ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొడిన్ ఆధారిత దగ్గు మందుతో కూడిన 7,500 సీసాలను పాట్నాలో స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ... ఇద్దరి అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 9:04PM by PIB Hyderabad

కొడీన్ ఆధారిత దగ్గు మందు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారని నిర్దిష్ట రహస్య సమాచారం అందడంతో, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో భాగంగా రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు పాట్నాలోని రాజేంద్ర నగర్ టర్మినల్ రైల్వే స్టేషన్ ప్రాంగణం వెలుపల ఒక టాటా ఇంట్రా పికప్ ట్రక్కును ఈ నెల 26న ఆపివేశారు. ఆ ట్రక్కులో కొడీన్ ఫాస్ఫేట్‌తో పాటు ట్రపొలిడీన్ హైడ్రోక్లోరైడ్ సిరప్ (ESkuf)తో కూడిన 7,500 సీసాలను జప్తు చేశారు.
ఆ స్థలంలో ఇద్దరిని పట్టుకోగా వారు కొడీన్ ఆధారిత సిరప్‌నకు సంబంధించిన చలాన్‌నీ, కన్‌సైన్‌మెంటు నోటునీ చూపించారు. డీఆర్ఐ అధికారులు వెంటనే తదుపరి చర్యలను చేపట్టి, సరకును తెప్పించుకుంటున్న సంస్థ డ్రగ్ లైసెన్సును రద్దు చేశారు. పేర్కొన్న చిరునామాలో ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. చట్టపరమైన లాంఛనాల్ని పూర్తి చేసిన తరువాత, దగ్గు మందుతో పాటు పికప్ ట్రక్కును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరిని ఎన్‌డీపీఎస్ చట్టం-1985లో పేర్కొన్న సంబంధిత నిబంధనలకు అనుగుణంగా అరెస్టు చేశారు.
మాదకద్రవ్యాలనూ, సైకోట్రాపిక్ పదార్థాలనూ సరిహద్దులకు అవతలివైపునకూ, దేశం లోపలకూ చట్టవిరుద్ధంగా తరలించడాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ మేరకు చర్యను తీసుకున్నారు. సరఫరా వ్యవస్థ, ఆర్థిక సంబంధాలు, సంస్థలతో పాటు వ్యక్తుల ప్రమేయం.. వీటిపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2266536) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi