మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన-III (పీఎంజీఎస్‌వై-III) కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం...

మార్చి 2025 నుంచి మార్చి 2028 వరకు పథకం గడువు పొడగింపు

నాడు పోస్టు చేయడమైనది: 18 APR 2026 3:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన-III (పీఎంజీఎస్‌వై-III) కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం గడువును మార్చి 2025 నుంచి మార్చి 2028 వరకు పొడగించేందుకు కేబినెట్ ఆమోదించింది. 

 

గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు (జీఆర్ఏఎంలు), ఉన్నత పాఠశాలలు, ఆస్పత్రులను కలిపే ప్రధాన గ్రామీణ మార్గాలను, అనుసంధాన రహదారులను ఈ పథకం ద్వారా బలోపేతం చేస్తారు. ఈ పథకం సవరించిన అంచనా వ్యయం రూ.83,977 కోట్లు.

 

మంత్రివర్గ ఇతర నిర్ణయాలతో పాటు ఆమోదం తెలిపిన మరిన్ని అంశాలు:

 

i. మైదాన ప్రాంతాల్లోని రహదారులు, వంతెనలు, కొండ ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మార్చి 2028 వరకు కాలపరిమితిని పొడగించారు.

 

ii. కొండ ప్రాంతాల్లోని వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు కాలపరిమితిని మార్చి 2029 వరకు పొడగించారు.

 

iii. 31.03.2025 కన్నా ముందుగా మంజూరై, ఇప్పటికీ టెండర్లు ఖరారు కాని పనులకు సంబంధించి, టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు, పనులను అప్పగించేందుకు అనుమతిచ్చారు.

 

iv. ఇప్పటికే మంజూరై, అనుమతుల కోసం వేచి ఉన్న 161 పొడవైన వంతెనలను (వీటి అంచనా వ్యయం సుమారు రూ.961 కోట్లు) మంజూరు చేయవచ్చు. వాటికి సంబంధించి టెండర్లను పిలిచి, పనులను అప్పగించవచ్చు.

 

v. మొదట్లో కేటాయించిన రూ.80,250 కోట్ల వ్యయాన్ని రూ.83,977 కోట్లకు పెంచుతూ సవరించారు.

ప్రయోజనాలు:

 

పీఎంజీఎస్‌వై-III కాలపరిమితిని పొడగించటం ద్వారా గ్రామీణ రహదారుల ఆధునీకీకరణ పనులు పూర్తవటమే కాక, ఈ పథకం ద్వారా ఆశించిన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు ప్రజలకు అందుతాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యానికి ఈ పథకం ఊతమిస్తుంది. ఇది రవాణా సమయాన్ని, ఖర్చులను తగ్గించి గ్రామీణ ప్రజల ఆదాయాన్ని పెంచుతుంది. మెరుగైన రహదారి సౌకర్యాల వల్ల విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలకు వెళ్లటం సులభతరమవుతుంది. ముఖ్యంగా మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో సకాలంలో అత్యవసర సేవలు అందుతాయి.

 

ఈ పథకం అమలు కొనసాగటం వల్ల భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిర్మాణ పనుల వల్ల ప్రత్యక్షంగా, గ్రామీణ పరిశ్రమలు, సేవల ప్రోత్సాహం ద్వారా పరోక్షంగా అవకాశాలు మెరుగుపడతాయి. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ‌్యత్యాసాన్ని తగ్గించి, వికసిత్ భారత్-2047 దార్శనికతను ముందుకు తీసుకెళ్లటం ద్వారా సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి ఈ పొడగింపు దోహదపడుతుంది.

 

***

 


(రిలీజ్ ఐడి: 2253295) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Gujarati , Kannada