దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ప్రధాన కార్మిక కమిషనర్ (కేంద్ర) కార్యాలయం ఒక ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం 2026 జూన్ 01 నుంచి 2026 ఆగస్టు 31 వరకు న్యూఢిల్లీలో కొనసాగనుంది.
ఈ ప్రత్యేక కార్యక్రమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు సంబంధించిన 178 క్లెయిమ్ కేసులను ప్రత్యేక విచారణ, పరిష్కారం కోసం గుర్తించారు. వేతలనాల కోడ్ 2019 కింద అధికారిగా కూడా వ్యవహరిస్తున్న న్యూఢిల్లీ ప్రాంతీయ కార్మిక కమిషన్ (కేంద్ర).. 24.06.2026న ఉభయ పక్షాలు విచారణకు హాజరుకావాలని 15.06.2026 నాడు నోటీసులు జారీ చేశారు.
పెండింగ్ కేసులను తగ్గించడం, వేగంగా న్యాయం అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ చర్యలో భాగంగా.. ఈ 178 కేసులన్నింటినీ ఒకే రోజున విచారణ కోసం జాబితా చేశారు. 2026 జూన్ 24వ తేదీ రోజంతా కేవలం డీఎంఆర్సీకి సంబంధించిన వ్యవహారాల కోసమే ప్రత్యేకంగా కేటాయించారు. కార్మికుల క్లెయిమ్లను సకాలంలో పరిష్కరించేందుకు కార్మిక యంత్రాంగానికి ఉన్న నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది.
ఈ ప్రత్యేక కార్యక్రమం వల్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం గణనీయంగా వేగవంతం అవుతుందని, కార్మికులకు సకాలంలో ఉపశమనం లభిస్తుందని, కార్మిక న్యాయ వితరణ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా కేసుల బ్యాక్లాగ్ను పరిష్కరించడానికి వినూత్నమైన, ఫలితాల ఆధారిత చర్యలను అవలంబించాలనే సీఎల్సీ (సీ) సంస్థ దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది.
ఒకే విధమైన కేసులను వర్గీకరించడం, క్లస్టర్ ఆధారిత విచారణలు చేపట్టడం అనే సరికొత్త విధానానికి ఈ ప్రక్రియ నాంది పలికింది. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉన్న కేసులను సమర్థవంతంగా, నిర్మాణాత్మకంగా, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడానికి కార్మిక అధికారులకు వీలవుతుంది. ఈ చొరవ దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి ఒక నమూనాగా నిలుస్తుందని, కార్మిక చట్టాల అమలులో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని ఆశిస్తున్నారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడం ప్రాధాన్యతను... అలాగే కార్మికులు, యజమానులు, ఇతర వాటాదారులపై ఈ కార్యక్రమం చూపే ప్రభావాన్ని గుర్తిస్తూ... రాబోయే ప్రత్యేక డ్రైవ్ విజయవంతం కావడానికి తమపూర్తి సహకారం అందిస్తామని డీఎంఆర్సీ అడిషనల్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్టులు) హామీ ఇచ్చారు.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ తక్షణమే స్పందిస్తూ, సులభంగా అందుబాటులో ఉండే కార్మిక పరిపాలన ద్వారా ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారానికి, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడానికి, కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.