మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మత్స్య సంపద విలువ వ్యవస్థల బలోపేతం... ప్రపంచ సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్లో భారత పోటీని పెంపొందించడంపై విశాఖపట్నంలో జాతీయ సదస్సు
ఉత్పత్తుల మూలాల గుర్తింపు, స్థిరత్వ ధృవీకరణలు, విలువ జోడింపు, ఎగుమతుల విస్తరణతో పాటు అత్యంత విలువైన లోతట్టు సముద్ర వనరుల వినియోగంపై సాంకేతిక సమావేశాల్లో చర్చలు
प्रविष्टि तिथि:
07 JUN 2026 4:21PM by PIB Hyderabad
సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై 2026 జూన్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జాతీయ సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో కలసి మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం ఈ సదస్సును నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ మొదటి రోజు సదస్సులో పాల్గొన్నారు.
ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడిఏ), ఎగుమతుల తనిఖీ మండలి (ఈఐసీ), భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ) నాబార్డ్, ఎన్సీడీసీ, ఎన్సీఈఎల్, ఎస్ఎఫ్ఏసీ, ఇన్వెస్ట్ ఇండియా వంటి ప్రముఖ జాతీయ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యమయ్యాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల రంగానికి పూర్తిస్థాయి ప్రాతినిధ్యం కల్పించేలా వాటి ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఇతర అనుబంధ రంగాలకు చెందినవారు కూడా సదస్సుకు హాజరయ్యారు.
భారత్ ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి దేశంగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత, అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం, భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, మూలాలను గుర్తించే పటిష్టమైన వ్యవస్థలను ప్రోత్సహించడం వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు.
ఉత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మత్స్య సంపద (ఇన్ల్యాండ్ ఫిషరీస్) ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని, తినేందుకు సిద్ధంగా ఉండే (రెడీ-టు-ఈట్) ఉత్పత్తులు, అధిక విలువ కలిగిన చేపల జాతులు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇంకా వినియోగంలోకి రాని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. సుస్థిరత, నాణ్యత హామీ, నియంత్రణ నిబంధనల పాటింపుతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, విలువ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మంత్రులు ప్రస్తావించారు. సముద్ర ఆహార ఎగుమతుల రంగాన్ని మరింత పటిష్ఠంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రభుత్వ విధానం అవలంబించడం, బహుళ రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా ప్రస్తుత సంస్కరణలు, ప్రాధాన్యతా పథకాల ద్వారా ఉత్పత్తిని పెంచడం, మూలాల గుర్తింపు, ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, సముద్ర లోతు, ఈఈజెడ్ వనరులలోని అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడం వంటి అంశాలపై ప్రసంగించారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అజయ్ భదూ భారత ఎగుమతుల నిర్వహణ, మారుతున్న ప్రపంచ మార్కెట్ పోకడలు, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలో ఎఫ్టీఏల పాత్ర, మార్కెట్ వైవిధ్యీకరణ, మెరుగైన పోటీతత్వం గురించి వివరించారు. ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ డి. ప్రవీణ్, ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే మనకున్న లోపాలను గుర్తిస్తూ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాల్సిన అవసరాన్ని ప్రముఖంగా చెప్పారు. ఎగుమతి విలువను పెంచేందుకు కోల్డ్ చైన్ అభివృద్ధి, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, గొలుసుకట్టు వ్యవస్థల అనుసంధానానికి మద్దతు ఇచ్చే కీలక పథకాలను ఆయన ప్రస్తావించారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ స్వతంత్ర కుమార్ సింగ్ రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జల్ జల మత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీమైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. పరిశ్రమలప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ)తో పాటు సీఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏఐ), ఇండియన్ ఫిష్మీల్ అండ్ ఫిష్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్ఏఎఫ్ఈఏ), ఇండియన్ మెరైన్ ఇంగ్రెడియెంట్స్ అసోసియేషన్ (ఐఎంఐఎ) మొదలైన పరిశ్రమల సంఘాలు మార్కెట్ అవకాశాలు, పోటీతత్వం, సుస్థిరత, సముద్ర ఆహార సీఫుడ్ ఎగుమతులను ప్రభావితం చేసే కీలక సవాళ్లపై భాగస్వాముల అభిప్రాయాలను పంచుకున్నాయి.
ఈ చర్చల్లో సముద్ర ఆహార ఎగుమతి విలువ వ్యవస్థల సరఫరా వ్యవస్థలో... వ్యాధుల నిర్వహణ, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, నాణ్యమైన విత్తనాలు (చేప/రొయ్య పిల్లలు), క్వారంటైన్ వసతులు సరిగ్గా లభించకపోవడం, రవాణా, కోల్డ్ చైన్, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలలో లోపాలు వంటి కీలక సవాళ్లను వాటాదారులు ప్రముఖంగా ప్రస్తావించారు. కఠినమైన ధ్రువీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపు)తో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండటంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు, కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేశారు.
2026 జూన్ 6వ తేదీన జరిగిన రెండో రోజు సదస్సులో రెండు ప్రత్యేక సాంకేతిక సమావేశాలు నిర్వహించారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిని అధిగమించాలనే జాతీయ లక్ష్యానికి మద్దతుగా, భారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన వ్యూహాత్మక చర్యలపై ఇందులో ప్రధానంగా దృష్టి పెట్టారు. మత్స్య రంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించడానికి విధానకర్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమల ప్రముఖులు, పరిశోధకులు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ఇతర వాటాదారులు ఈ సమావేశాల్లో ఒకచోటికి చేరారు.
