బొగ్గు మంత్రిత్వ శాఖ
ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై మూడో రోడ్షోను ముంబయిలో నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
18 JUN 2026 8:48PM by PIB Hyderabad
ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై మూడో రోడ్షోను బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు ముంబయిలో విజయవంతంగా నిర్వహించింది. బొగ్గు గ్యాసిఫికేషన్ను వేగవంతం చేయడానికి, శుద్ధ ఇంధనం దిశగా దేశ పరివర్తనలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఇది పునరుద్ఘాటించింది. ప్రముఖ పారిశ్రామిక భాగస్వాములు, ప్రభుత్వ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, పెట్టుబడిదారులు, బొగ్గు కంపెనీలు, ఈ రంగానికి చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలో పుష్కలంగా ఉన్న బొగ్గు వనరుల విలువను పెంచే ఒక విప్లవాత్మక మార్గంగా బొగ్గు గ్యాసిఫికేషన్పై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక అతిథిగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ రోడ్షోలో పాల్గొన్నారు. బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవదత్, అదనపు కార్యదర్శులు శ్రీ సనోజ్ కుమార్ ఝా, శ్రీమతి రూపేందర్ బ్రార్లతోపాటు… ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, పెట్టుబడిదారులు, బొగ్గు, ఇంధన రంగాలకు చెందిన ఇతర కీలక భాగస్వాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర బొగ్గు - గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బొగ్గు గ్యాసిఫికేషన్ పురోగతిలో మహారాష్ట్ర అగ్రగామిగా నిలిచిందని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూమి, విద్యుత్, సహాయక మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రాష్ట్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని ఆయన తెలిపారు. ఇప్పటికే అయిదు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉండడం, అలాగే ఏటా దాదాపు 7 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) బలంగా ఉండడం... ఇలా బొగ్గు గ్యాసిఫికేషన్లో ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులు, పారిశ్రామిక వ్యవస్థలు మహారాష్ట్రకు ఉన్నాయన్నారు. బొగ్గు గ్యాసిఫికేషన్ పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించేలా.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమలు సన్నిహిత భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్న సహకార సమాఖ్యవాదానికి మహారాష్ట్ర ఆదర్శమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో.. ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఆత్మనిర్భర భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
400 బిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలతో ప్రపంచంలో అయిదో అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగిన దేశంగా ఉన్న భారత్కు... తనకున్న ఈ అపారమైన వనరులను దేశ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చగల విలువైన ఉత్పత్తులుగా మలచుకునే అవకాశం ఉందని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి, వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమనీ, కోల్ ఇండియా లిమిటెడ్ ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీ అనీ, ఛత్తీస్గఢ్లోని గేవ్రా గని ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు గనుల్లో ఒకటిగా ఉందనీ ఆయన వివరించారు. దేశ విద్యుత్ అవసరాలలో 70 శాతానికి పైగా, మొత్తం ఇంధన వినియోగంలో దాదాపు 55 శాతం వాటాను బొగ్గు సమకూరుస్తోందని ఆయన తెలిపారు. దేశీయ బొగ్గు వనరులను మరింత సుస్థిరంగా, సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా.. 2070 నాటికి కర్బనోద్గార రహిత లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
బొగ్గు గ్యాసిఫికేషన్ను దేశ భవితకు ఒక వ్యూహాత్మక మూలాధారంగా అభివర్ణిస్తూ.. దీర్ఘకాలిక ఇంధన భద్రతను సాధించడంలోనూ, దిగుమతుల ప్రత్యామ్నాయంగానూ, పారిశ్రామిక స్వావలంబనకూ, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాధించడంలోనూ ఇది కీలకమని మంత్రి వివరించారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా సింగాస్, మిథనాల్, అమ్మోనియా, అమ్మోనియం నైట్రేట్, హైడ్రోజన్, ఇథనాల్, యూరియా, సుస్థిర వైమానిక ఇంధనం, డీఆర్ఐ-గ్రేడ్ రిడ్యూసింగ్ గ్యాస్, పలు ఇతర విలువ ఆధారిత రసాయనాల ఉత్పత్తికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం భారీ పరిమాణంలో దిగుమతి అవుతున్న ఈ ఉత్పత్తులను.. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా దేశీయంగానే ఎక్కువగా తయారు చేయవచ్చన్నారు. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా ఆదా అవ్వడంతోపాటు… దిగుమతులపై ఆధారపడడం తగ్గి ఎరువులు, ఉక్కు, రసాయనాలు, రవాణా, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పారిశ్రామికంగా అన్ని దశల్లోనూ సరికొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన తెలిపారు.
జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ను ప్రస్తావిస్తూ… 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ అనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహక పథకం భారీ పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా నిలుస్తుందని, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణను వేగవంతం చేస్తుందని, బొగ్గు గ్యాసిఫికేషన్లో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపాదనల కోసం అభ్యర్థన (ఆర్ఎఫ్పీ) ముసాయిదాను భాగస్వామ్య పక్షాల సంప్రదింపుల కోసం అందుబాటులో ఉంచామనీ, అమలు యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి నిర్మాణాత్మక సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. చివరిగా దేశ బొగ్గు గ్యాసిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయి విజయగాథగా తీర్చిదిద్దే దిశగా... సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నీ ఈ కార్యక్రమ బాధ్యతను స్వీకరించి సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు.
ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్పై రోడ్షో ముంబయిలో నిర్వహించడం ఎంతో సముచితమైందని తన విశ్లేషణాత్మక ప్రసంగంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. బొగ్గు గ్యాసిఫికేషన్తో ఈ నగరానికి 1862 నాటికే అనుబంధం ఉందని తెలిపారు. అప్పట్లో బొగ్గు గ్యాసిఫికేషన్లో ముంబయి మార్గదర్శకంగా నిలిచిందనీ, నేడు ఈ విప్లవాత్మక సాంకేతికతను అభివృద్ధి చేయడంలోనూ నగరం మరోసారి కేంద్రంగా నిలుస్తూ.. చరిత్ర పునరావృత్తమవుతోందనీ ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర కృషితో భారత్ ఆధునిక సాంకేతికతతో కూడిన బొగ్గు గ్యాసిఫికేషన్ కొత్త శకంలోకి అడుగుపెడుతోందని ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ సాధనకు, ఆత్మనిర్భర్ భారత్ ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. దేశ వృద్ధికి, స్థిరత్వానికి ఇంధన భద్రత అనేది అత్యంత ప్రాథమికమైనదని చెప్పారు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై అతిగా ఆధారపడటం వల్ల అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిణామాలు, సరఫరా వ్యవస్థ అంతరాయాల ప్రభావం మన దేశంపై పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితి దేశ ఇంధన, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవడంలో స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. భారత్ పునరుత్పాదక, స్వచ్ఛమైన ఇంధనాన్ని వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడంలో సాంప్రదాయ ఇంధన వనరులు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. స్థిరమైన అభివృద్ధి వైపు భారత్ సాగిస్తున్న ప్రయాణంలో బొగ్గు గ్యాసిఫికేషన్ అనేది ఒక మైలురాయి లాంటిదని అభివర్ణించారు. ఈ సాంకేతికత దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, స్వదేశీ బొగ్గు వనరులను మరింత స్వచ్ఛమైన, సమర్థవంతమైన మార్గంలో ఉపయోగించుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు. స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, జాతీయ ఇంధన భద్రతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని వివరించారు. బొగ్గు గ్యాసిఫికేషన్ వల్ల రసాయనాలు, ఎరువులు, మెథనాల్, హైడ్రోజన్, ఇతర పారిశ్రామిక ముడిపదార్థాలతో కూడిన విలువ ఆధారిత ఉత్పత్తుల పరిధి దేశంలో గణనీయంగా విస్తరిస్తుందని ఆయన తెలిపారు. దీనివల్ల దేశ తయారీ రంగ పర్యావరణ వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపు లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ విప్లవాత్మక ప్రయాణంలో భాగస్వామ్యం వహించాల్సిందిగా పెట్టుబడిదారులను, పరిశ్రమల అధినేతలను శ్రీ ఫడ్నవీస్ ఆహ్వానించారు. పెట్టుబడిదారుల విజయమనేది అంతర్గతంగా దేశ విజయంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూలమైన పెట్టుబడి వ్యవస్థను కల్పించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
సభను ఉద్దేశించి కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ.. దేశంలోని అపారమైన బొగ్గు నిల్వల నుంచి మరింత ఎక్కువ విలువను వెలికితీయడానికి బొగ్గు వాయువీకరణ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని చెప్పారు. అలాగే ఇది బొగ్గును మరింత స్వచ్ఛమైన, సమర్థవంతమైన పద్ధతిలో ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. వాణిజ్యపరంగా లాభదాయకమైన బొగ్గు వాయువీకరణ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి… సహాయక విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలు, పరిశ్రమలతో సన్నిహితంగా వ్యవహరించడం ద్వారా ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు మద్దతు ఇచ్చే పటిష్టంగా బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యవస్థను నిర్మించడంలో భాగస్వాములందరూ చురుగ్గా పాల్గొని తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ.. మంత్రివర్గం ఆమోదించిన ఈ పథకాన్ని దేశ బొగ్గు రంగాన్ని మార్చడమే కాకుండా దీర్ఘకాలిక ఇంధన భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ప్రభుత్వ అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక కార్యక్రమాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ పథకంపై అవగాహన పెంచడానికి, దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా.. పరిశ్రమల భాగస్వాములతో మంత్రిత్వ శాఖ నిరంతరం జరుపుతున్న చర్చలలో భాగంగానే ఈ ముంబై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఈ శ్రేణిలో మూడో రోడ్షో అని తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం బొగ్గు గ్యాసిఫికేషన్కు మాత్రమే పరిమితం కాలేదని, దీని పరిధి చాలా పెద్దదని అన్నారు. ఇది కొత్త పారిశ్రామిక సామర్థ్యాలను సృష్టించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, అనుబంధ ఉత్పత్తుల అధిక విలువ తయారీని ప్రోత్సహించడం, పెట్టుబడులు, ఉపాధిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు దేశంలో సమృద్ధిగా ఉన్న బొగ్గు వనరుల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఇది ప్రయత్నిస్తుందని చెప్పారు. జనవరి 2024లో ఆమోదించిన రూ. 8,500 కోట్ల రాయితీ పథకానికి లభించిన ప్రోత్సాహకరమైన స్పందనను గుర్తు చేశారు. ఈ పథకం కింద 6,233 కోట్ల రాయితీ మద్దతుతో ఇప్పటికే రూ. 65,000 కోట్లకు పైగా పెట్టుబడులతో కూడిన ఎనిమిది ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు. ఇవి బొగ్గు నుంచి ఎస్ఎన్జీ, ఇథనాల్, హైడ్రోజన్, ఎసిటిక్ యాసిడ్, అమ్మోనియం నైట్రేట్, డీఆర్ఐ ఆధారిత స్టీల్, సుస్థిర విమాన ఇంధనం వంటి విభిన్న రంగాలలో విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ బొగ్గు వాయువీకరణ మిషన్ విజయం కేవలం ప్రభుత్వ మద్దతుపైనే కాకుండా.. పరిశ్రమల దార్శనికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అమలు చేసే సామర్థ్యాలపై సమానంగా ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ కొత్త పథకాన్ని కేవలం ఆర్థిక రాయితీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా, ఉమ్మడి జాతీయ నిబద్ధతగా అభివర్ణించారు. ఈ పథకం సాంకేతికతతో సంబంధం లేనిదని చెబుతూ... దీనివల్ల డెవలపర్లు తమ ముడిసరుకు, ఉత్పత్తి అవసరాలకు బాగా సరిపోయే సాంకేతికతలను ఎంచుకునే పారదర్శకత లభిస్తుంది. దేశంలో హై-యాష్ బొగ్గుకు అనుగుణంగా ఉండే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిని ఇది ప్రోత్సహిస్తుందని చెప్పారు. భాగస్వాములందరూ ఇందులో చురుగ్గా పాల్గొనాలని ఆహ్వానిస్తూ.. ఈ పథకం విధానాలు, ప్రతిపాదనల కోసం అభ్యర్థన ముసాయిదాను ప్రజల అభిప్రాయాల కోసం ఉంచామని, ఎక్కువ మంది పాల్గొనేలా సంప్రదింపుల గడువును కూడా పొడిగించామని శ్రీ దత్ తెలిపారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వీలుగా మరింత బలమైన, పారదర్శకమైన, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను కలిసి రూపొందించేందుకు పరిశ్రమలు తమ నిర్మాణాత్మక అభిప్రాయాలను అందించాలని కోరారు.
