ఆర్థిక మంత్రిత్వ శాఖ
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత ప్రభుత్వం, ఐఎఫ్ఏడీ సంయుక్తంగా 2026 నుంచి 2033 వరకు ఎనిమిదేళ్ల కాలానికిగానూ వ్యూహాత్మక అవకాశాల కార్యక్రమం (సీఓఎస్ఓపీ) ప్రారంభం
భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆదాయాన్ని పెంచటం, సుస్థిరతను బలపరచటం, స్థిరమైన ఉపాధి అవకాశాలను మెరుగుపరచటమే సీఓఎస్ఓపీ లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 8:30PM by PIB Hyderabad
అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్ఏడీ) భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం.. 2026 నుంచి 2033 వరకు ఎనిమిదేళ్ల కాలానికి దేశ వ్యూహాత్మక అవకాశాల కార్యక్రమాన్ని (సీఓఎస్ఓపీ) ప్రారంభించింది. భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆదాయాన్ని పెంచటం, సుస్థిరతను బలపరచటం, స్థిరమైన ఉపాధి అవకాశాలను విస్తరించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఐఎఫ్ఏడీ-గ్రామీణ వికాసానికి భారత భాగస్వామ్యం కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఐఎఫ్ఏడీ యాజమాన్యం , అభివృద్ధి భాగస్వాములు, ప్రైవేట్ రంగ ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.
భారత ప్రభుత్వ వికసిత్ భారత్-2047 దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన సీఓఎస్ఓపీ 2026-2033 ప్రధానంగా రెండు వ్యూహాత్మక ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తుంది:
(i) గ్రామీణ వర్గాల సామాజిక, ఆర్థిక, వాతావరణ స్థిరత్వాన్ని పెంపొందించటం
(ii) భారతదేశంతో పాటు గ్లోబల్ సౌత్లోని ఇతర దేశాల్లో నిరూపితమైన అభివృద్ధి నమూనాలను విస్తరించటానికి జ్ఞాన వ్యవస్థలను బలోపేతం చేయటం.
ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీమతి అనురాధా ఠాకూర్ ప్రసంగిస్తూ.. "భారత్-ఐఎఫ్ఏడీ భాగస్వామ్యం సుదీర్ఘమైనది మాత్రమే కాదు.. వ్యూహాత్మకమైనది. భారత్లో ఐఎఫ్ఏడీ కార్యక్రమాలు జాతీయ ప్రాధాన్యతలతో మమేకమై.. వ్యవసాయ రంగంలో మార్పు, జీవనోపాధిలో వైవిధ్యత, మహిళా సాధికారత, సంస్థాగత బలోపేతానికి మద్దతిస్తాయి"
"కాలక్రమేణా పేదరిక నిర్మూలనపైనే కాక.. వాతావరణ మార్పులను, ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకోగలిగేలా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్థిరమైన గ్రామీణ జీవనోపాధిని కల్పించటంపై దృష్టి మళ్లింది" అని ఆమె అన్నారు.
అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్ఏడీ) అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డోనాల్ బ్రౌన్ ప్రసంగిస్తూ.. "మనం కలిసి నిర్మిస్తున్నది కేవలం కొన్ని ప్రాజెక్టులు మాత్రమే కాదు. సంస్థలను, ఆర్థిక వనరులను, మౌలిక సదుపాయాలను, మార్కెట్లను అనుసంధానించే ఒక వ్యవస్థ. ఒక పెట్టుబడి ముగిసిన తర్వాత కూడా ఇది గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తుంది. అత్యంత విలువైన ఈ భాగస్వామ్యం ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు వీలుగా ఉంటుంది" అని అన్నారు.
ఈ కొత్త వ్యూహం.. స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీలు), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు), సహకార సంఘాల వంటి గ్రామీణ స్థాయి సంస్థలను బలోపేతం చేయటంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మార్కెట్లను అనుసంధానించే కీలక వేదికలుగా ఇవి పనిచేస్తాయి.
గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో ఐఎఫ్ఏడీ మద్దతుతో చేపట్టిన కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి. ముఖ్యంగా ఎస్హెచ్జీల ద్వారా మహిళలకు పెద్దఎత్తున ఆర్థిక సాయం అందించటంలో, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రైతులకు మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచటంలోనూ ఇవి కీలక పాత్ర పోషించాయి. ఉత్పత్తులకు విలువ జోడింపు, ఈ-కామర్స్ అనుసంధానం ద్వారా మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలను అభివృద్ధి చేయటంలో ఈ కార్యక్రమాలు ఎంతో ప్రభావం చూపాయి.
గ్రామీణాభివృద్ధిలో జ్ఞాన నాయకత్వ కేంద్రంగా భారతదేశాన్ని నిలపటం కూడా ఈ సీఓఎస్ఓపీ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా సమ్మిళిత గ్రామీణ ఆర్థిక సేవలు, సహకార పాలన, డిజిటల్ వ్యవసాయ సేవలు, వాతావరణ మార్పులను తట్టుకోగల విలువైన వ్యవస్థల వంటి విజయవంతమైన నమూనాలను ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలోని భాగస్వామ్య దేశాలతో పంచుకునేందుకు ఇది దోహదపడుతుంది.
ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయటానికి, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలకు మద్దతిచ్చేందుకు ఐఎఫ్ఏడీ, నాబార్డ్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.
భారత్, ఐఎఫ్ఏడీ మధ్య దాదాపు ఐదు దశాబ్దాలుగా భాగస్వామ్యం కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో 35 గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయటం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు చేయూతనివ్వటమే కాక, సమగ్రాభివృద్ధికి ఈ భాగస్వామ్యం సహకరించింది.
గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచటం, స్థిరత్వాన్ని నెలకొల్పటం, సుస్థిరాభివృద్థికి ఆవిష్కరణలను వినియోగించుకోవటంతో పాటు ప్రపంచ అభివృద్ధి సహకారానికి తోడ్పడాలనే భారత ప్రభుత్వ నిబద్ధతను నూతన సీఓఎస్ఓపీ స్పష్టం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2260568)
సందర్శకుల సూచీ సంఖ్య : : 61