రక్షణ మంత్రిత్వ శాఖ
క్యాడెట్ల కోసం జాతీయ స్థాయి సైబర్ భద్రత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేషనల్ క్యాడెట్ కోర్
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2026 4:35PM by PIB Hyderabad
సైబర్ అవగాహన, డిజిటల్ పరిశుభ్రత, ఆచరణాత్మక సైబర్ రక్షణ నైపుణ్యాల్లో క్యాడెట్లకు క్రమబద్ధమైన శిక్షణ అందించి సాధికారత కల్పించే దిశగా నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) సహకారంతో ఒక సమగ్ర సైబర్ భద్రత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్, ఎన్ఐఈఎల్ఐటీ డీజీ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి సమక్షంలో ఎన్సీసీ, ఎన్ఐఈఎల్ఐటీ మధ్య దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ కార్యక్రమాన్ని రెండు దశలుగా అమలు చేస్తారు. మొదటి దశ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కార్యక్రమం. ఇది 15 గంటల ఆన్లైన్ శిక్షణ మాడ్యూల్. డిజిటల్ అక్షరాస్యత, సురక్షిత ఇంటర్నెట్ పద్ధతులు, సైబర్ హైజీన్, సైబర్ ముప్పులపై అవగాహన వంటి ప్రాథమిక అంశాలను అందించేందుకు దీనిని రూపొందించారు. దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్న ఎన్సీసీ క్యాడెట్లు అందరికీ ఎన్ఐఈఎల్ఐటీ డిజిటల్ యూనివర్శిటీ వేదిక ద్వారా అందుబాటులో ఉంటారు.
రెండో దశ, సైబర్ డిఫెండర్ కార్యక్రమం. ప్రతిభ ఆధారిత స్క్రీనింగ్ విధానం ద్వారా ఎంపిక చేసిన క్యాడెట్లకు 60 గంటల ఆఫ్లైన్ శిక్షణ అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ దశలో ప్రయోగాత్మక శిక్షణ, వాస్తవ సమస్యల అనుకరణ, సైబర్ భద్రతా సాధనాలు, మెలకువలపై శిక్షణ అందించేలా దృష్టి సారిస్తారు. ఫలితంగా.. సైబర్ ముప్పులను క్యాడెట్లు గుర్తించి సమర్థమైన రీతిలో ప్రతిస్పందిస్తారు.
క్షేత్ర స్థాయిలో సైబర్ అవగాహనను పెంపొందించేలా, సురక్షితమైన డిజిటల్ ప్రక్రియలను ప్రోత్సహించేలా, సైబర్ భద్రతా కార్యక్రమాలకు మద్దతునిచ్చేలా సుశిక్షితులైన ఎన్సీసీ సైబర్ క్యాడెట్లను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. డిజిటల్ ఇండియా, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్) పరిధిలో జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2251663)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10