భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ లో విద్యుత్ వాహన విప్లవానికి ఊపిరి పోస్తున్న ప్రధాని శ్రీ మోదీ దార్శనికత
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద కర్ణాటకకు 1,243 కొత్త విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలు; జాతీయ విద్యుత్ వాహనాల చార్జింగ్ పై జాతీయ సదస్సుకు బెంగళూరు ఆతిథ్యం
విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహంపై ప్రధాని శ్రీ మోదీ దార్శనికతకు విశేష స్పందన
కర్ణాటకలో విద్యుత్ వాహన చార్జింగ్ రంగం అభివృద్ధికి రూ. 123.26 కోట్ల కేటాయింపును ప్రకటించిన శ్రీ హెచ్.డి. కుమారస్వామి
ప్రధాని శ్రీ మోదీ దార్శనికతతో స్వయం సమృద్ధ విద్యుత్ వాహన వ్యవస్థ వైపు భారత్ అడుగులు: కుమారస్వామి
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 6:23PM by PIB Hyderabad
స్వచ్ఛ ఇంధనంతో రవాణా రంగం మార్పు దిశగా భారత్ ముందడుగు వేసింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద దేశ విద్యుత్ వాహన చార్జింగ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి మంగళవారం బెంగళూరులో కీలక ఆమోదాలు, విధానపరమైన నిర్ణయాలను ప్రకటించారు.
కర్ణాటకకు సంబంధించి, రాష్ట్రంలో 123.26 కోట్ల రూపాయల వ్యయంతో 1,243 విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల ఆమోదాన్ని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన భారత విద్యుత్ వాహన రంగం మార్పులో కర్ణాటకను అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలబెట్టింది.
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్త విద్యుత్ వాహన చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనపై బెంగళూరులో జరిగిన జాతీయ సదస్సులో కుమారస్వామి మాట్లాడారు. భారత ప్రముఖ విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలలో ఒకటిగా బెంగళూరు అవతరించిందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ ఇంధన వాహన రంగం వైపు దేశవ్యాప్త మార్పును వేగవంతం చేయడంలో ఇతర రాష్ట్రాలు కూడా చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 4,874 విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటివరకు 503.86 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు మంత్రి తెలిపారు. ఈ ఆమోదిత ప్రతిపాదనల్లో హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రధాన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ, 2070 నాటికి కర్బన ఉద్గారాల రహిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కట్టుబడి ఉంటూనే, వికసిత భారత్ 2047 దార్శనికత వైపు భారత్ స్థిరంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి శ్రీ కుమారస్వామి తెలిపారు. సుస్థిరత, ఆవిష్కరణలు, విస్తృతికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యత రవాణా, ఇంధన రంగాల పట్ల భారత్ దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో వాహన రంగం వాటా 7 శాతానికి పైగా ఉందని, తయారీ రంగ స్థూల దేశీయోత్పత్తిలో ఇది దాదాపు సగం అని మంత్రి చెప్పారు. సుమారు 3 కోట్ల మంది జీవనోపాధికి ఈ రంగం అండగా నిలుస్తూ, దేశ స్వచ్ఛ ఇంధన రవాణా మార్పులో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్ రవాణా సాంకేతికతలకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడానికి భారీ పరిశ్రమల శాఖ ప్రారంభించిన పలు ప్రధాన కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. వీటిలో బ్యాటరీ సెల్ తయారీ కోసం 18,100 కోట్ల రూపాయల పీఎల్ఐ ఏసీసీ పథకం, విద్యుత్ వాహనాలు, హైడ్రోజన్ వాహనాలతో సహా స్వచ్ఛమైన వాహనాలను ప్రోత్సహించే 25,938 కోట్ల రూపాయల పీఎల్ఐ ఆటో పథకం, అరుదైన భూ అయస్కాంతాల తయారీలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ఇటీవల ప్రారంభించిన 7,280 కోట్ల రూపాయల ఆర్ఈపీఎం పథకం ఉన్నాయి.
పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని భారత్ విద్యుత్ వాహన మార్పునకు మూలస్తంభంగా అభివర్ణిస్తూ, ఈ 10,900 కోట్ల రూపాయల కార్యక్రమం విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, బస్సులు, ట్రక్కుల వినియోగాన్ని వేగవంతం చేస్తోందని శ్రీ కుమారస్వామి తెలిపారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన విద్యుత్ వాహన చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఇది కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ వాహన బహిరంగ చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా 2,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణలో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ సంస్థల కృషిని కూడా మంత్రి ప్రస్తావించారు. ఫేమ్-2 పథకం కింద, భారీ పరిశ్రమల శాఖ నుంచి లభించిన 873.5 కోట్ల రూపాయల రాయితీ సహాయంతో ఈ సంస్థలు దేశవ్యాప్తంగా 8,932 విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వీటిలో 721 కేంద్రాలు ఒక్క కర్ణాటకలోనే ఏర్పాటయ్యాయి.
ఆవిష్కరణలు, అమలు సామర్ధ్యాల ద్వారా భారత విద్యుత్ వాహన వ్యవస్థను బలోపేతం చేయడంలో చార్జ్ పాయింట్ ఆపరేటర్లు, టాటా పవర్, చార్జ్ జోన్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పారిశ్రామిక సంస్థల పాత్రను కూడా శ్రీ కుమారస్వామి ప్రశంసించారు.
మంత్రిత్వ శాఖ తదుపరి ప్రధాన కార్యక్రమాన్ని వివరిస్తూ, జాతీయ ఏకీకృత విద్యుత్ వాహన చార్జింగ్ యాప్ - యూనిఫైడ్ భారత్ ఇ-చార్జ్ (యూబీసీ) ని రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వివిధ సంస్థల చార్జింగ్ కేంద్రాలను నమ్మకమైన ఒకే వేదిక ద్వారా గుర్తించడానికి, వినియోగించుకోవడానికి, రుసుము చెల్లించడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ తీసుకొచ్చిన మార్పుతో దీనిని పోలుస్తూ, ఈ ప్రయత్నం భారత విద్యుత్ వాహన చార్జింగ్ వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో విద్యుత్ వాహన రంగ వేగవంతమైన వృద్ధికి తోడ్పడేలా గ్రిడ్ సంసిద్ధత, ప్రామాణీకరణ, డిజిటల్ అనుసంధానంపై విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల భాగస్వాములను సమన్వయం చేసుకుంటూ భారీ పరిశ్రమల శాఖ పని చేస్తోందని కుమారస్వామి తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ, భారత విద్యుత్ వాహన చార్జింగ్ మౌలిక సదుపాయాల వ్యూహం మూడు ప్రధాన సూత్రాలు - అందరికీ అందుబాటు, తక్కువ ధర, విశ్వసనీయత - ఆధారంగా ఉంటుందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో చార్జింగ్ సదుపాయాలు సులభంగా దొరికేలా, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా, నమ్మదగ్గవిగా ఉండేలా చూడటమే ఈ సూత్రాల లక్ష్యమని ఆయన వివరించారు.
"మనం కేవలం చార్జింగ్ స్టేషన్లను మాత్రమే ఏర్పాటు చేయడం లేదు. భారత భవిష్యత్తుకు శక్తిని అందిస్తున్నాం" అని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ప్రపంచ స్వచ్ఛ ఇంధన రవాణా మార్పును ముందుండి నడిపించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2260521)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15