ప్రధాన మంత్రి కార్యాలయం
రోజ్గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
వికసిత్ భారత్ దిశగా సాగుతున్న పయనాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత యువత: ప్రధానమంత్రి
యువశక్తికి కొత్త అవకాశాలతో సాధికారత కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతకు రోజ్గార్ మేళా నిదర్శనం: ప్రధానమంత్రి
దేశ యువ జనాభా, సాంకేతిక పురోగతి పట్ల ప్రపంచం ఎంతో ఉత్సాహంగా ఉంది: ప్రధానమంత్రి
భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని నేడు ప్రపంచం కోరుకుంటోంది: ప్రధానమంత్రి
స్వచ్ఛ ఇంధనం, కీలక ఖనిజాలు, హరిత హైడ్రోజన్, సుస్థిర తయారీ రంగాలు కూడా నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి: ప్రధానమంత్రి
ఈ రంగాల్లో భాగస్వామ్యాలు నూతన ఆర్థిక వ్యవస్థకు, కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నాయి: ప్రధానమంత్రి
నేడు ప్రతి భారతీయుడు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.. ఆ సంకల్పమే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించడం: ప్రధానమంత్రి
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు దేశం ప్రస్తుతం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది.. ఈ పెట్టుబడులు దేశ యువతకు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి: ప్రధానమంత్రి
నేడు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది... మెరుగైన అనుసంధానం రైతులకు, చిన్న వ్యాపారులకు, విద్యార్థులకు కొత్త మార్గాలను తెరిచింది: ప్రధానమంత్రి
దేశ యువత నేడు ప్రతి ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేస్తున్నారు... ఇదే స్ఫూర్తి, శక్తి ప్రజా సేవల్లోనూ ప్రతిబింబించాలి: ప్రధానమంత్రి
తమ పనిని జాతీయ సేవగా భావించే యువత కృషితోనే అభివృద్ధి చెందిన భారత్ కల సాకారమవుతుంది: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 MAY 2026 1:52PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ మైలురాయిని సాధించడానికి అభ్యర్థులు చూపిన అంకితభావం, కఠోర సన్నాహాలను గౌరవిస్తూ.. వారందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏ ఒక్కరి వ్యక్తిగత విజయం ఒంటరిగా సాధ్యం కాదని గుర్తిస్తూ, ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారికి ఎంతో అండగా నిలిచిన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కూడా ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవలే ముగిసిన అయిదు దేశాల దౌత్య పర్యటనకు సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ... డజన్ల కొద్దీ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల అధినేతలు, దేశ యువత, మన సాంకేతిక పురోగతిపట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు. దేశ ఎదుగుదలలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోందని ఆయన వివరించారు. ‘‘భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రపంచం ఒక భాగం కావాలని కోరుకుంటోంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
తన పర్యటన దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక ఫలితాలను సవివరంగా వివరిస్తూ... తాము సందర్శించిన ప్రతి దేశంతో జరిగిన చర్చలు, కుదిరిన రంగాల వారీ ఒప్పందాలను ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. నెదర్లాండ్స్తో సెమీకండక్టర్లు, నీరు, వ్యవసాయం, అధునాతన ఉత్పాదకత రంగాలపై చర్చలు, స్వీడన్తో కృత్రిమ మేధ, డిజిటల్ ఆవిష్కరణల రంగాల్లో సహకారంపై సంప్రదింపులు, నార్వేతో హరిత సాంకేతికత, నౌకా వాణిజ్య సహకారంపై చర్చలు, యూఏఈతో వ్యూహాత్మక ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యాలపై అవగాహన ఒప్పందాలు, ఇటలీతో రక్షణ, కీలక ఖనిజాలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు జరిగాయని ప్రధానమంత్రి వివరించారు. భారత్ చేసుకునే అంతర్జాతీయ భాగస్వామ్యాలన్నీ కేవలం దేశ యువతకు లబ్ధి చేకూర్చేలా స్పష్టమైన ప్రణాళికతో రూపకల్పన జరిగాయని స్పష్టం చేశారు. ‘‘దేశ యువతకు ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ స్థాయి అనుభవం లభించడమే ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశం’’ అని శ్రీ మోదీ చెప్పారు.
