రక్షణ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026: షిల్లాంగ్లోని వైమానిక దళ తూర్పు కమాండ్లో 1,000 మంది సైనికులతో కలసి యోగా సాధన చేసిన రక్షణ మంత్రి
ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, బలమైన దేశం కోసం దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపు
प्रविष्टि तिथि:
21 JUN 2026 12:01PM by PIB Hyderabad
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)ను పురస్కరించుకుని 2026 జూన్ 21న మేఘాలయలోని షిల్లాంగ్లో ఉన్న వైమానిక దళ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళం, భారత సైన్యానికి చెందిన సుమారు 1,000 మంది సైనికులతో కలిసి రక్షణ మంత్రి వివిధ ఆసనాలు, శ్వాస వ్యాయామాలు చేశారు. రక్షణ మంత్రితో పాటు మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్రాడ్ కె సంగ్మా, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, వైమానిక దళ తూర్పు కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ అధికారి ఎయిర్ మార్షల్ ఇందర్పాల్ సింగ్ వాలియా, హెడ్క్వార్టర్స్ 101 ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ మోహిత్ వాధ్వా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. యోగాను సమగ్రమైన శాస్త్రంగా వర్ణించారు. వ్యక్తులను వారి అంతరాత్మతో, సమాజంతో, ప్రకృతితో, అంతిమంగా దైవత్వంతో అనుసంధానించే ఒక జీవన విధానమని అన్నారు. మానసిక స్థిరత్వానికీ, స్పష్టతకూ, భావోద్వేగ దృఢత్వానికీ మార్గాన్ని చూపిస్తుందని ఆయన తెలియజేశారు.
ప్రపంచ స్థాయి ఉద్యమంగా యోగా మారడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషి, ఆయనకున్న దార్శనికతే కారణమని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. యోగా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారని తెలిపారు. భారతదేశ ప్రాచీన సంప్రదాయాల శక్తికి యోగా ప్రతీక అనీ, ఇది మానవాళికి శ్రేయస్సును అందిస్తుందనీ స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన శరీరాన్నీ, ప్రశాంతమైన మనస్సునూ, బలమైన దేశాన్నీ సాధించేందుకు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా మార్చుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రక రెడ్ రోడ్ నుంచి ప్రధానమంత్రి ఐడీవై ప్రసంగాన్ని వీక్షించారు. రక్షణ దళాల సిబ్బందికున్న అంకితభావాన్నీ, ఉత్సాహాన్నీ ప్రతిబింబిస్తూ, పలు సరిహద్దు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాంచీ విశ్వవిద్యాలయంలోని స్వర్ణ జయంతి దీక్షాంత్ మండపంలో జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ పాల్గొన్నారు. సానుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండటాన్ని యోగా నేర్పుతుందనీ, అందుకే దీనిని దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందనీ ఆయన స్పష్టం చేశారు. అంతర్గతంగా సానుకూలతను పెంపొందించుకోవడానికి అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా యోగాను ఆయన వర్ణించారు.

న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద సమీకృత రక్షణ సిబ్బంది ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవాలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నాయకత్వం వహించారు. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్న ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్తో పాటు ఇతర సీనియర్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూఢిల్లీలోని సీజీడీఏ కార్యాయలంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, కార్యదర్శి (రక్షణ ఆర్థిక విభాగం) శ్రీ విశ్వజిత్ సహాయ్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సీజీడీఏ) శ్రీ అనుగ్రహ నారాయణ దాస్తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ అకౌంట్ల విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఆరోగ్యవంతమైన ఆయుష్షు కోసం యోగా’’ అనే ఇతివృత్తంతో ఈ ఐడీవై-2026 నిర్వహిస్తున్నారు. యోగాను, సమగ్ర ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా డిఫెన్స్ అకౌంట్స్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10,000 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2276416)
आगंतुक पटल : 10