రక్షణ మంత్రిత్వ శాఖ
కోల్కతాలో మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించనున్న భారత నావికాదళం
प्रविष्टि तिथि:
19 JUN 2026 4:57PM by PIB Hyderabad
భారత నావికాదళం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు అత్యాధునిక నౌకలైన ‘దూనగిరి, సంశోధక్, అగ్రే’లను 2026 జూన్ 21న కోల్కతాలో అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టనుంది.
ఈ చారిత్రాత్మక రక్షణ రంగ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరుకానున్నారు. (https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2275033®=3&lang=1)
భారత నావికాదళానికి చెందిన 'వార్షిప్ డిజైన్ బ్యూరో' రూపొందించిన ఈ నౌకలను కోల్కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్, ఇంజనీర్స్' (జీఆర్ఎస్ఈ) నిర్మించింది. ఇవి సముద్ర యుద్ధక్షేత్రం, సముద్ర జలాల సర్వే, జలాంతర్గామి నిరోధక విభాగాల్లో కీలకమైన కార్యాచరణ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఇవన్నీ కలిసి సామర్థ్య పెంపు, సముద్ర జలాల్లో కార్యకలాపాలను బలోపేతం చేయటం, సముద్రయానం విషయంలో అవగాహనను పెంచటం, ఎదురవుతున్న ముప్పుల నుంచి తీరప్రాంత జలాలను రక్షించడానికి నౌకాదళం అవలంబిస్తోన్న సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ప్రాజెక్ట్ 17ఏ శ్రేణిలో ఐదో 'శత్రువుల రాడార్లకు చిక్కని యుద్ధనౌక (స్టెల్త్ ఫ్రిగేట్)’ అయిన 'దూనగిరి'.. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లను కలిగి ఉంది. ఇందులో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యస్థ శ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఇవి నౌకాదళం పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.
నాలుగో ‘పెద్ద సర్వే నౌక’ అయిన ‘సంశోధక్’ను తీరప్రాంత, లోతైన సముద్ర జలాల హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం రూపొందించారు. రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర శాస్త్ర, భూభౌతిక డేటాను సేకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది స్వయంప్రతిపత్తి గల జలాంతర వాహనాలు, రిమోట్ పద్ధతిలో నడిపే వాహనాలు (ఆర్ఓవీ) వంటి అత్యాధునిక సర్వే వ్యవస్థలను కలిగి ఉంది.
అర్నాలా శ్రేణికి చెందిన తక్కువ లోతు జలాల్లో జలాంతర్గామి నిరోధక నౌకలలో నాలుగోదైన 'అగ్రే'.. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, తక్కువ లోతు జలాల సోనార్ వ్యవస్థలను కలిగి ఉంది. ఇది తీరప్రాంత జలాల్లో నీటి అడుగున ఉండే ముప్పులను గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
భారత స్వదేశీ నౌకా నిర్మాణ రంగం పరిణతి చెందిన తీరును ఈ మూడు యుద్ధనౌకలు తెలియజేస్తున్నాయి. ఈ నౌకల నిర్మాణంలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను ఉపయోగించారు. వీటి నిర్మాణ ప్రక్రియలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో సహా దేశీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయి. ఇది దేశంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించింది.
ఈ యుద్ధనౌకలను నావికాదళంలోకి చేర్చడం.. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో, భారత సముద్ర రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం, నావికాదళం, ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల ఉమ్మడి కృషీ, సహకారానికీ ఒక అద్భుతమైన నిదర్శనంగా ఉంది.
***
(रिलीज़ आईडी: 2276069)
आगंतुक पटल : 9