ఈ ప్రతి ఒక్క ఒప్పందానికి, ఉపాధి కల్పనకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని తెలియజేస్తూ... దేశంలోకి వచ్చే ప్రతి కొత్త పెట్టుబడి, ప్రతి సాంకేతిక భాగస్వామ్యం, ప్రతి పారిశ్రామిక సహకారం చివరికి దేశ యువతకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ సహకారాలకు ఉన్న దీర్ఘకాలిక ప్రాధాన్యతను ఆయన మరింతగా వివరించారు. ‘‘రాబోయే 25 సంవత్సరాల పాటు ప్రపంచ వృద్ధిని శాసించబోయే పరిశ్రమలను నిర్దేశించే రంగాలు ఇవే’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా భాగస్వామిగా భారత్కు పెరుగుతున్న ప్రతిష్టకు నిదర్శనంగా ఏఎస్ఎంఎల్-టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందాన్ని ప్రధాన మంత్రి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. డచ్ (నెదర్లాండ్స్)కు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ దిగ్గజ సంస్థ ఎస్ఎంఎల్తో.. ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న ప్రపంచంలోని అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి అని అన్నారు. కృత్రిమ మేధపై స్వీడన్తో కుదిరిన భాగస్వామ్యాలు, సూపర్ కంప్యూటింగ్పై యూఏఈతో ఏర్పడిన సహకారం కూడా ఇదే విధంగా దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తాయని తెలిపారు. ‘‘ఈ ఒక్క ఏఎస్ఎంఎల్-టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందం ద్వారానే భారత్లో వేలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
స్వచ్ఛమైన ఇంధనం, కీలక ఖనిజాలు, హరిత హైడ్రోజన్, సుస్థిర తయారీ రంగాలు అపారమైన అవకాశాలు ఉన్న రంగాలుగా శరవేగంగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పర్యావరణ హిత మార్పు, సుస్థిర సాంకేతికతలో స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలతో పెరుగుతున్న సహకారం భవిష్యత్తులో పర్యావరణహిత తయారీ పరిశ్రమల్లో భారత్ను అత్యంత శక్తిమంతమైన స్థానంలో నిలబెడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ భాగస్వామ్యాలు సరికొత్త ఆర్థిక వ్యవస్థకు, కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తున్నాయి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఓడరేవులు, నౌకాయానం, నౌకా వాణిజ్య మౌలిక సదుపాయాల ఒప్పందాలపై వేగంగా జరుగుతున్న పనిని వివరిస్తూ... యూఏఈ, నార్వే దేశాలతో కుదిరిన భాగస్వామ్యాలు దేశీయ నౌకానిర్మాణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇది దేశంలోని ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులకు అవకాశాల పరిధిని నేరుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ‘ దేశ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు.
ఈ ప్రతి కొత్త భాగస్వామ్యం భారతీయ అంకుర సంస్థలు, పరిశోధకులు, యువ నిపుణులకు అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత విస్తృతం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వినూత్నంగా ఆలోచించే, సరికొత్తగా నిర్మించే, భారీ స్థాయిలో ఫలితాలను అందించే దేశాలను నేడు ప్రపంచం ఎంతగానో గౌరవిస్తోందని చెప్పారు. భారత్ ఈ మూడు రంగాలలోనూ దూసుకుపోతుండటం పట్ల ఆయన గర్వం వ్యక్తం చేశారు. ‘‘ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్న అతిపెద్ద శక్తులు దేశ యువత... అంటే మీరందరే’’ అని శ్రీ మోదీ తెలిపారు.
ఈ అద్భుతమైన సందర్భాన్ని జాతీయ సమష్టి లక్ష్యంతో ముడిపెడుతూ... 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలనే దృఢ సంకల్పాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం వివిధ రంగాలలో చేపడుతున్న బహుముఖ పెట్టుబడుల వల్ల దేశంలో లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ఈ పెట్టుబడులు దేశ యువతకు లక్షలాది సరికొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.
దేశంలో వేగంగా విస్తరిస్తున్న సెమీకండక్టర్ వ్యవస్థ స్థాయిని ప్రధానమంత్రి వివరించారు. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పూర్తిస్థాయి దేశీయ సరఫరా వ్యవస్థను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే పది భారీ సెమీకండక్టర్ కేంద్రాలు ప్రపంచ వేదికపై తమవైన ముద్ర వేయబోతున్నాయని, ఇప్పటికే పెద్ద సంఖ్యలో భారతీయ యువతకు వీటిలో ఉపాధి లభిస్తోందని ఆయన తెలిపారు. ‘‘ దేశ సెమీకండక్టర్ కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తాయి’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ ధీమా వ్యక్తం చేశారు.
సుమారు రూ. 75,000 కోట్ల భారీ పెట్టుబడితో భారత్లో విస్తరిస్తున్న నౌకానిర్మాణ, నౌకల మరమ్మతు, సమగ్ర మరమ్మత్తు వ్యవస్థపై దృష్టిసారిస్తూ...విమానాల నిర్వహణ, మరమత్తు సౌకర్యాలను కలిగిన పూర్తిస్థాయి ఎంఆర్ఓ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇది విమానయాన రంగాన్ని సమూలంగా మార్చివేస్తుందన్నారు. ‘‘దేశ యువత కోసం సరికొత్త ఉపాధి రంగం ఆవిష్కృతం కాబోతోంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ దేశంగా భారత్ ఎదుగుతున్న తీరును వివరిస్తూ... రికార్డు స్థాయిలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి, లక్షలాది యువతకు ఉద్యోగాలను కల్పించడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ పథకం) కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు దీనివల్ల ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన పూర్తి విలువ వ్యవస్థ దేశీయంగానే నిర్మితమవుతోందని పేర్కొన్నారు. ‘‘పీఎల్ఐ పథకం దేశంలో రికార్డు స్థాయిలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి దారితీస్తోంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ సంయుక్తంగా ఈ బహుళ కార్యక్రమాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతున్నాయని ప్రధాన మంత్రి వెల్లడించారు. వ్యాపారాలు, పరిశ్రమల పురోగతిని సులభతరం చేయడంలో తమకు ఉన్న బాధ్యతను కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘వ్యాపార సౌలభ్యం దేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం’’అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఉపాధి కల్పన, సమగ్ర వృద్ధిని నడిపించడంలో మౌలిక సదుపాయాలు ప్రాథమిక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. గ్రామాలు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలు దేశ అభివృద్ధి ముసాయిదాలో భాగమైనప్పుడు మాత్రమే జాతీయ ప్రగతి అసలైన ఫలాలు పూర్తి స్థాయిలో అందుతాయని చెప్పారు. ‘‘గ్రామాలు, మారుమూల ప్రాంతాలు అభివృద్ధితో అనుసంధానమైనప్పుడు దేశ ప్రగతి ప్రయోజనం మరింత ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
గడిచిన పన్నెండేళ్ల కాలంలో రైల్వేలు, రహదారులు, విమానాశ్రయాలు, సరుకు రవాణా, ఓడరేవులు, డిజిటల్ నెట్వర్క్ల వ్యాప్తంగా నిర్మించిన విస్తృతమైన మౌలిక సదుపాయాల ప్రగతిని ప్రధానమంత్రి వివరించారు. ఈ అనుసంధానత రైతులకు, చిన్న వ్యాపారులకు, విద్యార్థులకు సమానంగా కొత్త మార్గాలను తెరిచిందని... ప్రస్తుతం ఈ మార్పు దేశంలోని గ్రామాలను సైతం స్పష్టంగా పునర్నిర్మిస్తోందని చెప్పారు. ‘‘గ్రామాల్లో సైతం మార్పు వేగంగా జరుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.
కోట్లాది మంది భారతీయ కుటుంబాలకు అందుతున్న ప్రాథమిక వసతులైన శాశ్వత గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్, జల జీవన్ మిషన్ కింద అందుతున్న కుళాయి నీటి ద్వారా సమాజంపై పడుతున్న విస్తృత సానుకూల ప్రభావాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ పునాది మార్పులు కేవలం సౌకర్యాల కల్పనకు మాత్రమే పరిమితం కాలేదని, అంతకుమించి ఎంతో ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ మార్పుల ప్రభావం కేవలం సౌకర్యాలకే పరిమితం కాలేదు’’ అని తెలిపారు.
గ్రామీణ రహదారులు, మెరుగైన విద్యుత్, డిజిటల్ అనుసంధానం వంటివి ఆర్థిక కార్యకలాపాలను రెట్టింపు చేయడానికి పనిచేస్తూ, మార్కెట్లకు సులభతరాన్ని కల్పించి, చిన్న తరహా పరిశ్రమలు వృద్ధి చెందడానికి దోహదపడి, గ్రామాలను కొత్త డిజిటల్ వ్యవస్థలలోకి తీసుకువచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పరస్పర అనుసంధాన మెరుగుదలలు అన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేశాయని, లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయని ఆయన అన్నారు. ‘‘ఇవన్నీ ఉపాధి కల్పనపై సానుకూల ప్రభావాన్ని చూపాయి’’ అని పేర్కొన్నారు.
