గనుల మంత్రిత్వ శాఖ
ఖనిజ బ్లాకుల వేలం, నిర్వహణ పురోగతిని సమీక్షించిన కేంద్ర గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 5:45PM by PIB Hyderabad
కేంద్ర గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు, కేటగిరీ-ఎ ఖనిజ నిక్షేపాలు ఉన్న రాష్ట్రాల అధికారులతో తొమ్మిదో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. గనుల రంగంలో సంస్కరణలను వేగవంతం చేయడం, దేశీయ ఖనిజ ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
2015లో వేలం విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేయడాన్ని సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ తర్వాత వేలం ప్రక్రియ గణనీయమైన వేగాన్ని పుంజుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ఏటా సగటున 90 బ్లాకుల చొప్పున మొత్తం 364 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు.
ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో 212 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు. వేలం విధానం ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఆర్థిక సంవత్సరంలో ఇన్ని ఖనిజ బ్లాకులను వేలం వేయడం ఇదే మొదటిసారి. ఈ వేలంలో 22 కీలకమైన, వ్యూహాత్మక ఖనిజ బ్లాకులు కూడా ఉండడం విశేషం. భారత ఆర్థిక వృద్ధికి, స్వచ్ఛ ఇంధన మార్పునకు అవసరమైన కీలక ఖనిజ వనరులను సమకూర్చుకోవడంపై ప్రభుత్వం నిరంతరం చూపుతున్న శ్రద్ధను ఇది ప్రతిబింబిస్తోంది.
వేలం వేసిన బ్లాకుల నిర్వహణ స్థితిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 20 గ్రీన్ ఫీల్డ్, 38 బ్రౌన్ ఫీల్డ్ బ్లాకులతో కలిపి మొత్తం 58 బ్లాకులు అందుబాటులోకి రాగా, ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 28 గ్రీన్ ఫీల్డ్, 8 బ్రౌన్ ఫీల్డ్ బ్లాకులతో కలిపి మొత్తం 36 ఖనిజ బ్లాకులు నిర్వహణలోకి వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
చట్టబద్ధమైన అనుమతులను వేగవంతం చేయడానికి, గనుల తవ్వకాలను త్వరతిగతిన ప్రారంభించడానికి, వేలం వేసిన బ్లాకుల నుంచి సకాలంలో ఉత్పత్తిని సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని గనుల శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ, భారత ఖనిజ భద్రతను బలోపేతం చేయడంలోనూ కీలక ఖనిజాల అభివృద్ధి ప్రాధాన్యతను కూడా ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2265228)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7