రక్షణ మంత్రిత్వ శాఖ
ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే దేశం.. స్వయంగా గమ్యాన్ని నిర్దేశించుకుంటుంది: రక్షణ మంత్రి
శిరిడీలో ప్రైవేటు భాగస్వామ్యంతో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి, మహారాష్ట్ర సీఎం
భారత్లోనే తొలిసారిగా 300 కి.మీ. పరిధి గల యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ ప్రారంభం
"రక్షణ రంగ ఆయుధ సామాగ్రి, ఆటోమేషన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా భారత్ను మార్చేందుకు అవసరమైన చర్యలు చెేపట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం"
"రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు.. శాంతి, అభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధికి అత్యంత ఆవశ్యకం"
నాడు పోస్టు చేయడమైనది:
23 MAY 2026 7:15PM by PIB Hyderabad
"ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే దేశం.. స్వయంగా గమ్యాన్ని నిర్దేశించుకుంటుంది" అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మే 23, 2026న శిరిడీలో ప్రైవేటు రంగ సంస్థ నిబే గ్రూప్ ఏర్పాటు చేసిన రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక ఫిరంగి వ్యవస్థలు, క్షిపణి, అంతరిక్ష సాంకేతికతలు, రాకెట్ వ్యవస్థలు, పేలుడు పదార్థాలు, స్వయం ప్రతిపత్తి గల రక్షణ వేదికలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా భారత్లో తొలిసారిగా 300 కి.మీ. పరిధి గల యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ 'సూర్యాస్త్ర'ను ప్రారంభించారు. ఈ వ్యవస్థకు సంబంధించి క్షిపణి కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశీయ సాంకేతికతో రూపొందించిన టీఎన్టీ ప్లాంట్, ఆర్డీఎక్స్ ప్లాంట్, బయో ఎనర్జీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను కూడా ప్రారంభించారు. శాటిలైట్ అసెంబ్లీ రంగంలో సహకారానికి నిబే గ్రూప్, బ్లాక్ స్కై సంస్థల మధ్య ఎంఓయూ కుదిరింది.
ఆయుధ సామగ్రి ఉత్పత్తిలో స్వావలంబన ఆవశ్యకతను రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఈ కేంద్రం రక్షణ దళాల కార్యాచరణ అవసరాలను తీర్చటంలో సహాయపడుతుందని, దేశ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయటానికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ఆయుధ కర్మాగారాలకే పరిమితమైన రక్షణ రంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ప్రైవేటు రంగానికి అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. "భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చగల సామర్థ్యం ప్రైవేటు రంగానికి ఉందని మేం గుర్తించాం" అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో యుద్ధ ఫలితాలను దేశ సైన్య పరిమాణం కాదు.. ఆయుధాలు, ఆటోమేషన్లో సాధించిన పురోగతి, సామర్థ్యాలే నిర్ణయిస్తాయని శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. "ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణలోనూ, పశ్చిమాసియా పరిస్థితుల్లోనూ ఈ వాస్తవాన్ని మనం గమనించవచ్చు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ సామర్థ్యాన్ని భారత్ నిరూపించుకుంది" అని అన్నారు.
భవిష్యత్తులో జరిగే యుద్ధాల తీరుపై భారతదేశ ప్రైవేటు పరిశ్రమలకు పూర్తి అవగాహన ఉందని, దేశానికి అత్యాధునిక వ్యవస్థలను సమకూర్చేందుకు అవి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని రక్షణ మంత్రి తెలిపారు. ఆయుధాలు, ఆటోమేషన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా భారత్ను మార్చేందుకు సంబంధిత వర్గాలన్నీ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కీలక సాంకేతికతలను, అధునాతన వ్యవస్థల్లో 'మేక్-ఇన్-ఇండియాను ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. "ఆయుధాలు, ఆటోమేటెడ్ వ్యవస్థల్లో భారత్ అగ్రగామిగా నిలిచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని వెల్లడించారు.
సాంకేతికత ప్రాథమిక లక్ష్యం.. సైనికుల సామర్థ్యాలను తగ్గించటం కాదని, మరింత బలోపేతం చేయటమేనని, తుది నిర్ణయం ఎల్లప్పుడూ మానవ మేధస్సుకే ఉండాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భవిష్యత్ యుద్ధాల్లో ఆధునిక ఆయుధాలు, ఆటోమేటెడ్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని, ఈ దిశగా భారత్ పురోగమించటం తప్పనిసరని అన్నారు. "రక్షణ, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో పూర్తి స్వావలంబన దేశంగా భారత్ను మార్చటానికి మనమంతా సమష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం" అని పిలుపునిచ్చారు. భవిష్యత్ యుద్ధాల కోసం భారత్ సామర్థ్యాన్ని పెంపొందించాలని రక్షణ సంస్థలను కోరారు.