తయారీ రంగం, సాంకేతికత, అంకుర సంస్థలు, డిజిటల్ సేవలు, రైల్వేలు, రక్షణ, అంతరిక్ష రంగాల వ్యాప్తంగా నేడు దేశ యువతకు లభిస్తున్న అవకాశాలు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివని ప్రధానమంత్రి ప్రకటించారు. గరిష్ట సంఖ్యలో యువత ఈ అవకాశాలను అందుపుచ్చుకునేలా, వారి ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించేలా చేయడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. ‘‘దేశ యువత తమ కలలను సాకారం చేసుకోవడానికి నేడు ఉన్నన్ని అవకాశాలు గతంలో ఎన్నడూ లేవు’’అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఐటీఐల ఆధునీకరణ, జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలను బలోపేతం చేయడం, పీఎం సేతు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సహా నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో ముడిపడిన విద్య, భవిష్యత్తు సాంకేతికతలపై ప్రభుత్వం నిరంతరం పెడుతున్న పెట్టుబడులను ప్రధానమంత్రి ప్రస్తావించారు. శరవేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థ వేగానికి అనుగుణంగా నిరంతర సన్నద్ధత ప్రాధాన్యతను వివరించారు. ‘‘నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో ముడిపడిన విద్య, భవిష్యత్తు సాంకేతికతలకు నిరంతర ప్రాధాన్యత ఇస్తున్నాం’’అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా స్వయం ఉపాధి, వ్యాపారవేత్తలుగా ఎదిగే సరికొత్త సంస్కృతి ఆవిర్భవించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. 2.3 లక్షలకు పైగా గుర్తింపు పొందిన అంకుర సంస్థలతో భారత్ నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.‘‘ఈ మార్పు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాలేదు’’ అని వ్యాఖ్యానించారు.
టైర్-2, టైర్-3 నగరాల నుంచి యువత పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు, ఆవిష్కరణల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారని, ఈ ఉద్యమం జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ వ్యాపార వృద్ధిలో దేశ మహిళల పాత్ర పెరుగుతోందని, అది అత్యంత నిర్ణయాత్మకంగా మారిందని తెలిపారు. ముద్ర యోజన ద్వారా కోట్లాది మంది మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడాన్ని, పీఎం స్వనిధి వంటి పథకాల ద్వారా లభించిన స్వయం సమృద్ధిని గుర్తిస్తూ... ‘‘ఈ రోజు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో మహిళలు తమకు తాముగా సరికొత్త వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు’’ అని శ్రీ మోదీ కొనియాడారు.
కొత్తగా ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ఏ సంస్థకైనా అసలైన బలం దాని ఉద్యోగులేనని, వారు చేరబోతున్న ఈ వ్యవస్థ కోట్లాది మంది పౌరుల జీవితాలతో అత్యంత సన్నిహితంగా, ప్రత్యక్షంగా ముడిపడి ఉందని ప్రధానమంత్రి వారికి గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల జీవితాలను సులభతరం చేసే ఒక సాధనమని తెలిపారు. ‘‘మీరు ఏ శాఖలో సేవలు అందించినప్పటికీ మీ ప్రవర్తన, సానుభూతి, పనిచేసే విధానం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
కొత్త అభ్యర్థులపై దేశానికి ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తూ... ప్రతి యువ కర్మయోగి' తమ పదవిని ఒక సజీవమైన బాధ్యతగా భావించాలని, దేశ ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా తమ పనిని మలుచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ‘‘ఇప్పుడు మీ పని ద్వారా ఆ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత మీపై ఉంది’’ అని స్పష్టం చేశారు.
నిరంతర అభ్యాసానికి కట్టుబడి ఉండాలని, మారుతున్న సరికొత్త సాంకేతికతలకు, వ్యవస్థలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారాలని కొత్త ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానమంత్రి కోరారు. అభ్యర్థులు తమ బాధ్యతలను పూర్తి ఆత్మవిశ్వాసంతో అర్థం చేసుకుని, నిర్వర్తించడానికి ఐగాట్ కర్మయోగి వేదిక, కర్మయోగి ప్రారంభ మాడ్యూల్ ఎంతగానో సహాయపడతాయని, ఇవి అత్యంత శక్తివంతమైన సాధనాలని కొనియాడారు. ‘‘మీరంతా దీనిని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను’’అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ తమ ముద్ర వేస్తున్న భారతీయ యువతలో ఉన్నటువంటి అదే స్ఫూర్తి, అదే శక్తి.. నేడు నియామక పత్రాలను అందుకుంటున్న యువతలో కూడా కనిపిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఇదే స్ఫూర్తి వారి ప్రజాసేవలోనూ ప్రతిబింబించాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘తమ పనిని దేశ సేవగా భావించే యువత ప్రయత్నాల వల్లే వికసిత్ భారత్ సాకారమవుతుంది’ అని శ్రీ మోదీ తెలిపారు.
చివరగా.. కొత్తగా నియమితులైన అభ్యర్థులు దేశ అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త వేగాన్ని అందిస్తారని, వారి పని, నిర్ణయాల ద్వారా వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుందని ప్రధానమంత్రి తన పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నియామక పత్రాలను అందుకుంటున్న యువత అందరికీ భవిష్యత్తు ప్రయాణం కోసం ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
****
(రిలీజ్ ఐడి: 2264727)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam