కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
భారత్-జపాన్ సెమినార్తో శ్రామిక శక్తి సహకారంలో నూతనోత్తేజం
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 12:28PM by PIB Hyderabad
భారత్-జపాన్ దేశాల మధ్య శ్రామిక శక్తి సహకారంపై మే 25న టోక్యోలో సంయుక్త సెమినార్ జరిగింది. జపాన్లోని భారత రాయబార కార్యాలయం, ఆసియాన్ వన్ కో లిమిటెడ్ సంయుక్తంగా ఈ సెమినార్ను నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి వందన గుర్నాని ముఖ్య అతిథిగా హాజరై, కీలక ప్రసంగం ఇచ్చారు.
భారత్, జపాన్ దేశాల మధ్య నైపుణ్యం గల కార్మిక శక్తి మార్పిడి, మానవ వనరుల అభివృద్ధిలో దీర్ఘకాలిక సహకారంపై చర్చించేందుకు జపాన్ విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రముఖులు, విద్యా సంస్థలు, శ్రామిక శక్తి రవాణా భాగస్వాములు ఈ సెమినార్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి భారత్, జపాన్ దేశాల ప్రముఖ ప్రతినిధులు హాజరయ్యారు. జపాన్ ప్రతినిధుల సభ సభ్యులైన న్యాయశాఖ మాజీమంత్రి మిస్టర్ యమషిత, ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి మిస్టర్ ఇనో, విద్య, సంస్కృతి, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ శాఖల మంత్రి మిస్టర్ నకమురా, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చైర్మన్ మిస్టర్ తదాషి మేదా, జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మిస్టర్ కెంగో ఒట్సుకా, జపాన్లోని భారత రాయబారి శ్రీమతి నగ్మా మహ్మద్ మల్లిక్ ఈ సెమినార్లో పాల్గొన్నారు.
భారత కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రసంగిస్తూ.. విశ్వసనీయ అంతర్జాతీయ కార్మిక భాగస్వామిగా భారత్ ఎదుగుతున్న తీరును ప్రముఖంగా ప్రస్తావించారు. పారదర్శక, నైతిక, విస్తరించదగిన అంతర్జాతీయ శ్రామిక శక్తి బదిలీ మార్గాలను ఏర్పరించేందుకు భారత ప్రభుత్వ నిబద్ధతను ఆమె స్పష్టం చేశారు. భారతదేశ జనాభా బలం, బలమైన నైపుణ్య వ్యవస్థ, సంస్థాగత సంస్కరణలు.. జపాన్తో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు నైపుణ్యం గల మానవ వనరులను అందించే విశ్వసనీయ దేశంగా భారత్ను నిలబెడుతున్నాయని స్పష్టం చేశారు.
ఉన్నత విద్యా సంస్థలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, అప్రెంటిస్షిప్ విధానాలు, డిజిటల్ నైపుణ్య వేదికలు, ఉపాధి సేవల మద్దతుతో భారత్లో భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న వర్క్ఫోర్స్ ప్రిపరేషన్ ఎకోసిస్టమ్ గురించి ఆమె వివరించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ-మైగ్రేట్ వేదిక, నేషనల్ కెరీర్ సర్వీస్ వేదిక, మోడల్ కెరీర్ సెంటర్లు, నైపుణ్యాభివృద్ధి-కార్మిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు, విద్యా సంస్థలతో విస్తృతమైన నైపుణ్య వ్యవస్థతో సహా భారతదేశ అంతర్జాతీయ కార్మిక వలసల వ్యవస్థ గురించి ఆమె ప్రస్తావించారు.
భారత్, జపాన్ దేశాల మధ్య జపనీస్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించటం, నిర్దిష్ట రంగానికి సంబంధించిన నైపుణ్యాల శిక్షణ, పరీక్షల మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల మ్యాపింగ్, వృత్తిపరమైన యోగ్యత, క్రమబద్ధమైన డిమాండ్ సమీకరణ, నైతిక నియామక పద్ధతులు, సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని కార్యదర్శి స్పష్టం చేశారు.
జపాన్ ప్రధానమంత్రి, గౌరవ అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ, గౌహతి ఐఐటీ డైరెక్టర్ల నుంచి ప్రత్యేక సందేశాలు అందాయి. ఈ సందేశాల్లో భారత్-జపాన్ మధ్య మధ్యకాలిక, దీర్ఘకాలిక మానవ వనరుల మార్పిడికి సంబంధించి స్పష్టమైన భవిష్యత్ ప్రణాళికను వివరించారు. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు గల శ్రామికులను తయారు చేయటంలో భారతదేశంలోని రాష్ట్రాలు, ఉన్నత విద్యా సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు.
భారత్లోని నైపుణ్యం గల శ్రామిక వ్యవస్థతో క్రమబద్ధమైన భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్న ప్రముఖ జపనీస్ కంపెనీల సీనియర్ అధికారులు, మానవ వనరుల విభాగ మేనేజర్లతో సహా దాదాపు 250 మంది ప్రతినిధులు ఈ సెమినార్లో పాల్గొన్నారు.
తయారీ, సంరక్షణ సేవలు, నిర్మాణం, ఆటోమొబైల్ నిర్వహణ, ఆతిథ్య రంగం, వ్యవసాయం, ఐటీ, డిజిటల్ సేవలు, నూతనంగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ ఎకానమీ వంటి రంగాల్లో భారత్-జపాన్ మధ్య సహకారానికి బలమైన అవకాశాలున్నాయని ప్రతినిధులు గుర్తించారు. పారదర్శకమైన, విస్తృతమైన ఉపాధి అవకాశాలను పెంపొందించటంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వ్యవస్థల ప్రాధాన్యతను ఈ చర్చలు స్పష్టం చేశాయి.
భవిష్యత్ కార్యాచరణలో భాగంగా భారతదేశంలో జపనీస్ భాషా శిక్షణ, పరీక్షా కేంద్రాల విస్తరణ.. జపనీస్ యజమానులు, భారత నైపుణ్య శిక్షణా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటం, జపాన్లోని ఉపాధి డిమాండ్ను స్పష్టంగా గుర్తించటం, నైపుణ్యాల గుర్తింపు, వృత్తిపరమైన యోగ్యతను పెంపొందించటం, సన్నిహిత సంస్థాగత సహకారం ద్వారా విశ్వసనీయమైన శ్రామిక శక్తి బదిలీ మార్గాలను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలకు ముఖ్యంగా జపాన్ వెళ్లే అభ్యర్థులను సిద్ధం చేయటానికి అస్సాం ప్రభుత్వం చేపట్టిన ఫారిన్ లాంగ్వేజ్ ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ టాలెంట్ (ఫ్లైట్).. అద్భుతమైన రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిలిచింది.
ఆసియాన్ గ్రూప్ కో. లిమిటెడ్ చైర్మన్, సీఈఓ మిస్టర్ తోషియాకి నిషికావా ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ముగిసింది. భారత్-జపాన్ ప్రజల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్య ప్రాముఖ్యతను ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో శ్రామిక శక్తి సహకారంపై ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్లలో 50,000 మందితో జపాన్-భారత్ పర్సనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంను సాకారం చేయటం పట్ల ఆయన ఆసక్తిని కనబరిచారు.
***
(రిలీజ్ ఐడి: 2265449)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7