పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
రాంచీ విమానాశ్రయంలో భగవాన్ బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించిన పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు
ఫీచర్ వాల్నూ ప్రారంభించిన మంత్రి
ఉడాన్ యాత్రీ కెఫే సహా ప్రయాణికుల కోసం అనేక సేవల ప్రారంభం
సవరించిన ఉడాన్ పథకంలో భాగంగా 100 కొత్త విమానాశ్రయాలతో పాటు
200 హెలీపోర్టులు అభివృద్ధి చేస్తాం: శ్రీ నాయుడు
నాడు పోస్టు చేయడమైనది:
20 MAY 2026 9:08PM by PIB Hyderabad
యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు విమానాశ్రయ సంబంధిత మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశగా చేపట్టిన కీలక చర్య ఇది.. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, సంస్కృతి పరంగా ఎంతో కీలకమైన అనేక సౌకర్యాల్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేఠ్ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.
తాజాగా ప్రారంభించిన సదుపాయాల్లో.. భగవాన్ బిర్సా ముండా విగ్రహం సహా ఫీచర్ వాల్, ఉడాన్ యాత్రీ కెఫే, ఏవీఎస్ఏఆర్ కౌంటరు, కిడ్స్ జోన్, ఫ్లయ్బరీ ఉన్నాయి. భగవాన్ బిర్సా ముండాకు నివాళిని అర్పించే దృష్టితో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహంతో పాటు, భగవాన్ బిర్సా ముండా పేరిట ఒక ఫీచర్ వాల్నూ ఏర్పాటు చేశారు. దీని స్థాపన జార్ఖండుకు చెందిన సమృద్ధ సాంస్కృతిక వారసత్వాన్నీ, చరిత్రాత్మక వారసత్వాన్నీ ప్రతిబింబిస్తోంది. ప్రయాణికులు ఇక్కడికి చేరుకోవడంతోనే అద్భుత, ఆకర్షణీయ అనుభూతిని పొందగలుగుతారు.
ఈ సందర్భంగా శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ‘‘ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడం గిరిజన ఆత్మగౌరవం, ఆధునిక ప్రగతి.. ఈ రెండింటి మేలి కలయికని గౌరవించుకొనేందుకు లభించిన ఒక అవకాశం. మన విమానాశ్రయాలు ప్రయాణ కేంద్రాలుగా పనిచేస్తుండడంతో పాటు, అవి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల అస్తిత్వం, వారసత్వం, భావనలకు అద్దం పట్టేవిగా కూడా ఉండాలని నేను దృఢంగా నమ్ముతున్నా. ఇక రాంచీ విమానాశ్రయానికి చేరుకొనే ప్రయాణికులందరికీ భగవాన్ బిర్సా ముండా జీ స్ఫూర్తిదాయక వారసత్వం అందించే స్ఫూర్తితో స్వాగతం పలకవచ్చు. వారికి జార్ఖండ్ ఆత్మను కూడా పరిచయం చేయవచ్చు’’ అన్నారు.
జార్ఖండ్లో విమానయాన రంగ అభివృద్ధిని మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ పౌర విమానయాన రంగంలో ఇదివరకెప్పుడూ ఎరుగనంత పురోగతికి సాక్షిగా నిలిచింది. ఎయిర్పోర్టుల సంఖ్య 2014లో 74గా ఉంటే, ప్రస్తుతం 165కు పెరిగింది. ఈ ప్రగతి జార్ఖండ్ విషయంలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. 2014 తరువాత నుంచి ప్రయాణికుల రాకపోకలు అయిదు రెట్ల కన్నా ఎక్కువయ్యాయి. విమానాల్లో ప్రయాణించడం మూడింతల కన్నా ఎక్కువగా ఉంది. విమానాల్లో సరకు రవాణా కూడా దాదాపు మూడు రెట్ల వృద్ధి నమోదు అయింది’’ అని తెలిపారు.
రాబోయే కాలంలో రాష్ట్రంలో విమానయాన సంబంధిత మౌలిక సదుపాయాల విస్తరణను గురించి మంత్రి వివరిస్తూ, ‘‘సవరించిన ‘ఉడాన్’ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాల్నీ, 200 హెలీపోర్టుల్నీ అభివృద్ధి చేస్తారు. వీటితో గిరిజన ప్రాంతాలకీ, ఆకాంక్షాత్మక జిల్లాలకీ ఎంతో మేలు కలుగుతుంది. జంషెడ్పూర్ విమానాశ్రయంలో ఆర్సీఎస్ కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి. దుమ్కా, హజారీబాగ్, డాల్టన్గంజ్, ధాల్భూంగఢ్, చైబాసాల ఎయిర్పోర్టుల్ని ఉడాన్ పథకంలో భాగంగా అభివృద్ధి చేయాలని తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు’’ అన్నారు.
