రక్షణ మంత్రిత్వ శాఖ
మూడు రోజుల పర్యటన నిమిత్తం జర్మనీ వెళ్లనున్న రక్షణ మంత్రి
రక్షణ పరిశ్రమ సహకారాన్ని పెంపొందించటం, సైనిక సంబంధాలను బలోపేతం చేయటం, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అవకాశాల అన్వేషణపై దృష్టి
నాడు పోస్టు చేయడమైనది:
19 APR 2026 12:00PM by PIB Hyderabad
భారత్-జర్మనీ మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఏప్రిల్ 21 నుంచి 23, 2026 వరకు జర్మనీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జర్మనీ రక్షణ మంత్రి శ్రీ బోరిస్ పిస్టోరియస్తో, ఆ దేశ ఇతర ఉన్నతాధికారులతో శ్రీ రాజ్నాథ్ సింగ్ చర్చిస్తారు.
రక్షణ పరిశ్రమ సహకారాన్ని పెంపొందించటం, సైనిక సంబంధాలను బలోపేతం చేయటం, సైబర్ భద్రత, కృత్రిమ మేధ, డ్రోన్ల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అవకాశాల అన్వేషణపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. రక్షణ పరిశ్రమ సహకార రోడ్మ్యాప్, యూఎన్ శాంతి పరిరక్షణ కార్యకలాపాల శిక్షణలో సహకారంపై ఇరుదేశాల రక్షణ మంత్రుల సమక్షంలో ఒప్పందాలు జరిగే అవకాశముంది.
ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ రంగంలోని సహకార చర్యలను సమీక్షించటానికి, రక్షణ పరిశ్రమల మధ్య నూతన భాగస్వామ్య అవకాశాలను గుర్తించటానికి ఈ పర్యటన తోడ్పడుతుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో జర్మనీ రక్షణ రంగంలోని కీలక ప్రతినిధులతో శ్రీ రాజ్నాథ్ సింగ్ సమావేశం అవుతారు.
ఏడేళ్ల తర్వాత భారత రక్షణ మంత్రి జర్మనీలో పర్యటించటం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 2019లో చివరిసారిగా, అప్పటి రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ జర్మనీలో పర్యటించారు. జూన్ 2023లో బోరిస్ పిస్టోరియస్ భారతదేశాన్ని సందర్శించి, శ్రీ రాజ్నాథ్ సింగ్తో సుదీర్ఘ చర్చలు జరిపారు.
ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన, అంతర్జాతీయ నిబంధనలకు భారత్, జర్మనీ కట్టుబడి ఉన్నాయి. ఇరుదేశాల మధ్య బలమైన, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలున్నాయి. కొన్నేళ్లుగా రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం ఈ భాగస్వామ్యంలో కీలకంగా మారింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయటం, ప్రాంతీయ, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి దోహదపడటమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
***
(రిలీజ్ ఐడి: 2253623)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7