పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఆగ్రోబయోడైవర్సిటీ నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించిన జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ: ఛైర్మన్గా నియమితులైన పద్మశ్రీ డాక్టర్ పీఎల్ గౌతమ్
నాడు పోస్టు చేయడమైనది:
13 JUN 2026 10:03AM by PIB Hyderabad
జీవవైవిధ్య చట్టం-2002లోని సెక్షన్ 13(1) ప్రకారం ఆగ్రోబయోడైవర్సిటీ నిపుణుల కమిటీని జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్బీఏ) ఏడాది కాలానికి పునర్వ్యవస్థీకరించింది. వ్యవసాయ జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం, సౌలభ్యం-ప్రయోజనాల పంపిణీ (ఏబీఎస్) సంబంధిత అంశాలపై ఈ కమిటీ మార్గదర్శకత్వం అందిస్తుంది.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థకూ, వృక్షజాతుల పరిరక్షణ, రైతు హక్కుల సంస్థ (పీపీవీఎఫ్ఆర్ఏ)కూ ఛైర్పర్సన్గా పనిచేసిన పద్మశ్రీ డాక్టర్ పీఎల్ గౌతమ్ పునర్వ్యవస్థీకరించిన కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. వ్యవసాయ శాస్త్రంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇటీవలే డాక్టర్ గౌతమ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. పీపీవీఎఫ్ఆర్ఏ ఛైర్పర్సన్ ఈ కమిటీకి సహ ఛైర్మన్గా ఉంటారు.
2005 నుంచి ఎన్బీఏకు వ్యవసాయ జీవవైవిధ్య నిపుణుల కమిటీ ముఖ్యమైన సలహా సంఘంగా ఉంది. వ్యవసాయ జన్యు వనరులకు సంబంధించి కొత్తగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీని కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరిస్తున్నారు. అనేక ఏళ్లుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యవసాయ, పరిశోధన, విద్యా, విధాన సంస్థలకు చెందిన విశిష్ట ప్రతినిధులు దీనిలో భాగంగా ఉన్నారు.
వ్యవసాయ జీవవైవిధ్యానికి సంబంధించిన అనేక అంశాలపై నిపుణుల సిఫార్సులను అందించడం ద్వారా జీవవైవిధ్య చట్టం అమలులో ఈ కమిటీ కీలక పాత్ర పోషించింది. దీనిలో ఆహారం, వ్యవసాయానికి సంబంధించి మొక్కల జన్యు వనరులపై అంతర్జాతీయ ఒప్పందం (ఐటీపీజీఆర్ఎఫ్ఏ)కు సంబంధించిన అంశాలు, వివిధ రకాల పంటల విత్తనాలు, పాడి పశువుల పిండాల ఎగుమతులకు సంబంధించి ఎదురవుతున్న సౌలభ్యం-ప్రయోజనాల పంపిణీ సమస్యలు, సంప్రదాయ మొక్కల ప్రజననానికి సంబంధించిన స్పష్టతలు, జీవవైవిధ్య చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం జీవ వనరులకు సంబంధించిన భాగస్వామ్య పరిశోధన ప్రాజెక్టులకు సంబంధిత మంత్రిత్వ శాఖ జారీ చేసిన అనుమతుల నమూనా లాంటి అంశాలున్నాయి.
వ్యవసాయ పరిశోధన, ఆవిష్కరణ, జీవ వనరుల సుస్థిర వినియోగంతో జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యాలను సమతౌల్యం చేయడంలో కమిటీ సిఫార్సులు గణనీయమైన సహకారాన్ని అందించాయి.
వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, మొక్కలు, పశువులు, చేపల జన్యు వనరులకు సంబంధించిన జాతీయ బ్యూరోలు, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ ఆవిష్కరణ ఫౌండేషన్, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, ఇతర కీలక పరిశోధన, విద్యా సంస్థలకు చెందిన విశిష్ట నిపుణులు, సీనియర్ ప్రతినిధులు ఈ పునర్వ్యవస్థీకరించిన కమిటీలో ఉన్నారు.
వ్యవసాయ రంగంలో జీవవైవిధ్య పరిశీలనలను ఏకీకృతం చేయడంలోనూ, సుస్థిర వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించడంలోనూ ఎన్బీఏకు ఈ కమిటీ సూచనలిస్తుంది. జీవవైవిధ్య చట్టం ప్రకారం విత్తన రంగానికి సంబంధించిన సమస్యలను పరిశీలిస్తుంది. జీవ వనరులకు సంబంధించిన అంతర్జాతీయ భాగస్వామ్య పరిశోధనల మార్గదర్శకాలను సమీక్షిస్తుంది. అంతరించిపోతున్న దేశీయ పంటల రకాలు, జంతువుల పరిరక్షణ, సుస్థిర వినియోగానికి సంబంధించిన చర్యలను సిఫార్సు చేస్తుంది. ఐటీపీజీఆర్ఎఫ్ఏతో సహా వ్యవసాయ జీవవైవిధ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్ పోషించే పాత్రకు మద్దతు ఇచ్చేలా సాంకేతికపరమైన, విధానపరమైన సలహాలను కూడా కమిటీ అందిస్తుంది.
వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలోనూ, జన్యు వనరులు, వాటికి సంబంధించిన సంప్రదాయ విజ్ఞానాన్ని సంరక్షించడంలోనూ, సుస్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగలిగిన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలోనూ భారత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఆగ్రో బయోడైవర్సిటీ నిపుణుల కమిటీ పునర్వ్యవస్థీకరణ ప్రతిబింబిస్తుంది.
వ్యవసాయ జన్యు వనరులను, దేశీయ వంగడాలను, జంతు రకాలను పరిరక్షించడం, సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా నవీకరించిన ఎన్బీఎస్ఏపీలోని 4, 13 లక్ష్యాలను సాధించడంలోనూ, ఎస్డీజీ 2( ఆకలి రహితం), ఎస్డీజీ 13 (వాతావరణ చర్య), ఎస్డీజీ 15 (భూమిపై జీవం) సాకారం చేయడంలోనూ కమిటీ భారత్కు సహకరిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2272778)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4