గత దశాబ్ద కాలంలో రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన చర్యలను రక్షణ మంత్రి ప్రస్తావించారు. సాహసోపేతమైన విధాన సంస్కరణలు, సరళమైన ఎఫ్డీఐ నిబంధనలు, వ్యూహాత్మక భాగస్వామ్య నమూనాను ప్రవేశపెట్టటం, సానుకూల స్వదేశీకరణ జాబితాల ప్రకటన, ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్), ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్ (అదితి), టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (టీడీఎఫ్) వంటి పథకాల ప్రారంభం యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దేశీయ పరిశ్రమలు అందిస్తున్న బలంతో వీర జవాన్లు జాతీయ ప్రయోజనాలను కాపాడుతున్నారని.. ఆత్మనిర్భర్ భారత్, మేక్-ఇన్-ఇండియా దార్శనికతను సాకారం చేయటంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
"ఒకప్పుడు రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం అతి తక్కువగా ఉండేది. ఇప్పుడది సుమారు 25-30 శాతానికి చేరుకుంది. రాబోయే ఏళ్లలో ఈ గణాంకాన్ని 50 శాతానికి చేర్చడమే మా లక్ష్యం. ఇది నూతన భారతం. ఇక్కడ ప్రైవేటు రంగాన్ని కేవలం చిన్న చిన్న నట్లు, బోల్టులు సరఫరా చేసే సంస్థగా మాత్రమే చూడలేం. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఆవిష్కరించి, స్వయంగా తయారు చేసే స్థాయికి అవి ఎదుగుతున్నాయి. ప్రభుత్వ దార్శనికతకు ప్రైవేటు రంగ ఆవిష్కరణలు తోడైనప్పుడు దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది" అని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు.
నేటి ప్రపంచంలో 'భద్రత', 'ఆర్థిక వ్యవస్థ'లను వేరుగా చూడలేమని రక్షణ మంత్రి అన్నారు. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థే బలమైన సైన్యానికి, ఆధునిక రక్షణ సామర్థ్యాలకు కీలకమని స్పష్టం చేశారు. "పెట్టుబడులకు, పారిశ్రామిక వృద్ధికి, సమగ్ర అభివృద్ధికి స్థిరమైన వాతావరణాన్ని జాతీయ భద్రతే సృష్టిస్తుంది. ప్రస్తుతం వాణిజ్యం, సరఫరా వ్యవస్థల నుంచి అరుదైన ఖనిజాల వరకు దాదాపు ప్రతిదాన్నీ ఆయుధాలుగా మార్చటాన్ని మనం చూస్తున్నాం. ఈ తరుణంలో మన రక్షణ తయారీ అవసరాలకు ఇతరులపై ఆధారపడలేం. రక్షణ ఉత్పత్తిలో ఆత్మనిర్భరత కేవలం యుద్ధానికి మాత్రమే కాక.. శాంతి, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి అత్యవసరం" అని తెలిపారు.
ఇవాళ ప్రారంభమవుతున్న ప్లాంట్లు పరిశోధనా కేంద్రాలుగా మారతాయని, ఇవి భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయని శ్రీ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన క్షిపణి కేంద్రం, భారతదేశ భవిష్యత్ యుద్ధ సామర్థ్యాలకు ఒక కొత్త దిశను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ రాకెట్ వ్యవస్థ, దాడి సామర్థ్యాన్ని కొన్ని రెట్లు పెంచి, వ్యూహాత్మకంగా విప్లవాత్మక మార్పు అని నిరూపించుకుంటుంది" అని శ్రీ రాజ్నాథ్ స్పష్టం చేశారు.
ఈ కేంద్రం కేవలం అధునిక సాంకేతికత గల పరిశ్రమలకే కాక, ఎంఎస్ఎంఈలకు, చిన్న తరహా పరిశ్రమలకు, స్థానిక ఆర్థిక వ్యవస్థకూ విస్తృత వ్యవస్థను సృష్టిస్తుందని రక్షణ మంత్రి అభినందించారు. "పేలుడు సామగ్రి, క్షిపణులు, రాకెట్ వ్యవస్థలు, ఉపగ్రహ భాగాల ఉత్పత్తి అనుబంధ యూనిట్లు, సరఫరాదారులు, విక్రేతలకు ఉపాధి కలుగుతుంది. ఇది ఉద్యోగావకాశాలను సృష్టిస్తుంది. ఈ ప్రాంత యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి, దేశ నిర్మాణంలో వారు భాగస్వాములయ్యేలా తోడ్పడుతుంది" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్, మేక్-ఇన్-ఇండియా కార్యక్రమాల ద్వారా దేశ రక్షణ సన్నద్ధతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత సైనికుల అసమాన ధైర్యానికి, పెరుగుతున్న స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ఆపరేషన్ సింధూర్ గొప్ప ఉదాహరణ అని అభివర్ణించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల క్రియాశీల, సమాన భాగస్వామ్యం వల్ల భారత రక్షణ వ్యవస్థ రూపురేఖలు మారాయని, ఇది జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి రక్షణ దళాలకు నిరంతరం బలాన్నిస్తుందని స్పష్టం చేశారు. వ్యూహాత్మక శక్తిని పెంపొందించుకుంటూ, ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సాంకేతిక ప్రదర్శనలు, ఎంఎస్ఎంఈల రక్షణ సామర్థ్య ప్రదర్శనలు, పరిశ్రమల నాయకులు, రక్షణ రంగ భాగస్వాములతో సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, మహారాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ఉదయ్ సమంత్, జలవనరుల శాఖ మంత్రి శ్రీ రాధాకృష్ణ ఇ. విఖేపాటిల్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తులు) శ్రీ సంజీవ్ కుమార్, రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, ఇతర సీనియర్ పౌర, సైనిక అధికారులు, వ్యూహాత్మక భాగస్వాములు, పరిశ్రమల భాగస్వాములు హాజరయ్యారు.
(రిలీజ్ ఐడి: 2264737)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5