రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 12,260 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, నిర్వహణను సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 7:30PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో, మీడియా, సోషల్ మీడియా ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని 8,512 కిలోమీటర్ల, పశ్చిమ బెంగాల్లోని 3,748 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టుల నాణ్యత, నిర్వహణ ప్రగతిని సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రాతో పాటు మోర్త్, ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ఐడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పనుల అమలును వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఈ సమీక్ష సందర్భంగా శ్రీ గడ్కరీ ప్రముఖంగా పేర్కొన్నారు. రహదారుల మన్నికను పెంచడానికి, ప్రయాణ నాణ్యతను మెరుగుపరచడానికి, అంతరాయం లేని అనుసంధానానికి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని, ఆధునిక నిర్మాణ పద్ధతులను అవలంబించాలని ఆయన సూచించారు. కనెక్టివిటీని, ఆర్థిక వృద్ధిని, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేలా స్థిరమైన, సమర్థవంతమైన జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
వర్షాకాలంలో తలెత్తే అంతరాయాలను కనిష్ట స్థాయికి తగ్గించడానికి, ప్రయాణికుల భద్రతకు అధికారులు సమగ్రమైన ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా సమర్థవంతమైన డ్రైనేజీ నిర్వహణ, రోడ్డు పక్కన వాలు ప్రదేశాల రక్షణ పనులు, తక్షణ స్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
జాతీయ రహదారుల నాణ్యత, నిర్వహణకు సంబంధించిన కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో ఆర్ఈ వాల్స్, భద్రతా తనిఖీలు, రోడ్డు పై దారుల సంకేతాలు, మొక్కల పెంపకం, ల్యాండ్స్కేపింగ్, ప్రీకాస్ట్ నిర్మాణాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల లోపాలను సరిదిద్దడం, ఎక్స్పాన్షన్ జాయింట్లు, లాజికల్ ప్రాజెక్ట్ టెర్మినీ, నిర్మాణ సామగ్రి ప్రమాణాల పాటింపు వంటి అంశాలు ఉన్నాయి.
సరిదిద్దే చర్యలను సకాలంలో అమలు చేయాలని, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని శ్రీ గడ్కరీ సంబంధిత భాగస్వాములందరినీ ఆదేశించారు.
***
(రిలీజ్ ఐడి: 2267905)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25