ఈ రోడ్షోలో పథకం నిబంధనలు, అర్హత ప్రమాణాలు, బిడ్డింగ్ ప్రక్రియ, ప్రతిపాదనల కోసం అభ్యర్థన ముసాయిదా పై సుదీర్ఘమైన, వివరణాత్మకమైన ప్రెజెంటేషన్లు ఇచ్చారు. ఎయిర్ ప్రొడక్ట్స్, గ్రెటా ఎనర్జీ,ఎన్టీపీసీ సంస్థలు ఇచ్చిన ప్రెజెంటేషన్లు.. బొగ్గు వాయువీకరణ రంగంలో వస్తున్న సరికొత్త సాంకేతిక పురోగతిని, ప్రాజెక్ట్ అభివృద్ధి వ్యూహాలను, భవిష్యత్తులో రాబోయే అద్భుత అవకాశాలను ప్రముఖంగా వివరించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం తాము అందిస్తున్న విధాన ప్రోత్సాహకాలను ఈ వేదికపై ప్రదర్శించింది. అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు అవసరమైన లోన్లు, ఆర్థిక సహాయ యంత్రాంగాలపై కీలకమైన విశ్లేషణలను అందించింది. ఈ ప్రెజెంటేషన్లన్నీ కలిసి.. దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి అవసరమైన విధానపరమైన, సాంకేతిక, ఆర్థిక వ్యవస్థపై భాగస్వాములందరికీ ఒక సమగ్రమైన అవగాహనను కల్పించాయి.
ఈ రోడ్షోలో భాగంగా ముఖాముఖి ప్రశ్నలు, సమాధానాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రి, బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు.. ప్రాజెక్టు అమలు, సాంకేతికతను స్వీకరించడం, ఆర్థిక సహాయం, నియంత్రణ నిబంధనలు, బిడ్డింగ్ ప్రక్రియతో సహా పథకానికి సంబంధించిన వివిధ అంశాలపై భాగస్వాములు అడిగిన ప్రశ్నలకు సవివరమైన వివరణలు ఇచ్చారు. ఈ చర్చలు పరిశ్రమ వర్గాల్లో ఉన్న బలమైన నమ్మకాన్ని ప్రతిబింబించాయి. దేశంలో సమృద్ధిగా ఉన్న బొగ్గు వనరులను మరింత స్వచ్ఛమైన, సమర్థవంతమైన పద్ధతిలో ఉపయోగిస్తూనే.. పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడపడంలో బొగ్గు గ్యాసిఫికేషన్కు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ఇవి తెలియజేశాయి.
దేశ భవిష్యత్తు ఇంధన, పారిశ్రామిక రంగాల్లో బొగ్గు వాయువీకరణను ప్రధాన విషయంగా ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ పూర్తిగా కట్టుబడి ఉంది. ముంబైలో విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమం.. నిరంతర విధానపరమైన మద్దతు, సాంకేతిక పురోగతి, పరిశ్రమలతో సన్నిహిత భాగస్వామ్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల ఒక బలమైన బొగ్గు వాయువీకరణ వ్యవస్థను నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు ఇది తన వంతు సహకారాన్ని అందిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2274989)
आगंतुक पटल : 17