జాతీయ మానవ హక్కుల కమిషన్
తమిళనాడులోని తిరువళ్లూరు రొయ్యల ప్రాసెసింగ్ కార్మాగారంలో అమ్మోనియా లీకేజీ... ఇద్దరు మహిళల మృతి, పలువురు అస్వస్థత ఘటనను సమోటోగా స్వీకరించిన భారత జాతీయ మానవ హక్కుల సంఘం
ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి నోటీసులు జారీ
బాధిత కార్మికుల ఆరోగ్య పరిస్థితితో పాటు, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహార నిధుల పంపిణీ వివరాలు కూడా నివేదికలో ఉండాలని ఆదేశం
प्रविष्टि तिथि:
22 JUN 2026 5:23PM by PIB Hyderabad
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఉన్న ఒక ప్రైవేటు రొయ్యల ప్రాసెసింగ్ కర్మాగారంలో 2026 జూన్ 21న అమ్మోనియా గ్యాస్ లీకవ్వడం వల్ల ఇద్దరు మహిళలు మరణించగా, మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై వచ్చిన మీడియా కథనాలను భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కర్మాగారంలో కార్మికులు పక్కనే ఉన్న ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
వార్తా కథనంలోని అంశాలు నిజమైతే, అవి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)లకు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహార మొత్తాన్ని మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిన వివరాలతో పాటు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఆ నివేదికలో పొందుపరచాలని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.
2026 జూన్ 22 నాటి మీడియా కథనాల ప్రకారం... ప్రమాదం జరిగిన వెంటనే 59 మంది కార్మికులను చెన్నై, తిరువళ్లూరులలోని వివిధ ఆసుపత్రులలో చేర్చారు. ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
***
(रिलीज़ आईडी: 2277069)
आगंतुक पटल : 13