గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వీబీ-జీ రామ్ జీ చట్టం-2025 ద్వారా వివిధ పథకాల అనుసంధాన విధానంపై గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి అంతర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల సమావేశం
ప్రభుత్వ సమగ్ర విధానంపై కీలక సమావేశంలో పాల్గొన్న 18 మంత్రిత్వ శాఖలు, విభాగాలు... జూలై 1, 2026 నుంచి అమల్లోకి వీబీ-జీ రామ్ జీ చట్టం
प्रविष्टि तिथि:
24 JUN 2026 6:48PM by PIB Hyderabad
వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్): వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్ - జీ రామ్ జీ) చట్టం-2025 ద్వారా రూపొందించిన వివిధ పథకాల అనుసంధాన విధానంపై ఇవాళ జూన్ 24, 2026న న్యూఢిల్లీలోని కర్తవ్యభవన్లో ఉన్నత స్థాయి అంతర-మంత్రిత్వ శాఖల సంప్రదింపుల సమావేశం జరిగింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన గ్రామీణాభివృద్ధి విభాగ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారత ప్రభుత్వంలోని 18 మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
వీబీ-జీ రామ్ జీ చట్టం జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో చేపడుతున్న సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈ సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. పంచాయతీ రాజ్ సంస్థల నాయకత్వంలో గ్రామ స్థాయిలోనే ప్రణాళికలు తయారు చేయటం, వివిధ ప్రభుత్వ శాఖలను అనుసంధానించటం ద్వారా గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వం ఉమ్మడిగా పనిచేయాలనే ఈ చట్టం ఆశయాన్ని అమలు చేయాలన్న అంశంపై ఈ సమావేశం దృష్టి సారించింది.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ రోహిత్ కన్సల్ మాట్లాడుతూ.. వీబీ-జీ రామ్ జీ చట్టానికి వివిధ పథకాల అనుసంధానం కీలకమని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధిలో ఒకదానితో ఒకటి ముడిపడున్న నీటి భద్రత, జీవనోపాధి, మౌలిక వసతులు, వాతావరణ స్థిరత్వం, స్థానిక ఆర్థికాభివృద్ధి వంటి ప్రాధాన్యతలను పరిష్కరించేందుకు ఇది ఎంతో కీలకమని తెలిపారు. "సింగిల్ ప్లాన్- మల్టీ ఫండింగ్" విధానాన్ని ఈ చట్టం ప్రతిపాదిస్తోందని పేర్కొన్నారు. దీనిద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు నిధులు, విధులను యథాతథంగా కొనసాగిస్తూనే.. ఒకే ఉమ్మడి అభివృద్ధి లక్ష్యం కోసం కలిసి చేసే వీలుంటుంది.
ఈ చట్టం ద్వారా రూపొందించిన వివిధ పథకాల అనుసంధాన విధానాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ సమావేశంలో వివరించింది. ఈ కార్యాచరణ విధానంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ) అత్యంత కీలకమైనది. ఇది పంచాయతీ స్థాయిలో గ్రామీణాభివృద్ధికి ప్రాథమిక ప్రణాళికా సాధనంగా పనిచేస్తుంది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో తయారై, గ్రామసభ ఆమోదం పొందే ఈ వీజీపీపీ.. స్థానిక అవసరాలను వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న వనరులు, నైపుణ్యాలు, పెట్టుబడులతో అనుసంధానించేందుకు ప్రయత్నిస్తుంది.
ఈ కార్యాచరణ విధానం ప్రకారం ప్రణాళికలు కింద నుంచి పైస్థాయికి ఉంటాయి. ఇందులో గ్రామసభలు గుర్తించిన అభివృద్ధి ప్రాధాన్యతలను పంచాయతీ రాజ్ సంస్థలు ఒకచోట చేర్చి, వాటిని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల పథకాలతో అనుసంధానిస్తాయి. స్థానికంగా గుర్తించిన అవసరాలకే ప్రభుత్వ నిధులు వెచ్చించేలా చూడటమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. దీనివల్ల గ్రామాల్లో శాశ్వతమైన, స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది.
ఈ సమావేశంలో చట్టం ద్వారా నిర్దేశించిన ఇతివృత్తాల ప్రాధాన్యతలను, అనుమతించదగిన పనుల నిబంధనలను సమీక్షించారు. గ్రామీణాభివృద్ధి పనులను నాలుగు ముఖ్యమైన రంగాలుగా ఈ చట్టం విభజించింది. అవి.. నీటి భద్రత, కీలక గ్రామీణ మౌలిక వసతులు, గ్రామీణ జీవనోపాధి, వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించే ప్రత్యేక పనులు. ఈ నూతన చట్టాన్ని జూలై 1, 2026 నుంచి అమలు చేసేందుకు తాత్కాలికంగా 318 రకాల పనుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో సహజ వనరుల నిర్వహణ, సాగునీరు, గ్రామాలకు రవాణా అనుసంధానం, సామాజిక మౌలిక వసతులు, జీవనోపాధికి ఆస్తుల కల్పన, వాతావరణ స్థిరత్వం, విపత్తులను ఎదుర్కోవటం వంటి ముఖ్యమైన పనులున్నాయి. ఈ జాబితాలోని విస్తృతమైన పనుల వలన వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాలను అనుసంధానం చేసేందుకు మంచి అవకాశం దొరుకుతుందని సమావేశంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
సాంకేతిక, ఆర్థిక పరమైన అనుసంధానాన్ని బలోపేతం చేయటం, అనుసంధానానికి అనువైన పథకాలను గుర్తించటం డిజిటల్ పరస్పర అనుసంధానతను పెంపొందించటం, సమన్వయంతో కూడిన అమలు, పర్యవేక్షణల కోసం సంస్థాగత వ్యవస్థలను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. సమావేశంలో పాల్గొన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులు ఈ ముసాయిదా కార్యాచరణ విధానంపై అభిప్రాయాలను, సూచనలను పంచుకున్నారు.
ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ (గ్రామీణ ఉపాధి) శ్రీమతి రోహిణి భాజీభాకరే, డిప్యూటీ సెక్రటరీ (గ్రామీణ ఉపాధి) శ్రీ ఆశిష్ గుప్తా, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీబీ-జీ రామ్ జీ చట్టం అమలుతో పాటుగా వివిధ పథకాల అనుసంధాన విధానాన్ని కూడా జూలై 1, 2026 నుంచి ఆచరణలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇది గ్రామస్థాయిలోనే ప్రణాళికలను బలోపేతం చేస్తుందని, ప్రభుత్వ పెట్టుబడులను సద్వినియోగం చేస్తుందని.. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు కలిసి పనిచేయటం వల్ల గ్రామాల సమగ్రాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2277671)
आगंतुक पटल : 9