రాంచీ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతిని శ్రీ రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ, గత అయిదు సంవత్సరాల్లో ఏటా ప్రయాణికుల సంఖ్య 17 లక్షల నుంచి పెరిగి 27 లక్షలకు పైబడిందన్నారు. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని టర్మినల్ భవనానికి సరికొత్త రూపురేఖలతో విస్తరించడానికి ఒక సమగ్ర పథకాన్ని రూపొందించారని ఆయన అన్నారు. ఈ ప్రతిపాదనలో భాగంగానే, డొమెస్టిక్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియాను 6,480 చదరపు మీటర్ల మేరకు విస్తరిస్తారనీ, ఫలితంగా రద్దీ సమయంలో ప్రయాణికుల అవసరాలను తీర్చే సామర్థ్యం అధికమై 2,160 మంది ప్రయాణికులకు కూడా అనువుగా ఉంటుందనీ మంత్రి వివరించారు.
రన్వే సామర్థ్యంతో పాటు కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరచడానికి ఒక సమానాంతర ట్యాక్సీ మార్గాన్నీ, ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేనీ, అదనంగా రెండు విమానాల పార్కింగ్ ఏప్రన్లనీ ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ‘‘రాంచీని ప్రపంచ గమ్యస్థానాలతో కలపడంతో పాటు, జార్ఖండుకు కొత్త ఆర్థిక అవకాశాల్ని కల్పించడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు.
ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన సేవల్ని ప్రారంభించే క్రమంలో ‘విమాన ప్రయాణాల్లో సౌలభ్యానికి’ సంబంధించిన తన దృష్టికోణాన్ని మంత్రి పంచుకున్నారు. ఉడాన్ యాత్రీ కెఫే వల్ల ప్రయాణికులకు తక్కువ ఖర్చులో భోజనంతో పాటు పానీయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో విమానాశ్రయాల్లో మరిన్ని సేవలు లభించే అవకాశం కలుగుతుందనీ, ఫ్లయ్బరీ కార్యక్రమం చదివే అలవాటుని ప్రోత్సహిస్తూ మరింత అర్థవంతమైన ప్రయాణానుభూతిని అందించే దిశగా చేసిన ప్రయత్నమనీ ఆయన చెప్పారు. స్థానిక ఉత్పాదనలను కొనుగోలు చేయడానికే మొగ్గు చూపాలన్న (‘వోకల్ ఫర్ లోకల్’) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను పెంపొందింపచేస్తూ రాంచీ విమానాశ్రయంలో ఏవీఎస్ఏఆర్ (ఏయిర్పోర్ట్సు యాజ్ వెన్యూస్ ఫర్ స్కిల్డ్ ఆర్జిజాన్స్ ఆఫ్ ది రీజియన్.. ‘అవసర్’) విక్రయకేంద్రాన్ని కూడా ప్రారంభించి, ఆయా ప్రాంతాల చేతి వృత్తి కళాకారులను దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయంలో వారికి ఒక వేదికను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల, జార్ఖండ్లోని ప్రాంతీయ, గిరిజన చేతివృత్తి కళాకారుల ‘ సోహ్రాయీ చిత్రలేఖనం’ వంటి సాంప్రదాయిక కళారూపాలకు ప్రపంచ స్థాయిలో గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ కళను ప్రదర్శించేందుకు గిరిజన కళాకారులకు ఒక వేదిక లభించినట్లయింది.
‘‘మోదీ ప్రభుత్వ ఉద్దేశం విమానాశ్రయాల్ని నిర్మించడంతోనే సరిపెట్టుకోవడం ఎంతమాత్రం కాదు.. విమాన ప్రయాణాలు మరింత ఎక్కువ మందికి అందుబాటులో ఉండేటట్లు చూడడమూ, విమాన ప్రయాణాలకయ్యే ఖర్చును తగ్గించడమూ, ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం కూడా’’ అని మంత్రి వివరించారు.
రాంచీ మీదుగా ప్రయాణించే కుటుంబాలకు విమానాశ్రయ ప్రయాణాలను ఇదివరకటితో పోలిస్తే మరింత సౌకర్యవంతంగా, ఆనందదాయకంగా మార్చడానికి, ఎయిర్పోర్ట్ ప్రాంగణం లోపల ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కిడ్స్ జోనును ఏర్పాటు చేసి, బాలలకు సురక్షిత, ఆకర్షణీయ వినోద స్థలాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) విమానాశ్రయాల్ని ఏకీకృత ప్రయాణ కూడళ్లుగా మార్చే పనులను నిరంతర ప్రాతిపదికన చేపడుతోంది. ఈ కూడళ్లు కార్యకలాపాల నిర్వహణపరంగా శ్రేష్ఠతకు ప్రయాణికులకు సౌకర్యాల్నీ, లభ్యతనీ, ప్రాంతీయ గుర్తింపునీ జోడిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2263639)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18