ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ), పారిశ్రామిక - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మధ్య అవగాహన ఒప్పందం
భారత పెట్టుబడి రంగంలో సమాచారాన్ని వివిధ భాషల్లో అందుబాటులోకి తేవడం లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 6:50PM by PIB Hyderabad
‘భాషిణి సేవ/సంచలన్ - భాషిణి సహయోగి కార్యక్రమం’ కింద.. ఎలక్ట్రానిక్స్ - సమాచార సాంకేతిక శాఖ కింది డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) పరిధిలోని డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ), వాణిజ్య - పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పారిశ్రామిక - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భాషిణి వేదిక ద్వారా భారత పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య వ్యవస్థలో బహుభాషా డిజిటల్ సామర్థ్యాలను, జాతీయ భాషాపరమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.

వివిధ భాషల్లో సమాచారాన్ని అందుబాటులోకి తేవడం, వివిధ భాషల్లో నిర్వహణ, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు కింద గుర్తించిన 22 భాషల్లోనూ డీసీఐఐటీ డిజిటల్ వేదికల్లో సేవలను అందించడం ఈ భాగస్వామ్య ముఖ్య లక్ష్యం. దీనివల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థలు, ప్రజలు తమ భాషల్లోనే సమాచారాన్ని, ప్రభుత్వ సేవలను సులభంగా పొందే అవకాశం లభిస్తుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా.. డీపీఐఐటీ వేదికల్లో వివిధ భాషా సేవలను అందించడం కోసం డీపీఐఐటీ, భాషిణి బృందం కలిసి పనిచేస్తాయి. అనువాద ఏపీఐలు, రంగాల వారీగా భాషా నమూనాల అభివృద్ధి, బహుభాషా పదకోశాలను సృష్టించడం, శబ్దపరమైన సాంకేతికతలు, భాషాపరమైన డేటాతోపాటు.. భాషిణి ఉద్యత్, మిత్ర, యాప్మిత్ర, ప్రవక్త వంటి ప్రత్యేక సాంకేతికతలు, కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తారు.
ప్రభుత్వ సమాచార లభ్యత, అంకుర సంస్థలు - పారిశ్రామిక సేవలు, విధానపరమైన సమాచారం, ప్రజా భాగస్వామ్యాల్లో భాషాపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా.. మరింత సమ్మిళితమైన పెట్టుబడి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.
దేశంలోని వైవిధ్య భరితమైన భాషా వాతావరణానికి అనుగుణంగా శబ్దపరమైన బహుభాషా సేవలను అందించే చేసే దిశగా.. పెట్టుబడులకు ప్రోత్సాహం, పారిశ్రామిక అభివృద్ధి, ఆవిష్కరణలు, వ్యవస్థాపక సంబంధ రంగాలకు సరిపోయే బహుభాషా ఏఐ నమూనాలను, భాషా సాంకేతికతలను బలోపేతం చేయడంపై కూడా ఈ భాగస్వామ్యం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.
భారతీయ అంకుర సంస్థలు, తయారీ రంగం, ఆవిష్కరణ వ్యవస్థల్లో అవకాశాల లభ్యతను విస్తరించడంలో బహుభాషా సాంకేతికతల ప్రాధాన్యం పెరుగుతోందని ఈ చర్చలు స్పష్టం చేశాయి. ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యానికి భాష అవరోధం కాకూడదన్న భరోసానిచ్చే దిశగా చర్చలు సాగాయి.
డీపీఐఐటీ అనుబంధ సంస్థలు, భాగస్వామ్య పక్షాల పరిధిలో భాషాపరమైన సమాచార సేకరణ, అవగాహన కార్యక్రమాలు, సామర్థ్యాభివృద్ధి చర్యలతోపాటు.. బహుభాషా ఏఐ సాధనాల విస్తృత వినియోగాన్ని ఈ అవగాహన ఒప్పందం ప్రోత్సహిస్తుంది.
ఈ సహకారంలో భాగంగా.. బహుభాషా డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పెట్టుబడి వ్యవస్థలో సేవల లభ్యతను విస్తరించడం వంటి లక్ష్యాలతో కూడిన నిర్దిష్ట కార్యక్రమాలను డీపీఐఐటీ, డీఐబీడీ సంయుక్తంగా చేపట్టి, సహకారాన్ని అందించవచ్చు.
సమ్మిళిత, అందుబాటులో ఉన్న, ఏఐ ఆధారిత డిజిటల్ పాలన దిశగా.. దేశ జనాభా విస్తృతికి తగిన భాషా మౌలిక సదుపాయంగా భాషిణి పాత్రను ఈ భాగస్వామ్యం స్పష్టం చేస్తోంది. అదే సమయంలో ఆర్థిక వికాసంలో విస్తృత భాగస్వామ్యం, వ్యవస్థాపకత, పెట్టుబడులకు ప్రోత్సాహంలో దేశ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ) గురించి:
డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ).. ఎలక్ట్రానిక్స్ - సమాచార సాంకేతిక శాఖ కింది డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) పరిధిలోకి వస్తుంది. ఏఐ ఆధారిత బహుభాషా డిజిటల్ సమ్మిళితత్వం, భాషా సాంకేతికతల్లో భారత్ చేపట్టిన జాతీయ స్థాయి కార్యక్రమమిది. జాతీయ భాషా సాంకేతికతా కేంద్రం (ఎన్హెచ్ఎల్టీ) ద్వారా.. పాలన, ప్రభుత్వ వేదికలు, సంస్థల కోసం అన్ని భారతీయ భాషల్లో విస్తృతమైన వాచక, సందేశ ఆధారిత ఏఐ సేవలకు భాషిణి అవకాశం కల్పిస్తుంది. ఈ వేదిక ప్రస్తుతం 800కు పైగా ప్రభుత్వ వెబ్సైట్లకు సేవలందిస్తూ, రోజూ 15 మిలియన్లకు పైగా సందేహాలను పరిష్కరిస్తోంది. అలాగే 36 భారతీయ లిఖిత భాషలు, 23 భారతీయ మౌఖిక భాషలు, 35 అంతర్జాతీయ భాషల్లో సహకారాన్ని అందిస్తుంది. ఓపెన్ సోర్స్ ఆవిష్కరణలు, బహుభాషా ఏఐ పరిశోధనలు, సమాచార కోశాల అభివృద్ధి, అంకుర సంస్థలకు ప్రోత్సాహం, విద్యాసంస్థలతో భాగస్వామ్యాలను కూడా డీఐబీడీ ముందుకు తీసుకెళ్తోంది. తద్వారా దేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2268061)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27