్రమం.. ఆ ప్రాంతంలో ప్రాసెస్ చేసిన ఆహార రంగాన్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడంతో పాటు ఉత్తరప్రదేశ్లో విలువను జోడించిన ఆహార ఉత్పాదనలను అంతర్జాతీయ స్థాయికి చేరవేయడాన్ని ప్రోత్సహించే దిశగా వేసిన ఓ కీలక అడుగు అని చెప్పవచ్చును.
‘ఆహార్-2026’, ‘గల్ఫూడ్-2026’ వంటి ప్రధాన దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య మేళాల్లో భాగం పంచుకోవడం సహా వివిధ ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాలను అపెడా చేపడుతూ ఎగుమతిదారులకు మద్దతును అందిస్తోంది. ఈ ప్రయత్నాలు వారణాసి ప్రాంతంలో తయారు చేసిన వస్తువులకు గిరాకీని పెంచడంలోనూ, వాటిని విదేశీ మార్కెట్ల వరకు చేరవేయడాన్ని సులభతరం చేయడంలోనూ దోహదపడ్డాయి.
సరకు ప్రయాణం వారణాసి నుంచి మొదలవుతుంది. కస్టమ్స్ క్లియరెన్సును పొందడానికి కాన్పూర్లోని ఇన్ల్యాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ)కీ, తరువాత అక్కడి నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్టు (జేఎన్పీటీ)కు చేరుకొంటుంది. చివరకు ఒమన్కు వెళ్తుంది.
భారత్, ఒమన్ మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను సీఈపీఏ ప్రాథమిక ప్రణాళిక బలోపేతం చేయనున్న దృష్ట్యా ఈ ఎగుమతి ప్రక్రియ ప్రాధాన్యం మరింత పెరగనుంది. భారత ఎగుమతిదారులకు, విశేషించి వ్యవసాయ రంగంతో పాటు శుద్ధి చేసిన ఆహార రంగంలోని ఎగుమతిదారులకు మరిన్ని మార్కెట్లను సీఈపీఏ అందుబాటులోకి తీసుకువస్తుందనీ, కొత్త అవకాశాలను అందిస్తుందనీ భావిస్తున్నారు.
రాబోయే కాలంలో ఒమన్ మార్కెట్టుకు ఓడల ద్వారా వరుసగా అదనపు సరుకులను పంపనున్నట్లు అపెడా సూచనప్రాయంగా తెలిపింది. ఇది ఆ ప్రాంతంలో శుద్ధి చేసిన ఆహార పదార్థాలకు డిమాండు, మార్కెట్ అవకాశాలు పెరుగుతున్నట్లు తెలియజేస్తోంది.
భారత్-ఒమన్ సీఈపీఏపై సంతకాలైన తరువాత వారణాసి నుంచి ఒమన్కు ఓడ ద్వారా బిస్కెట్ల రవాణా వారణాసి ప్రాంతంలో ఆహార శుద్ధి రంగానికి సామర్థ్యం పెరుగుతోందని తెలియజేస్తోంది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా వ్యవసాయ ప్రధాన ఎగుమతి కేంద్రాల నుంచి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా అపెడా నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాలకు కూడా అద్దం పడుతోంది.
***
(रिलीज़ आईडी: 2278176)
आगंतुक पटल : 4