బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై హైదరాబాద్లో రేపు రోడ్ షో నిర్వహించనున్న బొగ్గు మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
10 JUN 2026 10:37AM by PIB Hyderabad
న్యూఢిల్లీలో నిర్వహించిన బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల రోడ్ షో విజయవంతం కావటం వల్ల అందిన ప్రోత్సాహంతో జూన్ 11, 2026న హైదరాబాద్లో మరో రోడ్ షోను నిర్వహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. గత కార్యక్రమానికి వచ్చిన అద్బుతమైన స్పందన, క్రీయాశీల భాగస్వామ్యం... భారతదేశ బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యవస్థపై పరిశ్రమల భాగస్వాముల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని స్పష్టం చేయటమే కాక, వ్యూహాత్మక రంగంలో పుట్టుకొస్తున్న గణనీయమైన అవకాశాలను తెలియజేశాయి.
హైదరాబాద్ రోడ్ షోకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, బొగ్గు, లిగ్నైట్ కంపెనీల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక సంఘాలు, పెట్టుబడిదారులు, ఇతర కీలక భాగస్వాములు పాల్గొననున్నారు.
బొగ్గు గ్యాసిఫికేషన్ విప్లవాత్మక సాంకేతికత. ఇది బొగ్గుని సింథసిస్ గ్యాస్ (సిన్ గ్యాస్)గా మారుస్తుంది. దీన్ని మిథనాల్, అమ్మోనియం నైట్రేట్, సింథటిక్ సహజ వాయువు, పలు రకాల పారిశ్రామిక రసాయనాల వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. దీని వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం.. ఇంధన భద్రతను పెంపొందించేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయ బొగ్గు వనరుల వినియోగాన్ని వైవిధ్యభరితంగా మార్చేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ను ప్రోత్సహించటానికి పలు విధానపరమైన చర్యలను, ప్రోత్సాహకాలని చేపట్టింది.
విధానపరమైన మద్దతు, సాంకేతిక ఆవిష్కరణలు, పెట్టుబడి అవకాశాలు, ప్రాజెక్టు అమలు వ్యూహాలపై చర్చలకు ఈ రోడ్ షో కీలక వేదిక అవుతుంది. దేశవ్యాప్తంగా బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఉమ్మడి భాగస్వామ్య మార్గాలను అన్వేషించటానికి విధాన రూపకర్తలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, పెట్టుబడిదారులను ఈ కార్యక్రమం ఒకచోట చేరుస్తుంది.
వాటాదారుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను సులభతరం చేసేందుకు, భారతదేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్కు పటిష్ఠమైన వ్యవస్థను సృష్టించేందుకు ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు, మెరుగైన ఇంధన భద్రత, స్థిరమైన వనరుల వినియోగం, పారిశ్రామిక వృద్ధి ద్వారా ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
****
(रिलीज़ आईडी: 2271021)
आगंतुक पटल : 19