రక్షణ మంత్రిత్వ శాఖ
పుట్టపర్తిలో ఏరోస్పేస్, రక్షణ ప్రాజెక్టుల శంకుస్థాపన/ భూమిపూజ కార్యక్రమాలకు హాజరు కానున్న రక్షణ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 MAY 2026 5:07PM by PIB Hyderabad
2026 మే 15న ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు ఏరోస్పేస్, రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాల్లో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఇందులో భాగంగా ఏరోనాటికల్ అభివృద్ధి సంస్థకు చెందిన విమానాల తయారీ, వైమానిక పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. విమానాల సమకలనం, పరీక్ష, ధ్రువీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం.. అధునాతన మధ్యస్థ యుద్ధ విమాన (ఏఎంసీఏ) అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తుంది.
అనకాపల్లి జిల్లాలోని టి. సిరసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ కు చెందిన అత్యాధునిక నావికా వ్యవస్థల తయారీ కేంద్రానికి కూడా రక్షణ మంత్రి శంకుస్థాపన చేస్తారు. అధునాతన జల గర్భ ఆయుధ వ్యవస్థలు, నౌకాదళ యుద్ధ వ్యవస్థల్లో పెరుగుతున్న అవసరాలను తీర్చడం కోసం ఈ సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో అగ్నేయాస్త్ర ఎనర్జిటిక్స్ లిమిటెడ్ (కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ)కు చెందిన రక్షణ రంగ పదార్థాల నిర్వహణ కేంద్రం, హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని మందుగుండు సామగ్రి, ఎలక్ట్రిక్ ఫ్యూజుల ప్లాంటుకు భూమి పూజ కూడా నిర్వహిస్తారు. వీటితోపాటు కర్నూలులోని డ్రోన్ సిటీకి సంబంధించి వరుస ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పలు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2261223)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13