నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
2026 తైపీ క్యాపిటల్ కప్ వరల్డ్ స్కిల్స్ ఇన్విటేషనల్ టోర్నమెంట్కు బయలుదేరిన భారత బృందానికి వీడ్కోలు పలికిన కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 4:58PM by PIB Hyderabad
తైవాన్లోని తైపీలో మే 26 నుంచి 28 వరకు జరిగే అంతర్జాతీయ వృత్తి, సాంకేతిక నైపుణ్యాల పోటీ ( తైపీ క్యాపిటల్ కప్ వరల్డ్ స్కిల్స్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ -2036)లో పాల్గొనేందుకు బయలుదేరిన భారత బృందానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి వీడ్కోలు పలికారు.
భవిష్యత్ ప్రపంచ విజేతలుగా నిలవనున్న ఐదుగురు సభ్యుల భారత బృందం ఈ టోర్నమెంట్లో సుమారు 15 దేశాల పోటీదారులతో తలపడనుంది. వరల్డ్ స్కిల్స్ షాంఘై 2026 పోటీలకు సన్నాహక కార్యక్రమంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు నైపుణ్యాభివృద్ధిని, సాంకేతిక ప్రతిభను, భాగస్వామ్యాన్ని, కార్మిక రంగ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ పోటీలో పాల్గొనే వారికి అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కల్పిస్తాయి.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అరుణ్కుమార్ పిళ్లైతో పాటు మంత్రిత్వ శాఖ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డిసీ) కు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత పోటీదారులను ఉద్దేశించి శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ... ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని, అంతర్జాతీయ పోటీ ప్రమాణాలు, ప్రపంచవ్యాప్త అత్యుత్తమ విధానాల నుంచి నేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నైపుణ్య పోటీల ప్రాధాన్యతను వివరిస్తూ, ఇటువంటి పోటీలు సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా, భారత నైపుణ్య వ్యవస్థను బలోపేతం చేస్తాయని, అంతర్జాతీయంగా వస్తున్న నూతన అవకాశాలకు దేశ యువతను సిద్ధం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
"2026 తైపీ క్యాపిటల్ కప్ వరల్డ్స్కిల్స్ పోటీలకు వెళ్లనున్న భారత బృందంతో ముచ్చటించడం సంతోషాన్నిచ్చింది. ఈ అంతర్జాతీయ వేదికలు కేవలం పతకాల కోసమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచే, దృక్పథాన్ని విస్తృతం చేసే, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించే అనుభవాల కోసం కూడా ఉపయోగపడతాయి. మన యువ పోటీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకుంటూ, స్నేహాలను, భాగస్వామ్యాలను పెంపొందించుకుంటూ, ఉన్నతమైన ఆశలతో, విస్తృతమైన ఆలోచనలతో తిరిగి రావాలి. అంతర్జాతీయ వేదికపై నైపుణ్యం కలిగిన నవ భారత స్ఫూర్తిని, ప్రతిభను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని శ్రీ జయంత్ చౌదరి పేర్కొన్నారు.
2026 తైపీ క్యాపిటల్ కప్ వరల్డ్స్కిల్స్ పోటీలలో భారత్ ఐదు నైపుణ్య విభాగాలలో తలపడనుంది. ఇందులో మొబైల్ అప్లికేషన్ల డెవలప్మెంట్లో అర్జున్ సుమతి విజయభాస్కర్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్లో మహ్మద్ మఫాజ్ పూనైకన్నన్ రబీ అహమద్, పెయింటింగ్, డెకరేటింగ్లో ముస్కాన్, ఆటోమొబైల్ టెక్నాలజీలో మహ్మద్ సిరాజ్, డిజిటల్ కన్స్ట్రక్షన్లో సురేష్ కుమార్ గణేశన్ మీనా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ బృందంలో ఇండియాస్కిల్స్ జాతీయ పోటీలు 2025-26 స్వర్ణ పతక విజేతలతో పాటు వైల్డ్కార్డ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు కూడా ఉన్నారు.
ఈ సంవత్సరం జరిగే పోటీలలో స్మార్ట్ తయారీ, డిజిటల్ మార్పునకు సంబంధించిన కీలక రంగాలకు చెందిన 10 నైపుణ్య విభాగాలు ఉన్నాయి. వీటిలో ఇండస్ట్రియల్ మెకానిక్స్, ఐటీ నెట్వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ 4.0, ఆటోమొబైల్ టెక్నాలజీ, డిజిటల్ కన్స్ట్రక్షన్ (బీఐఎమ్) మొదలైనవి ఉన్నాయి.
ఈ టోర్నమెంట్లో భారత్ పాల్గొనడం 48వ వరల్డ్స్కిల్స్ షాంఘై 2026 వైపు దేశం సాగిస్తున్న సన్నాహక ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది. ఈ పోటీలు భారత బృందానికి అంతర్జాతీయ ప్రమాణాలపై ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు, ప్రపంచ స్థాయి పోటీలకు ముందు ఒక కీలకమైన సన్నాహక వేదికగా నిలుస్తాయి. పోటీదారులు తమ సాంకేతిక నైపుణ్యాలకు పదును పెట్టుకోవడానికి, అంతర్జాతీయ అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడానికి తోడ్పడతాయి.
(రిలీజ్ ఐడి: 2265226)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8