బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య ప్రాజెక్టుకు ఒడిశాలో భూమిపూజ చేయనున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 JUN 2026 12:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూన్ 20న ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో రూ. 25,016 కోట్ల వ్యయంతో నిర్మించే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే, దిగుమతులకు ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించే, పారిశ్రామిక స్వావలంబనను వేగవంతం చేసే దిశగా వేసిన ముందడుగును ఈ కార్యక్రమం సూచిస్తుంది.
ఇంధన భద్రతను బలోపేతం చేయడం, కీలకమైన ముడిపదార్థాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ బొగ్గు వనరులకు విలువ జోడింపును పెంపొందించడం, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో ముఖ్యమైన అంశంగా బొగ్గు గ్యాసిఫికేషన్ మారుతోంది. ఈ ప్రక్రియ బొగ్గును సింథసిస్ గ్యాసుగా (సిన్గ్యాస్) మారుస్తుంది. దీనిని మిథనాల్, యూరియా, అమ్మోనియం నైట్రేట్, సింథటిక్ సహజవాయువు, ఇతర రసాయన ముడిపదార్థాలు లాంటి వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దీనికి పారిశ్రామిక వృద్ధిని నడిపించే, ముడిపదార్థాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే, దేశ ఇంధన, ఆర్థిక భద్రతను బలోపేతం చేసే సామర్థ్యం ఉంది.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా, వినియోగదారుగా భారత్ ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా కోల్ ఇండియా లిమిటెడ్ ఉంది. బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న అయిదో అతి పెద్ద దేశంగా భారత్ ఉంది. సుమారు 400 బిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు దేశానికి ఉన్నాయి. బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియ ద్వారా ఈ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కీలకమైన ముడి పదార్థాలు, రసాయనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, దేశ పారిశ్రామిక స్వరూపాన్ని గణనీయంగా మార్చవచ్చు.
బొగ్గు గ్యాసిఫికేషన్కి ఉన్న పరివర్తనాత్మక శక్తిని గుర్తించిన భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రూ.46,000 కోట్ల వ్యయంతో ప్రోత్సాహక పథకాలను ఆమోదించింది. దేశవ్యాప్తంగా బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయడం, వ్యూహాత్మక పారిశ్రామిక, రసాయనిక అవసరాల కోసం దేశీయంగా లభ్యమయ్యే బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడం, సహజవాయువు, మెథనాల్, అమ్మోనియా, ఇతర కీలకమైన ముడి పదార్థాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
ఏటా సుమారు రూ. 2.7 లక్షల కోట్ల విలువైన తుది వినియోగ, మధ్యంతర రసాయన ఉత్పత్తులను భారతదేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులను తగ్గించడానికీ, గణనీయమైన మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికీ, దేశీయ ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికీ, అదే సమయంలో పారిశ్రామిక వృద్ధికీ, ఆర్థిక స్వావలంబనకూ మద్దతు ఇవ్వడానికి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియ ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది.
బొగ్గు గ్యాసిఫికేషన్ను ప్రోత్సహించే కార్యక్రమం.. బొగ్గు గనులున్న ప్రాంతాల్లోని 25 ప్రాజెక్టుల్లో రూ.2.5 నుంచి 3 లక్షల కోట్ల వరకూ పెట్టుబడులను ప్రోత్సహిస్తుందనీ, 50,000 వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అంచనా.
భారతదేశంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య కేంద్రంగా లఖన్పూర్ ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుంది. ఈ కేంద్రాన్ని భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (బీసీజీసీఎల్) అభివృద్ధి చేస్తోంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థే బీసీజీసీఎల్. బీహెచ్ఈఎల్ దేశీయంగా అభివృద్ధి చేసిన బొగ్గు గ్యాసిఫికేషన్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రోజుకి 2,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్ను ఈ కేంద్రం ఉత్పత్తి చేస్తుంది.
బీసీజీసీఎల్కూ, సీఐఎల్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) మధ్య ఏప్రిల్లో భూమి లీజుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఎంసీఎల్ ఆధీనంలో ఉన్న సుమారు 350 ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. దీనికి అవసరమైన అనుమతులు లభించాయి. శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ తరహా ప్రాజెక్టుల కోసం బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో భూమిని ఉపయోగించుకోవడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వెసులుబాటు కల్పించింది. ప్రోత్సాహక పథకం ద్వారా రూ. 1,350 కోట్ల మద్దతును అందిస్తోంది.
భవిష్యత్తులో చేపట్టే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు నమూనాగా నిలవడంతో పాటు.. స్వయం సమృద్ధమైన తయారీ, పారిశ్రామిక శక్తికేంద్రంగా మారాలనే భారతదేశ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు అనుగుణంగా స్వచ్ఛ బొగ్గు సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించడం, దేశీయ వనరుల నుంచి గరిష్ఠ విలువను సాధించడం, పటిష్టమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వానికున్న అంకితభావాన్ని లఖన్పూర్ ప్రాజెక్టు స్పష్టం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2275380)
आगंतुक पटल : 11