విలువ జోడింపు, ధ్రువీకరణ, విలువ మూలాల గుర్తింపు ద్వారా సముద్ర ఆహార ఎగుమతులకు ప్రోత్సాహం అనే అంశంపై నిర్వహించిన తొలి సాంకేతిక సమావేశానికి ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీ వీ స్వామి అధ్యక్షత వహించారు. ఎంపెడా ఛైర్మన్ పీ జవహర్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సహాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సమావేశంలో భారత సముద్ర ఆహార ఎగుమతుల పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూ మూడు ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయి. అవి: (i) ఎగుమతి మార్కెట్ల కోసం చేపల వేట ధ్రువీకరణకు తోడ్పడే గుర్తింపు వ్యవస్థలు. (ii) ఆక్వాకల్చర్, చేపల వేట రంగాల్లో సుస్థిర ధ్రువీకరణ. (iii) సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ)విధాన రూపకల్పన అవకాశాల పరిశీలన.
మారుతున్న అంతర్జాతీయ మార్కెట్ నిబంధనలను, ముఖ్యంగా ప్రధాన ఎగుమతి దేశాల వేటాడిన మత్స్య సంపద ధ్రువీకరణ ప్రమాణాలను అందుకోవడానికి ఆక్వాకల్చర్, సముద్ర మత్స్య రంగాలు రెండింటిలోనూ మూలాల గుర్తింపు వ్యవస్థల ప్రాధాన్యత పెరుగుతోందని ఈ చర్చలు స్పష్టం చేశాయి. పారదర్శకత, నిబంధనల అమలు, మార్కెట్ పరిధిని మెరుగుపరచడానికి పటిష్టమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థలు, వాటాదారుల మధ్య మెరుగైన సమన్వయం, విలువ వ్యవస్థ అంతటా మరింత అనుసంధానం అవసరమని చర్చల్లో స్పష్టం చేశారు. మార్కెట్ పరిధిని విస్తరించడానికి, వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి అవసరమైన సుస్థిర ధృవీకరణ విధానాలు, బాధ్యతాయుతమైన ఉత్పత్తి పద్ధతులను కూడా ఈ సదస్సులో పరిశీలించారు. భారతీయ ధృవీకరణ వ్యవస్థలను ప్రోత్సహించడం, సుస్థిరత చర్యలను బలోపేతం చేయడం, భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడంపై ప్రతినిధులు చర్చించారు. సముద్ర ఆహార రంగం కోసం ప్రతిపాదిత పీఎల్ఐ విధానంపై జరిగిన చర్చలు ప్రధానంగా విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టాయి. నిర్దేశిత విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రపంచ సముద్ర ఆహార విలువ వ్యవస్థలలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంపై కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు.
“సముద్ర ఆహార ఎగుమతుల పురోగతిలో మత్స్య, ఆక్వాకల్చర్ స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ ల పాత్ర” అనే అంశంపై జరిగిన రెండవ సాంకేతిక సమావేశానికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మత్స్య విభాగం సంయుక్త కార్యదర్శి (లోతట్టు జల మత్స్య సంపద) శ్రీ సాగర్ మెహ్రా, ఐసీఏఆర్ డీడీజీ (మత్స్య విభాగం) డాక్టర్ జె. కె. జెనా, ఎన్ఎఫ్డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బి. కె. బెహరా, కేంద్ర మత్స్య విభాగం సంయుక్త కార్యదర్శి (మెరైన్) డాక్టర్ సురభి రాయ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ వైవిధ్యీకరణ ద్వారా సముద్ర ఆహార ఎగుమతులను పెంచడంలో స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈల పాత్రను విశ్లేషించారు. ఈ చర్చలను మూడు ప్రధాన ఉప అంశాలుగా విభజించారు: (i) విలువ జోడింపు, ఎగుమతుల ప్రోత్సాహం, (ii) అత్యంత విలువైన లోతైన సముద్ర వనరుల వినియోగం, (iii) ఎగుమతి అవకాశాల విస్తరణ.
మత్స్య రంగంలో ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతుల విస్తరణను పెంపొందించడానికి స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు అనుకూలమైన పటిష్టమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని ఈ చర్చలు ప్రముఖంగా పేర్కొన్నాయి. చర్చలు ప్రధానంగా ప్రాసెసింగ్, పంట అనంతర మౌలిక సదుపాయాల బలోపేతం, అధిక విలువ కలిగిన, ప్రత్యేక సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రోత్సాహం, ట్యూనా వంటి లోతట్టు సముద్ర మత్స్య వనరుల్లోని వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలాగే సముద్ర శైవలాల (సీవీడ్) సాగు, అలంకార మత్స్య పెంపకం, ముత్యాల రకాల జల చరాల పెంపకం, శీతల జల మత్స్య పెంపకం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై కేంద్రీకృతమయ్యాయి. భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, సముద్ర ఆహార ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడే విధానపరమైన చర్యలు, సాంకేతికతను అలవర్చుకోవడం, నైపుణ్యాభివృద్ధి, ధృవీకరణలు, బ్రాండింగ్, మెరుగైన మార్కెట్ అనుసంధానాల అవసరాన్ని ప్రతినిధులు ప్రముఖంగా చెప్పారు.
భారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయాలనే కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామికవేత్తల ఉమ్మడి సంకల్పంతో సదస్సు ముగిసింది. సుస్థిర ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, మూలాల గుర్తింపు, ధృవీకరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణలు మార్కెట్ వైవిధ్యీకరణ వంటి అన్ని అంశాలను కలుపుకుంటూ ఒక సమన్వయ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యిత చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు.
సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో, ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్య రంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. సముద్ర ఆహార ఎగుమతుల్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిస్తున్నారు. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లలో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2270192)
आगंतुक पटल : 22