ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జెనీవాలో 79వ ‘వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’ని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా
అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, డిజిటల్ హెల్త్ ఇన్నొవేషన్
గ్లోబల్ హెల్త్ సాలిడారిటీ పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించిన శ్రీ నడ్డా
‘ఏకోన్ముఖ ప్రభుత్వం’తో పాటు ‘ఏకోన్ముఖ సమాజం’ వైఖరిని అనుసరిస్తూ అందరికీ నాణ్యమైన, చౌకైన ఆరోగ్యసంరక్షణ సేవల్ని అందించే దిశగా పురోగమిస్తున్న భారత్: శ్రీ జే.పి. నడ్డా
‘‘88 కోట్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య ఐడీలను సిద్ధం
భారత్లో జాతీయ డిజిటల్ స్వాస్థ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్..
ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య రికార్డులతో పాటు సంరక్షణ నిరంతరాయంగా, ఎలాంటి అడ్డంకుల ప్రసక్తీ ఉండదు
‘‘నైతికతకీ, మనిషి ప్రయోజనాలకీ ప్రాధాన్యాన్నిచ్చే వ్యవస్థల్ని తీర్చిదిద్దాలన్న మన ఉమ్మడి సామర్థ్యంపైనే
కృత్రిమ మేధ భవిత
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 7:47PM by PIB Hyderabad
జెనీవాలో 79వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్ఏ) సర్వసభ్య సదస్సును ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఈ రోజు ప్రసంగించారు. ‘‘అందరి ఆరోగ్యాన్నీ సంరక్షించే’’ మార్గదర్శక సిద్ధాంతంలో భాగంగా అందరినీ సమానంగా చూస్తూ, అన్ని వర్గాలనూ కలుపుకొని ముందుకు పోతూ, ప్రజల ప్రయోజనాలే పరమార్థంగా స్వాస్థ్య సంరక్షణ సేవల్ని అందించాలని భారత్ దృఢసంకల్పాన్ని చెప్పుకొందని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యసంరక్షణ రంగానికి కొత్త రూపురేఖలను తీర్చిదిద్దడం: ఉమ్మడి బాధ్యత’’ ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన సదస్సును ఉద్దేశించి శ్రీ నడ్డా ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వాస్థ్య సంరక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేసే దిశగా భారత్ సమగ్ర విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. ‘‘ఏకోన్ముఖ ప్రభుత్వం’’తో పాటు ‘‘ఏకోన్ముఖ సమాజం’’ వైఖరిని పాటిస్తూ భారత్ నాణ్యమైన, ఖర్చులు తక్కువగా ఉండే ఆరోగ్య సేవలను అందరి అందుబాటులోకీ తీసుకువచ్చే దిశగా దూసుకుపోతోంది’’ అని ఆయన వివరించారు.
చౌకైన, నాణ్యమైన స్వాస్థ్య సంరక్షణ సేవల లభ్యతను విస్తరింప చేస్తూ, అందరికీ ఆరోగ్య సేవలందించే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. విస్తృత స్థాయి ప్రాథమిక ఆరోగ్యసంరక్షక సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి 1,85,000 కన్నా ఎక్కువ ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల’ను దేశం నలుమూలలా ప్రజా నివాసాలకు సమీపంలో భారత్ ఏర్పాటు చేసిందని అసెంబ్లీకి ఆయన తెలిపారు.
మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని తీసుకోదగ్గ సన్నాహక చర్యలతో పాటు, బలమైన ప్రజారరోగ్య సంరక్షక వ్యవస్థలను నిర్మించే దిశగా భారత్ చేస్తున్న కృషిని శ్రీ నడ్డా వివరించారు. రాబోయే కాలంలో ప్రజారోగ్యానికి ఎదురు కాగల సవాళ్లను దీటుగా ఎదుర్కొని పరిష్కరించడానికి ఆరోగ్యసంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలతో పాటు అత్యవసర ప్రతిస్పందనపూర్వక సామర్థ్యాల్ని ప్రభుత్వం నిరంతర ప్రాతిపదికన పటిష్టపరుస్తోందని వెల్లడించారు.
ఆరోగ్యసంరక్షణ రంగంలో సాంకేతికత పోషిస్తున్న పరివర్తనాత్మక పాత్రను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ 88 కోట్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను (యూనిక్ డిజిటల్ హెల్త్ ఐడీ కార్డ్స్) సిద్ధం చేసి, భారత జాతీయ డిజిటల్ ఆరోగ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. దీంతో దీర్ఘకాలం పాటు అమల్లో ఉండే స్వాస్థ్య రికార్డులూ, సంరక్షణకు ఉద్దేశించిన నిరంతరాయ, నిరంతర ప్రాతిపదిక కలిగిన సేవలకు మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు.
‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ విస్తృతినీ, ప్రభావాల్నీ శ్రీ నడ్డా వివరించారు. ఈ పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజారోగ్య హామీ పథకమనీ, సమాజంలో అత్యంత బలహీన వర్గాల ప్రజలు సహా దాదాపు 60 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధిని పొందేందుకు అవకాశం ఉందనీ ఆయన అన్నారు.
ఆరోగ్యసంరక్షణ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) పాత్ర రోజు రోజుకూ పెరుగుతోందని మంత్రి చెబుతూ, ఆరోగ్యసంరక్షణ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించిన ఒక వ్యూహాన్ని భారత్ ఇటీవల అమలు చేయడం మొదలుపెట్టిందని ప్రతినిధులకు తెలియజేశారు. నైతికతతో కూడిన, మనిషి ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిచ్చే వ్యవస్థల్ని తీర్చిదిద్దే విషయంలో మన అందరం చాటగల శక్తిసామర్థ్యాలపై ఏఐ భవిత ఆధారపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
‘‘ప్రపంచానికే ఔషధాలయం’’గా భారత్ నిలిచిందని శ్రీ నడ్డా పునరుద్ఘాటిస్తూ, తక్కువ ఖర్చులో జెనరిక్ ఔషధాలతో పాటు టీకామందుల ఉత్పత్తికి ఇండియా నాయకత్వం వహిస్తున్న విషయాన్ని తెలియజేశారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో భారత్ అందించిన తోడ్పాటును ఆయన గుర్తుకు తెస్తూ, ‘వ్యాక్సీన్ మైత్రి కార్యక్రమం’లో భాగంగా భారత్ సుమారు 30 కోట్ల టీకామందు డోసుల్ని దాదాపు 100 దేశాలకు సరఫరా చేసిందని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య రంగానికి భారత్ దీర్ఘకాలంగా అందిస్తున్న సహకారానికీ, సంఘీభావానికీ ఇది అద్దం పడుతోందని ఆయన అన్నారు.
సంఘీభావాన్ని చాటిచెప్పాలనే భావనతో, అందరికీ ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి సంబంధిత విధానాల్లో అవసరమైన మార్పుచేర్పులను ఈ సమావేశం చేపడుతూ, ఉమ్మడి బాధ్యతను తీసుకుని ముందడుగు వేసేటట్లు చూద్దాం రండి’’ అని సూచిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2263281)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15