జాతీయ మానవ హక్కుల కమిషన్
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా ఎంజీఎంఎస్సీ నర్సింగ్ కళాశాల వసతి గృహంలో19మంది విద్యార్థినులకు క్షయ వ్యాధి సోకినట్లు వచ్చిన మీడియా కథనాన్ని సుమోటోగా విచారణకు తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్
వసతి గృహంలోని విద్యార్థినులు కిక్కిరిసిన, తేమతో కూడిన, అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నట్టు వెల్లడించిన మీడియా నివేదిక
ఈ అంశంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 5:11PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఉన్న ఎంజీఎంఎస్సీ నర్సింగ్ కళాశాల వసతి గృహంలో పందొమ్మిదిమంది విద్యార్థినులకు క్షయ వ్యాధి సోకినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ చేపట్టింది. ఇటీవల ఆ ప్రాంగణాన్ని రెండుసార్లు తనిఖీ చేసినప్పుడు పారిశుధ్య సౌకర్యాలు సహా మొత్తం హాస్టల్ నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అయినప్పటికీ అధికారులు ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థినులు ఈ వ్యాధి బారిన పడినట్టు మీడియా కథనం పేర్కొంది.
వార్తా కథనంలోని అంశాలు నిజమైతే, అవి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన విషయమని కమిషన్ స్పష్టం చేసింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది.
మే నెల రెండో తేదీ నాటి వార్తా కథనంలో మార్చి 31, ఏప్రిల్ 17 తేదీల్లో నిర్వహించిన రెండు తనిఖీల ఆధారంగా గుర్తించిన పలు లోపాలను పేర్కొన్నారు. ఆ వసతి గృహంలో విద్యార్థినులు కిక్కిరిసిన, తేమతో కూడిన, తగినన్ని మరుగు దొడ్లు లేని అపరిశుభ్ర వాతావరణంలో ఉంటున్నారని, అక్కడి ఆహారం కూడా కనీస పోషకాలు లేకుండా నాసిరకంతో ఉందని వార్తా కథనం పేర్కొంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వారికి విశ్రాంతి ఇవ్వడం లేదని, సెలవు దినాల్లో సైతం ఆసుపత్రి సిబ్బంది మాదిరి బలవంతంగా పని చేయిస్తున్నారని ఆరోపించింది.
***
(రిలీజ్ ఐడి: 2258900)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5